
46 ఎకరాల గడ్డివాములు దగ్ధం
తెనాలిరూరల్: అగ్నిప్రమాదంలో సుమారు రూ.ఐదు లక్షల విలువైన 46 ఎకరాల వరిగడ్డి వాములు దగ్ధమైన ఘటన తెనాలి పినపాడు వద్ద మంగళవారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. గుంటూరు జిల్లా పినపాడు ప్రాంతానికి చెందిన 13 మంది రైతులు ఉమ్మడిగా గడ్డివాములను వేశారు. 46 ఎకరాలు గడ్డిని 15 గడ్డివాములుగా ఏర్పాటు చేసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆకస్మాత్తుగా మంటలు వ్యాపించి గడ్డివాములు తగలబడటం ప్రారంభించాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందిచగా, సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు. గడ్డి వాములు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎండ వేడికి దగ్ధమయాయా? లేక ఎవరైనా నిప్పు పెట్టారా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. రైతులు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా ఇక్కడే గడ్డి వాములు వేస్తున్నామని, పంటలు నూర్పి గడ్డిని 13మంది రైతులము కలిసి ఒకచోట వాములు వేశామని, గడ్డికి ఎలా మంటలు వ్యాపించాయో తెలియదని చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు అర్పిన లాభం లేకుండా పోయిందని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.