
అగ్ని ప్రమాదంలో 60 గొర్రెలు సజీవ దహనం
ములకలచెరువు : అగ్ని ప్రమాదంలో 60 గొర్రెలు సజీవదహనమైన సంఘటన ఆదివారం మండలంలో జరిగింది. బాధితుడు, స్థానికుల కథనం మేరకు.. మండలంలోని పర్తికోట పంచాయతీ పల్లెగడ్డగా పిలవబడే వసంతరాయునిపల్లెకు చెందిన పూజారి శ్రీరాములు గొర్రెలు మేపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఉదయం మేత కోసం తన 122 గొర్రెలను సమీపంలోని సంద్రకొండకు తోలుకొని వెళ్లాడు. అక్కడ కొందరు ఆకతాయిలు మధ్యాహ్నం కొండకు నిప్పు పెట్టారు. గమనించిన కాపరి తన గొర్రెలను కొండ నుంచి కిందికి దింపే ప్రయత్నం చేశాడు. కానీ మంటలు వేగంగా కొండకు చుట్టుముట్టడంతో గొర్రెల మంద మంటల్లో చిక్కుకుపోయింది. బాధితుడు విషయాన్ని గ్రామస్తులకు సమాచారం అందించాడు. గ్రామస్తులు వెళ్లేలోపే సుమారుగా 60 గొర్రెలు అగ్నికి ఆహాతయ్యాయి. మిగిళిన గొర్రెలను గ్రామస్తులు రక్షించారు. మిగిలిన వాటిలో సైతం గొర్రెలు అగ్నిలో కాలి తీవ్రంగా గాయపడ్డాయి. కళ్ల ముందే గొర్రెలు మంటల్లో కాలిపోవడంతో రైతు తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. సంఘటన స్థలాన్ని పశువైద్యాధికారి నివేదిత, ఎస్ఐ నరసింహుడు పరిశీలించారు. నిరుపేద కుటుంబానికి చెందిన తనను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు వేడుకొన్నాడు.

అగ్ని ప్రమాదంలో 60 గొర్రెలు సజీవ దహనం