రైలెక్కాలంటే ఆపసోపాలే | - | Sakshi

రైలెక్కాలంటే ఆపసోపాలే

Mar 19 2025 2:08 AM | Updated on Mar 19 2025 2:08 AM

రైలెక

రైలెక్కాలంటే ఆపసోపాలే

చీరాల టౌన్‌: చీరాల మండలంలోని ఈపురుపాలెం రైల్వేస్టేషన్‌ నుంచి ప్రతి రోజు విజయవాడకు నాలుగు, గూడూరు, బిట్రగుంటకు నాలుగు రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈపురుపాలెం స్టేషన్‌ నుంచి మేజర్‌ గ్రామమైన ఈపురుపాలెం, తోటవారిపాలెం, బోయినవారిపాలెం, పిట్టువారిపాలెం, సాయికాలనీ, గవినివారిపాలెం గ్రామాల నుంచి రోజు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అంతేగాక వ్యవసాయ సీజన్‌లో వందలాది మంది కూలీలు ఈపురుపాలెం నుంచి తెనాలి, ఒంగోలు వరకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇటీవల ఈ స్టేషన్‌ను కేంద్రం మూడో రైల్వేలైన్‌ వేసింది. టికెట్‌ కౌంటర్‌, ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడే అసలు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఎక్కడైనా టికెట్‌ కౌంటర్‌కు దగ్గర్లోనే ఫుట్‌ఓడర్‌ బ్రిడ్జి ఉంటుంది. ఈ స్టేషన్లో మాత్రం టికెట్‌ కౌంటర్‌ బోయినవారిపాలెం వైపు ఉంటే.. ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి మాత్రం సావరపాలెం వైపు 100 మీటర్లు దూరంలో ఉంది. ఉదయం వేళల్లో ట్రైన్‌ ఎక్కేందుకు వచ్చిన ప్రయాణికులు అటు టికెట్‌ తీసుకుని ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిపై నుంచి వచ్చి ఫ్లాట్‌ఫాంకు చేరుకునేలోపు రైలు స్టేషన్‌ను వదలివెళ్లిపోయిన ఘటనలు అనేకం ఉన్నాయి.

ఎత్తు తక్కువగా ప్లాట్‌ ఫాం

ఉదయం వేళల్లో విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు రైలు ఎక్కేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ప్లాట్‌ ఫాం ఎత్తుగా లేకపోవడంతో రైలు ఎక్కేందుకు పిల్లలు, మహిళలు, వృద్ధులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణాలు చేస్తున్నారు. అధికారులు స్పందించి ప్లాట్‌ ఫాం ఎత్తు పెంచాలని కోరుతున్నారు. పరిసరాల్లో లైట్లు ఏర్పాటు చేయాలని విన్నవిస్తున్నారు. లైట్లు సక్రమంగా లేకపోవడంతో మద్యం తాగేవారు, జల్సారాయుళ్లకు స్టేషన్‌ ఆవాసంగా మారుతోంది. దీంతో రాత్రివేళల్లో ఈపురుపాలెం స్టేషన్లో దిగాల్సిన ప్రయాణికులు చీరాలలో దిగి ఇంటికి చేరుతున్నారు. ఇకనైనా పాలకులు స్పందించి స్టేషన్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ప్రయాణికులు, ప్రజలు కోరుతున్నారు.

చేనేతలు, వ్యవసాయ కూలీలు, వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ఉద్యోగులు ఉన్న ప్రాంతం ఈపురు పాలెం. ఈ గ్రామంలో రోజుకు ఎనిమిది రైళ్లు ఆగే రైల్వేస్టేషన్‌ ఉంది. చైన్నె, విజయవాడ మార్గాల్లో కీలకమైన స్టేషన్‌. చీరాల రూరల్‌ మండలంలోని చాలా గ్రామాల్లోని ప్రజలకు విజయవాడ, తిరుపతి, ఒంగోలు, నెల్లూరు వెళ్లేందుకు అనువైన స్టేషన్‌ ఇది. కానీ కనీస వసతులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నిత్యం వచ్చే వారు టికెట్‌ తీసుకోవాలన్నా, రైలు ఎక్కాలన్నా అవస్థలు తప్పడం లేదు.

దూరంగా టికెట్‌ కౌంటర్‌,

నూతనంగా నిర్మించిన ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి

తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

రైలెక్కాలంటే ఆపసోపాలే 1
1/2

రైలెక్కాలంటే ఆపసోపాలే

రైలెక్కాలంటే ఆపసోపాలే 2
2/2

రైలెక్కాలంటే ఆపసోపాలే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement