
సాక్షి, విశాఖటపట్నం : బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో రెండురోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విశాఖ నగరం అతలాకుతలం అవుతోంది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే విశాఖ తెన్నేటి పార్క్ తీరానికి ఓ భారీ నౌక కొట్టుకుని వచ్చింది. బంగ్లాదేశ్కు చెందిన మర్చంట్ వెసల్ నౌక భారీ ఈదురు గాలులకు కొట్టుకువచ్చింది. గాలితీవ్రత ఎక్కవగా వుండటంతో ప్రతికూల పరిస్ధితుల్లో ఒడ్డుకు చేరుకున్న 80 మీటర్ల పొడవాటి నౌక పార్క్ సమీపంలోని రాళ్లలో చిక్కుకుంది. అర్ధరాత్రి సమయంలో ఇసుక తిన్నుల మధ్య చిక్కుకోగా.. నౌకలోని సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. యాంకర్లు రెండూ కోల్పోవడంతో ఏర్పడిన సమస్య తలెత్తినట్లు అధికారులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న నేవీ అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నౌకను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు నౌకను చూసేందుకు స్ధానికులు పెద్ద ఎత్తున తీరానికి చేరుకుంటున్నారు. (భారీ వర్షాలు: తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం)
Comments
Please login to add a commentAdd a comment