
అర్జీలను వెంటనే పరిష్కరించాలి
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
బాపట్ల: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జె. వెంకటమురళి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీదారుల ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకొని ప్రభుత్వానికి పంపాలని ఆయన చెప్పారు. సంబంధిత పంచాయతీ కార్యదర్శులు గ్రామాలకు వెళ్లి లబ్ధిదారులతో మాట్లాడి ఆడియో తీసుకొని వారితో సెల్ఫీ దిగి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని చెప్పారు. జిల్లాలో జరిగిన డి.ఆర్.సి. సమావేశంలో ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై తీసుకున్న చర్యల రిపోర్టులను తయారు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి.గ్లోరియా, డి.ఆర్.డి.ఎ. ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి రామకృష్ణ, జిల్లా రవాణాశాఖ అధికారి పరంధామ రెడ్డి, జిల్లా అటవీ శాఖ అధికారి ఎల్. భీమయ్య, జిల్లా గ్రామీణనీటి సరఫరా శాఖ ఎస్ఈ అనంత రాజు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి రాజ్ దిబోరా, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి శివలీల, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ వై.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
సర్వే వేగవంతం చేయండి
బాపట్ల: గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా చేపట్టిన సర్వే ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల రాష్ట్ర కార్యదర్శి, ఆర్టీజీఎస్ సీఈవో కె భాస్కర్ ఈ సర్వేపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సోమవారం అమరావతి నుంచి వీక్షణ సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఇక్కడి అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. వర్క్ ఫర్ హోం చేయడానికి ఎంతమంది యువత ఆసక్తిగా ఉన్నారనే అంశంపై దృష్టి సారించాలన్నారు. ఇంటింటా సర్వే చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు నమోదు చేయాలన్నారు. ఆరేళ్లలోపు చిన్నారులందరికీ ఆధార్ కార్డు తప్పనిసరిగా వచ్చేలా చూడాలని పేర్కొన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో సిబ్బందిని జనరల్ పర్పస్ సచివాలయాల గ్రూప్గా ఏర్పాటు చేయాలని సూచన చేశారు. మన మిత్ర సర్వే అవగాహన కార్యక్రమాలపై ఈ నెల 15 నుంచి విస్తృత ప్రచారం నిర్వహించాలన్నారు. సమావేశంలో జిల్లా నుంచి జీఎస్డబ్ల్యూఎస్ ఇన్చార్జి పద్మ, డీఎల్డీఓ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
బాల్యవివాహాలను అరికట్టాలి
బాపట్ల: బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ప్రజలకు సూచించారు. సోమవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ర్యాలీని జిల్లా కలెక్టర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక పురపాలక సంఘ ఉన్నత పాఠశాల నుంచి పాత ఆర్టీసీ బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ సాగింది. అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, నర్సింగ్ కాలేజీ విద్యార్థినులు, చీరాల మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు. కూడలి వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. తల్లీబిడ్డల మరణాలను అరికట్టాలని జిల్లా కలెక్టర్ అన్నారు. బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టాలని తెలిపారు. ప్రభుత్వం అందించే వైద్య సేవలను క్రమం తప్పకుండా ఉపయోగించుకోవాలని అన్నారు. ఇంటి వద్ద ప్రసవాలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో బుడా చైర్మన్ శలగల రాజశేఖర్ బాబు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. విజయమ్మ, జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం, బాపట్ల రెవెన్యూ డివిజన్ అధికారి పి.గ్లోరియా, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథ్రెడ్డి పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్పై కలెక్టర్కు ఫిర్యాదు
చీరాల: చీరాలలో మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్రామ్ జయంతిని మున్సిపల్ కార్యాలయంలో జరుపుకోనీయకుండా కార్యాలయానికి తాళాలు వేసి తమను అగౌరవ పరిచేలా వ్యహరించిన మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బొనిగల జైసన్బాబు, కౌన్సిలర్లు సోమవారం కలెక్టర్ జె.వెంకట మురళికి వినతిపత్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం బాబూ జగ్జీవన్రామ్ జయంతిని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించాలని ఆదేశించినా స్థానిక మున్సిపల్ అధికారులు పెడచెవిన పెట్టి మున్సిపల్ చైర్మన్ను అవమానించారన్నారు. మున్సిపల్ కమిషనర్పై చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన ఆయన తగు చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.

అర్జీలను వెంటనే పరిష్కరించాలి