ములకలపల్లి: ప్రమాదవశాత్తూ నీటి తొట్టిలో పడిన చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లగా, ఆర్ఎంపీ అత్యవరస వైద్యం అందించి ప్రాణాలు కాపాడారు. స్థానికుల కథనం మేరకు.. సత్తుపల్లికి చెందిన దుర్గ, వెంకటేశ్ దంపతుల రెండో కుమారుడు యువాన్ష్తో కలసి మండలంలోని రేగులకుంట గ్రామంలోని బంధువులు పోతురాజు ఇంటికి వచ్చారు. శనివారం సాయంత్రం ఇంట్లో చూడగా యువాన్ష్ కనిపించలేదు. చుట్టుపక్కల వెతకగా, పక్కనే ఉన్న నీటితొట్టితో తేలియాడుతూ కనిపించాడు. అపస్మారకస్థితిలో ఉన్న యువాన్ష్ను హుటాహుటిన జగన్నాథపురంలోని ఆర్ఎంపీ ఎం.సుభానీ వద్దకు తీసుకువచ్చారు. ఆయన వైద్యం అందించి, పొట్టలోని నీటిని బయటకు తీశారు. సీపీఆర్ చేయగా బాలుడు స్పృహలోకి వచ్చి శ్వాస తీసుకున్నాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం, అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిసింది.
వైద్యం అందించి కాపాడిన ఆర్ఎంపీ