
కూటమి నేతల గుప్పిట్లో వైన్షాపు యజమానులు
● డిమాండ్ లేని బ్రాండ్లను అంటగట్టి.. అమ్మాలని ఒత్తిడి ● పర్మిట్ రూములే ఆదాయ వనరుగా దందా ● మందుబాబులకు చుక్కలు చూపిస్తున్న పచ్చమూక ● బెల్టు దుకాణాలతో నిలువు దోపిడీ
మేం చెప్పిందే అమ్మాలి!
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని నియోజక వర్గాల్లోని మద్యం దుకాణాలపై కూటమి నేతల పెత్తనం తారస్థాయికి చేరినట్లు తెలిసింది. డిమాండ్ ఉన్న మద్యాన్నే ఎక్కువ మంది మద్యం ప్రియులు కొనుగోలు చేస్తుంటారు. చిత్తూరు నగరం లాంటి చోట పెద్దగా అమ్ముడు పోని మద్యాన్ని ఎక్కువగా విక్రయించాలని షాడో ఎమ్మెల్యే ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. మద్యం డీలర్ల నుంచి కొందరు కూటమి నేతలు మామూళ్లు పుచ్చుకుని మద్యం ప్రియులపై నాసిరకం బ్రాండ్లను రుద్దుతున్నారని ప్రచారం జరుగుతోంది. చిత్తూరులో లభించే అనామక బ్రాండ్లే ఇందుకు నిదర్శనమని పలువురు విమర్శిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బెల్టు దుకాణాల్లో అయితే డిమాండ్ లేని మద్యం మాత్రమే అందుబాటులో ఉండేలా సదరు షాడో ఎమ్మెల్యే పక్కాగా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
సాక్షి ప్రతినిధి, తిరుపతి : మద్యం దుకాణాలను కూటమి నేతలు తమ అక్రమార్జనకు అడ్డాగా మార్చేసుకున్నారు. రూ.లక్షలు వెచ్చించి వైన్షాపు దక్కించుకున్న వారి కంటే పచ్చమూక ఆదాయమే అధికంగా ఉన్నట్లు పలువురు వ్యాపారులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయామని వైన్షాపుల యజమానులు లబోదిబో మంటుంటే.. సందట్లో సడేమియా అంటూ కూటమి ఎమ్మెల్యేల పేరు చెప్పి కొందరు షాడోలు జేబులు నింపుకుంటున్నారు. ఇందుకోసం ప్రధానంగా పర్మిట్ రూమ్లనే తమ అక్రమ సంపాదనకు కేంద్రాలుగా తయారు చేసుకున్నారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మద్యం దుకాణాల కంటే.. అనధికారిక పర్మిట్ రూములు, బెల్టు దుకాణాలనే అధికంగా ఏర్పాటు చేసుకున్నారు. వాటి ద్వారా విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు. అధికమొత్తంలో వెచ్చించి దక్కించుకున్న దుకాణాల నుంచి కూటమి నేతలు ఎవరికి వారు రకరకాల రూపంలో మామూళ్లు వసూలు చేసుకుంటున్నారు.
అట్టపెట్టలను కూడా వదలరా..?
ప్రతి దుకాణానికి మద్యం సీసాలను అట్టపెట్టెల్లో సరఫరా చేస్తుంటారు. ఆ అట్టపెట్టెలను మద్యం వ్యాపారులు రూ.11, రూ.12 చొప్పున విక్రయిస్తుంటారు. అయితే చిత్తూరులో మాత్రం షాడో ఎమ్మెల్యే ఆ అట్టపెట్టెలను సైతం తనకే అమ్మాలని, అదీ కేవలం రూ.8 చొప్పునే చెల్లిస్తామని స్పష్టం చేసినట్లు తెలిసింది.
చిత్తూరులో ఆయనదే పెత్తనం
చిత్తూరు నియోజక వర్గ పరిధిలో మొత్తం 18 మద్యం దుకాణాలు ఉన్నాయి. నిబంధనల మేరకు విక్రయిస్తే పెట్టిన పెట్టుబడి రాదని భావించి వ్యాపారులు పర్మిట్ రూములు, బెల్టు దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే వాటన్నింటిపై చిత్తూరు షాడో ఎమ్మెల్యే దృష్టి సారించారు. మద్యం వ్యాపారులందరూ తాను చెప్పినట్లే నడుచుకోవాలను హుకుం జారీ చేశారు. అన్ని దుకాణాలు తన కనుసన్నల్లోనే నడవాలని ఆదేశించారు. అందులో భాగంగా పర్మిట్ రూములు, బెల్టు షాపులు తాను చెప్పిన వారికే ఇవ్వాలని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి సైతం వ్యాపారులకు ఫోన్లు వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం.
తిరుపతి జిల్లా సమాచారం
మొత్తం మద్యం దుకాణాలు 247
పర్మిట్ రూమ్లు 680
బెల్టు షాపులు సుమారు 2వేలు
చిత్తూరు జిల్లా సమాచారం
మొత్తం మద్యం దుకాణాలు 111
పర్మిట్ రూమ్లు 350
బెల్టు షాపులు 900లకు పైనే
ప్రతి నెలా..ఆదాయం ఇలా
జిల్లా పేరు మద్యం విక్రయాలు పర్మిట్ రూముల్లో విక్రయాలు ఆదాయం
తిరుపతి రూ.340 కోట్లు రూ.20 కోట్లు రూ.52 కోట్లు
చిత్తూరు రూ.116 కోట్లు రూ.10కోట్లు రూ.18 కోట్లు