
ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలి
సంబేపల్లె/రాయచోటి టౌన్/చిన్నమండెం : ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఎదుట ఇంకుడుగుంతలు నిర్మంచుకోవాలని మంత్రి మండిపల్లె రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని నారాయణరెడ్డిపల్లె, కొండవాండ్లపల్లె, చిన్నమండెం మండలంలోని చిన్నమండెం టౌన్, బెస్తపల్లె గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులతో భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయని, అందరూ నీటి తొట్టెలు నిర్మించుకోవాలని కోరారు. జిల్లాకు 1115 నీటి తొట్టెలు మంజూరు చేశామని, పది రోజుల్లో పూర్తిచేయాలని డ్వామా పీడీ వెంకటరత్నంకు ఆయనసూచించారు. వాటి నిర్మాణంతో పాడి పశువులు, గొర్రెలు, మేకలకు ఎంతో మేలు జరుగుందన్నారు. అనంతరం నారాయణరెడ్డిపల్లె, కొండవాండ్లపల్లెల్లో నీటితొట్టెల నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం చిన్నమండెం టౌన్లో రూ.15 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, బెస్తపల్లె గ్రామంలో నూతన బోరును ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.