
చివరి దశలో చర్చలు
న్యూఢిల్లీ: బిలియనీర్ గౌతమ్ అదానీ(Gautam Adani) గ్రూప్ తాజాగా రియల్టీ రంగ సంస్థ ఎమార్ ఇండియాను కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు చేపట్టిన చర్చలు చివరి దశకు చేరినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 1.5 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 13,000 కోట్లు) ఎంటర్ప్రైజ్ విలువలో డీల్ కుదుర్చుకోనున్నట్లు అంచనా.
అయితే ఈ అంశంపై స్పందించేందుకు రెండు గ్రూప్లు నిరాకరించడం గమనార్హం! కాగా.. దుబాయ్ సంస్థ ఎమార్ ప్రాపర్టీస్ 2005లో ఎంజీఎఫ్ డెవలప్మెంట్తో భాగస్వామ్యం ద్వారా దేశీ రియల్టీ మార్కెట్లో ప్రవేశించింది. దీనిలో భాగంగా ఏర్పాటు చేసిన భాగస్వామ్య కంపెనీ(జేవీ) ఎమార్ ఎంజీఎఫ్ ద్వారా రూ. 8,500 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. 2016 ఏప్రిల్లో విడదీత ప్రణాళిక ద్వారా జేవీకి ముగింపు పలికేందుకు ఎమార్ ప్రాపర్టీస్ నిర్ణయించుకుంది. ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, మొహాలీ, లక్నో, ఇండోర్, జైపూర్లలో రెసిడెన్షియల్, కమర్షియల్ విభాగాలలో భారీ పోర్ట్ఫోలియోను కలిగి ఉంది.
జనవరిలోనే..
ఎమార్ ఇండియా(Emaar India)లో వాటా విక్రయానికి దేశీయంగా అదానీసహా వివిధ గ్రూప్లతో చర్చలు నిర్వహిస్తున్నట్లు ఎమార్ ప్రాపర్టీస్ ఈ ఏడాది జనవరిలోనే వెల్లడించింది. అయితే విలువ, లావాదేవీపై ఎలాంటి నిర్ణయానికీ రాలేదని స్పష్టం చేసింది. కాగా.. అన్లిస్టెడ్ సంస్థలు అదానీ రియల్టి, అదానీ ప్రాపర్టీస్ ద్వారా అదానీ గ్రూప్ దేశీ రియల్టీ మార్కెట్లో వేగవంతంగా విస్తరిస్తోంది.
అదానీ రియల్టీ దేశవ్యాప్తంగా పలు పట్టణాలలో ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తోంది. ఆసియాలోనే అతిపెద్ద మురికి వాడగా నిలుస్తున్న ముంబైలోని ధారావి సహా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులనూ చేపడుతోంది. ఈ బాటలో ముంబైలోని మోతీలాల్ నగర్ ప్రాజెక్టులను అదానీ ప్రాపరీ్టస్ తిరిగి అభివృద్ధి చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment