
లక్ష్యానికి చేరువగా సెస్ వసూళ్లు
రాజమహేంద్రవరం రూరల్: వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ)ల ఆధ్వర్యాన వ్యవసాయ ఉత్పత్తులపై సెస్, మార్కెట్ ఫీజు వసూళ్లలో జిల్లా నూరు శాతం లక్ష్యం చేరుకోలేదు. ప్రస్తుతం 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.30.83 కోట్లు లక్ష్యంకాగా మార్చినెలాఖరు నాటికి రూ. 29.09 కోట్లు మేర వసూళ్లు జరిగాయి. జిల్లావ్యాప్తంగా 94.37శాతం మార్కెటింగ్ ఫీజులు వసూలయ్యాయి. వ్యవసాయ ఉత్పత్తులు, పశుగణాలపై ఒక శాతం సెస్ వసూలు చేస్తున్నారు. వీటితోపాటు వ్యాపారుల (ట్రేడర్ల) నుంచి ఒక శాతం, చేపలు, రొయ్యలపై 0.25 శాతం చొప్పున సెస్ వసూలు చేస్తున్నారు. నిడదవోలు ఏఎంసీ రూ.1.50 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా ఏకంగా రూ.1.79 కోట్లు వసూలు చేసి ముందంజలో ఉంది. నిడదవోలు ఏఎంసీ పరిధిలో ప్యాడీతో పాటు సెస్ వసూళ్లు బాగా చేయడంతో ముందంజలో నిలిచింది. కొవ్వూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సెస్ 62.03 శాతం వసూలు చేసి వెనుకంజలో ఉంది.
నాలుగు ఏఎంసీలు వందశాతం పైనే
జిల్లాలో ఆరు ఏఎంసీల్లో నాలుగు ఏఎంసీల్లో నిడదవోలు 119.62 శాతం వసూళ్లతో ప్రథమ స్థానంలో ఉండగా, గోపాలపురం ఏఎంసీ 110.11 శాతం వసూళ్లతో ద్వితీయ స్థానం, రాజానగరం ఏఎంసీ 109.76 శాతం వసూళ్లతో తృతీయ స్థానం, అనపర్తి ఏఎంసీ 100.86 శాతం వసూళ్లతో నాలుగో స్థానంలోను, నిలిచాయి. రాజమహేంద్రవరం మార్కెట్ కమిటీ 78.98 శాతం వసూళ్లతో ఐదవ స్థానంలో కొవ్వూరు ఏఎంసీ 62.04 శాతం వసూళ్లతో చివరి స్థానంలో నిలిచింది.
పక్కా ప్రణాళికతో...
మార్కెటింగ్శాఖ ఉన్నతాధికారులు మార్కెట్ ఫీజు, సెస్ వసూళ్లపై మార్కెట్ కమిటీ సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ లక్ష్యాలను అధిగమించేలా చర్యలు చేపట్టారు. జిల్లాలోని ఆరు మార్కెట్ కమిటీల పరిధిలో 14 చెక్ పోస్టుల ద్వారా మార్కెట్ ఫీజు, సెస్ వసూళ్లను 94.37 శాతం వసూలు చేశారు. సివిల్ సప్లయిస్ బకాయిలు, ఏఏంసీకి రావలసిన బకాయిలు సుమారు రూ.70 కోట్లు రాకపోవడంతో లక్ష్యాలను అధిగమించలేకపోయాయి.
రెండు ఏఎంసీలు వెనుకబడ్డాయి
జిల్లాలో అగ్రికల్చర్ మార్కెట్కమిటీల పరిధిలో మార్కెట్ ఫీజు, సెస్ వసూళ్లు 94.37 శాతం వసూలు చేశాం. మార్కెటింగ్శాఖ కమిషనర్, రీజనల్ డైరెక్టర్ మోటేవేషన్తో నాలుగు ఏఎంసీలు వందశాతం పూర్తిచేయగా, రెండు ఏఎంసీలు వెనుకబడ్డాయి. సివిల్ సప్లయిస్ బకాయిలు సుమారు రూ.73 కోట్లు ఏఎంసీలకు రావాల్సి ఉంది. మార్కెట్ కమిటీ కార్యదర్శులు, సిబ్బంది సమష్టి కృషితో లక్ష్యానికి చేరువయ్యాం. జిల్లాలో వెనుకబడిన కొవ్వూరు, రాజమహేంద్రవరం మార్కెట్ కమిటీలు నూరుశాతం లక్ష్యం సాధించేలా కృషిచేస్తాం.
– ఎం.సునీల్వినయ్, జిల్లా అగ్రిట్రేడ్ అండ్ మార్కెటింగ్ అధికారి, తూర్పుగోదావరిజిల్లా
02ఆర్జేసి201ఎ–270080:ఎం.సునీల్వినయ్
2024–25లో
94.37 శాతం వసూలు
నిడదవోలు ఏఎంసీలో
రికార్డు స్థాయిలో 119.62 శాతం
వెనుకంజలో 62.03 శాతంతో కొవ్వూరు ఏఎంసీ
2024–25 ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ ఫీజు,సెస్ వసూళ్ల వివరాలు (రూ.కోట్లలో)
వ్యవసాయ మార్కెట్ కమిటీ లక్ష్యం వసూలు పర్సంటేజీ
నిడదవోలు 1.50 కోట్లు 1.79 కోట్లు 119.62
గోపాలపురం 3.47 కోట్లు 3.82 కోట్లు 110.11
రాజానగరం 3.13 కోట్లు 3.43 కోట్లు 109.76
అనపర్తి 13.47 కోట్లు 13.58క ోట్లు 100.86
రాజమహేంద్రవరం 4.21కోట్లు 3.32 కోట్లు 78.98
కొవ్వూరు 5.05 కోట్లు 3.13కోట్లు 62.03
మొత్తం రూ.30.83 కోట్లు రూ.29.09కోట్లు 94.37