
పెందుర్తి: ఆపన్నులను ఆదుకోవడంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిది అందె వేసిన చేయి. ఎవరైనా పేదలు వారి బాధను చెప్పుకొన్న వెంటనే స్పందిస్తారు. వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తారు. బుధవారం విశాఖకు వచ్చిన సీఎం జగన్ ఇదే విధంగా మెదడులో గడ్డతో బాధ పడుతున్న ఓ బాలుడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.
పెందుర్తి మండలం జెర్రిపోతులపాలేనికి చెందిన సాలాపు నూకరాజు, సత్యకళ దంపతుల కుమారుడు లీలాధర్నాయుడు (10)కు చిన్న వయసులోనే మెదడులో క్యాన్సర్ గడ్డ ఏర్పడింది. వయసు పెరిగేకొద్దీ అది పెరిగి గొంతు వరకు వచ్చింది. స్థానిక ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా ఫలితం లేకపోవడంతో బెంగుళూరులోని నిమ్హాన్స్ ఆసుపత్రిలో చూపించారు. అక్కడ మందుల ఖర్చు ఎక్కువయ్యే పరిస్థితి ఉంది.
బుధవారం చినముషిడివాడ వచ్చిన సీఎం వైఎస్ జగన్ను నూకరాజు, సత్యకళ దంపతులు కలిశారు. వారి కుమారుడి పరిస్థితిని వివరించారు. సమస్యను సావధానంగా విన్న సీఎం వైఎస్ జగన్ తక్షణమే రూ.లక్ష ఆర్థిక సాయం అందించాలని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జునను ఆదేశించారు. అధికారులు వెంటనే చెక్ను సిద్ధం చేశారు. ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్, జీవీఎంసీ ఏడీసీ సన్యాసిరావు ఆ చెక్ను బాలుడి తల్లిదండ్రులకు అందజేశారు.
సీఎం ఎంతో మేలు చేశారు బాలుడి తల్లి సత్యకళ
మా కుమారుడి పరిస్థితిని చెబుతుంటే సీఎం జగనన్న చలించిపోయారు. వెంటనే మాకు ఆర్థిక సాయం చేయాలని కలెక్టర్కి చెప్పారు. తక్షణమే రూ.లక్ష మాకు ఎమ్మెల్యే అదీప్రాజ్ చేతుల మీదుగా ఇచ్చారు. సీఎం జగనన్న మాకు ఎంతో మేలు చేశారు. ఆయన మేలు ఎన్నటికీ మరచిపోలేం.
Comments
Please login to add a commentAdd a comment