
పాలనకు మానవీయతను జోడించిన వైఎస్సార్
నేడు 15వ వర్ధంతి
సాక్షి, అమరావతి: వైఎస్సార్.. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా ఉన్నది ఐదేళ్ల మూడు నెలలే! కానీ మంచి చేయాలన్న మనసుంటే ప్రజలకు ఎంత మేలు చేయవచ్చో ఆ కొద్ది కాలంలోనే నిరూపించారు. భౌతికంగా దూరమైనా ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. సోమవారం వైఎస్సార్ 15వ వర్ధంతి సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం...
పాదయాత్రతో కాంగ్రెస్కు జీవం
వరుస ఓటములతో 2003 నాటికి కాంగ్రెస్ జీవచ్ఛవంలా మారిన తరుణంలో వైఎస్సార్ ఉమ్మడి రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి మండుటెండలో 2003 ఏప్రిల్ 9న ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించారు. మండుటెండలో 1,475 కి.మీ. నడిచారు. పాదయాత్రతో కాంగ్రెస్కు జీవం పోసి 2004లో ఇటు ఉమ్మడి రాష్ట్రంలో, అటు కేంద్రంలోనూ అధికారంలోకి తెచ్చారు. 2004 మే 14న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై నుంచే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా ఫైలుపై తొలి సంతకం చేసి రూ.1,100 కోట్ల వ్యవసాయ విద్యుత్ బకాయిలను మాఫీ చేశారు. దాదాపు 35 లక్షలకు పైగా పంపు సెట్లకు ఉచిత విద్యుత్ను అందించారు.
ఆరోగ్యశ్రీ... ఫీజులు
2004 మే 14 నుంచి 2007 జూన్ 26 వరకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.168.52 కోట్లను వైఎస్సార్ విడుదల చేశారు. అనంతరం ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందించేలా ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. 108, 104 స రీ్వసులను ప్రారంభించారు. ఆయన తెచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకంతో లక్షలాది పేద విద్యార్థులకు మేలు జరిగింది. జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం.. తాడేపల్లిగూడెంలో ఉద్యాన వర్సిటీ.. తిరుపతిలో పశువైద్య కళాశాల, హైదరాబాద్లో ఐఐటీని ఏర్పాటు చేశారు. బాసర, ఇడుపులపాయ, నూజివీడు వద్ద ట్రిపుల్ ఐటీలను నెలకొల్పారు. జలయజ్ఞం ద్వారా ఒకేసారి 86 ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఐదేళ్లలో 23.49 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా 41 ప్రాజెక్టులను పూర్తి చేశారు. గంగవరం, కృష్ణపట్నం, కాకినాడ పోర్టులు నిరి్మంచారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment