
పావు గంటలోనే ప్రక్రియ
● రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం ● పైలట్గా మూడు కార్యాలయాల్లో అమలు ● తొలిరోజు చిన్నచిన్న సమస్యలు మినహా సాఫీగానే.. ● వచ్చే నెల 1నుంచి అన్ని కార్యాలయాల్లో అమలుకు కసరత్తు
ఖమ్మంమయూరిసెంటర్/కొత్తగూడెం అర్బన్: ఒక దస్తావేజు రిజిస్ట్రేషన్ కోసం రోజంతా వేచి ఉండకుండా ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. ముందుగానే సమయాన్ని నిర్దేశించుకుని స్లాట్ బుక్ చేసుకునే విధానాన్ని అమలుచేస్తుండగా, పావు గంటలోనే ప్రక్రియ పూర్తిచేసి దస్తావేజులు ఇచ్చేస్తున్నారు. ఈ విధానంతో రిజిస్ట్రేషన్కు వచ్చిన వారిలో హర్షం వ్యక్తమవుతోంది. ఇక స్లాట్ దొరకని వారు, బుక్ చేసుకోలేని వారి కోసం ప్రతిరోజు సాయంత్రం 5 – 6 గంటల మధ్య వాకిన్ విధానంలో ఐదు డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించారు. రాష్ట్రంలోని పలు కార్యాలయాల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకురాగా, ఉమ్మడి జిల్లాలోని మూడు కార్యాలయాల్లో గురువారం మొదలైంది. తొలి రోజు మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 68 స్లాట్లు బుక్ కాగా, 66 రిజిస్ట్రేషన్లు జరిగాయి. అలాగే, వాకిన్ విధానంలో ఏడు దస్తావేజుల రిజిస్ట్రేషన్ చేశామని అధికారులు వెల్లడించారు.
స్లాట్ బుక్ చేసుకుని..
దస్తావేజుల రిజిస్ట్రేషన్ కోసం క్రయ, విక్రయదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే, ఈ ప్రక్రియ పూర్తవడానికి సమయం పడుతుండడం.. ఒకే సమయంలో ఎక్కువ మంది వస్తే అధికారులు దస్తావేజులను సక్రమంగా పరిశీలించలేని పరిస్థితి ఎదురయ్యేది. దీంతో ప్రభుత్వం స్లాట్ బుకింగ్ విధానం అమలుకు నిర్ణయించగా, పైలట్గా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, కూసుమంచి, కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను జాబితాలో చేర్చారు. గురువారం మొదలైన ఈ విధానంలో భాగంగా స్లాట్ బుక్ చేసుకున్న సమయం ఆధారంగా వచ్చిన వారి దస్తావేజులను అధికారులు పరిశీలించి రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. అంతేకాక రిజిస్ట్రేషన్ పత్రాలను కూడా అందజేశారు. వచ్చే నెల 1వ తేదీ నుండి అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ విధానం అమల్లోకి రానుంది.
చిన్న చిన్న సమస్యలు మినహా..
డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్కు ప్రభుత్వం స్లాట్ బుక్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో తొలిరోజు సర్వర్లో చిన్న చిన్న సమస్యలు ఎదురయ్యాయి. సర్వర్ నెమ్మదించడం, డాక్యుమెంట్ వివరాలను నమోదు చేస్తున్న సమయంలో వాటికవే డిలీట్ కావడంతో మళ్లీ మొదటి నుంచి నమోదు చేయాల్సి వచ్చింది. దీంతో వీటిని సరిచేసి, ఇంకొన్ని అంశాలను సైట్లో చేరిస్తే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సాఫీగా సాగుతుందని అధికారులు వెల్లడించారు.
అధికారుల పర్యవేక్షణ
ఉమ్మడి జిల్లాలోని మూడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం అమలుకావడంతో అధికారులు పర్యవేక్షించారు. జిల్లా రిజిస్ట్రార్ రవీందర్రావు ఖమ్మం, కూసుమంచి కార్యాలయాల్లో, చిట్ రిజిస్ట్రార్ కార్తీక్ కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు. స్లాట్ బుక్ చేసుకుని డాక్యుమెంట్లతో సబ్రిజిస్ట్రార్ వద్దకు వచ్చిన క్రయవిక్రయదారులకు పదిహేను నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ చేయడం, ఆపై పది నిమిషాల్లో పత్రాలు ఇవ్వడం విశేషం. బయోమెట్రిక్, ఫొటో, డాక్యుమెంట్ల పరిశీలన, స్కానింగ్ అంతా ఈ సమయంలోనే పూర్తయింది.
తొలి రోజు రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్ల వివరాలు..
కార్యాలయం స్లాట్ ద్వారా వాకిన్ మొత్తం
రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్లు
ఖమ్మం ఆర్వో 3 1 06 37
కూసుమంచి 1 3 00 1 3
కొత్తగూడెం 22 0 1 23