వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ సెల్ డిమాండ్
నల్లజర్ల: దూబచర్ల గాంధీ కాలనీ, ముసుళ్ళగుంటలలో అంబేడ్కర్, ఎన్టీఆర్ విగ్రహాలకు చెప్పుల దండలు వేసి అవమానించిన కేసులో సమగ్ర విచారణ జరిపి నిజమైన దోషులను పోలీస్లు అరెస్ట్ చేయాలని వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ సెల్ డిమాండ్ చేసింది. గురువారం సాయంత్రం నల్లజర్లలో పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సీ సెల్ నాయకులు మాట్లాడారు. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సాలివేణు మాట్లాడుతూ ఈ విగ్రహాల విషయంలోఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు ఒత్తిళ్లకు లొంగి పోలీసులు సమగ్ర విచారణ జరపకుండానే వైఎస్సార్ సీపీ అభిమాని, సామాజిక కార్యకర్త బుడుపుల బాబ్జిపై తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. మా ఆరాధ్యధైవం అంబేద్కర్ను మేమే ఎందుకు అవమానిస్తామని ప్రశ్నించారు. ఏదో విధంగా కేసు త్వరితగతిన పూర్తి చేయడానికి పోలీసులు ఈవిధంగా వ్యవరించారన్నారు. ఇక్కడ రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోందా అని ప్రశ్నించారు. 2024 నవంబరు 26న ద్వారకాతిరుమలలో అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన కేసు ఇంతవరకు ఏమైందో తెలియలేదన్నారు. ఈ కేసులో నిర్ధోషి, దళిత యువకుడు బాబ్జికి శిక్ష పడితే చూస్తూ ఊరుకోబోమన్నారు. గోపాలపురం నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కాకులపాటి శ్రీనివాస్, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు అందుగుల వెంకటేశ్వరావు, ముప్పిడి వెంకటరత్నం, తాడిగడప శ్రీనివాసరావు, బోడిగడ్ల రాంబాబు, తోట వెంకట్రావు, గోగులమండ రాజారావు పాల్గొన్నారు.