
రామయ్యకు సార్వభౌమ సేవ
బ్రహ్మోత్సవాల్లో నేడు ధ్వజపట లేఖనం
భద్రాచలం: శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్యకు వైభవంగా సార్వభౌమ సేవ నిర్వహించారు. అంతకుముందు ఉత్సవ మూర్తులకు బేడా మండపంలో స్నపన తిరుమంజనం గావించారు. సాయంత్రం స్వామివారిని సార్వభౌమ సింహాసనంపై ఆశీనులను చేసి తాతగుడి సెంటర్లోని గోవిందరాజ స్వామి వారి ఆలయం వరకు తిరువీధి సేవ నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా గురువారం గరుడాధివాసం, ధ్వజపట లేఖనం తదితర కార్యక్రమాలు ఉంటాయని అర్చకులు తెలిపారు.
రామాలయంలో
గోటి తలంబ్రాల సమర్పణ
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణానికి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం సభ్యులు బుధవారం కోటి గోటి తలంబ్రాలు సమర్పించారు. ఎకరం పొలంలో పండించిన ధాన్యాన్ని ఐదువేల మంది భక్తులతో ఒలిపించిన ఎనిమిది క్వింటాళ్ల తలంబ్రాలను అందజేశారు. ముందుగా వాటికి ప్రత్యేక పూజలు చేయించారు. కార్యక్రమంలో శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కల్యాణం అప్పారావు, ఆలయ పీఆర్ఓ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లికి
లక్ష కుసుమార్చన
పాల్వంచరూరల్ : శ్రీదేవి వసంత నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నాలుగో రోజైన బుధవారం పెద్దమ్మతల్లి అమ్మవారికి లక్ష కుసుమార్చనను వైభవంగా నిర్వహించారు. అనంతరం అర్చకులు నాదనీరాజనం, సూక్తి పారాయణం, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శ్రీచక్రార్చన, శ్రీలలితా సహస్రనామ హవనం తదితర పూజలు చేశారు. ఆ తర్వాత అమ్మవారికి నివేదన, హారతి సమర్పించి మంత్రపుష్పం పఠించారు.
రామయ్యను దర్శించుకున్న దేవనాథ జీయర్
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని త్రిదండి దేవనాథ జీయర్ స్వామి బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం జీయర్స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు ఆయనకు స్వామివారి జ్ఞాపిక, ప్రసాదం అందజేశారు.
తాగునీటికి ఇబ్బంది లేదు
అశ్వాపురం : మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటి సరఫరాకు ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదని ఉమ్మడి జిల్లా ఎస్ఈ జి.శేఖర్రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని కుమ్మరిగూడెం ఇన్టేక్ వెల్, దుమ్ముగూడెం ఆనకట్ట, రథంగుట్ట వద్ద వాటర్ట్రీట్ మెంట్ ప్లాంట్ను బుధవారం ఆయన సందర్శించారు. ఆనకట్ట, ఇన్టేక్ వెల్ వద్ద గోదావరి నీటిమట్టాన్ని పరిశీలించారు. నీటి మట్టం తగ్గితే తీసుకోవా ల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఈఈ నళిని, డీఈ మహేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రామయ్యకు సార్వభౌమ సేవ

రామయ్యకు సార్వభౌమ సేవ

రామయ్యకు సార్వభౌమ సేవ