
5, 6 తేదీల్లో రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలు
రాజమహేంద్రవరం సిటీ: ఆంధ్రప్రదేశ్ అమెచ్యుర్ రెజ్లింగ్ అసోసియేషన్ సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ఆధ్వర్యంలో ఈ నెల 5,6 తేదీల్లో రాష్ట్రస్థాయి కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నట్లు రాజమహేంద్రవరం చార్టర్ అధ్యక్షుడు తీగెల రాజా, ఐకాన్స్ క్లబ్ అధ్యక్షుడు ఇమ్మణి వెంకట్ చెప్పారు. గురువారం రాజమహేంద్రవరం క్లబ్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాదిలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ కుస్తీ పోటీలను తమ క్లబ్ తరఫున రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ కుస్తీ పోటీలను దక్షిణాదిలో కూడా పరిచయం చేయాలనే ఆశయంతో ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో తొలిసారిగా నిర్వహిస్తున్నామన్నారు. అండర్–15 బాలబాలికలకు, అండర్–20 పురుషులు, మహిళలకు రాష్ట్ర స్థాయిలో రెజ్లింగ్ పోటీలు ఏర్పాటు చేశామన్నారు. సుమారు 300 మంది రెజ్లర్స్ హాజరవుతారని చెప్పారు. ఈ పోటీల విజేతలు ఈ నెల 23న రాజస్థాన్లోని కోటాలో జరిగే జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు అర్హత సాధిస్తారని తెలిపారు. క్లబ్ స్పోర్ట్స్ చైర్మన్ మద్దూరి శంకర్ మాట్లాడుతూ రెండు రోజుల పాటు ఈ రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీలు దివాన్చెరువు ఎస్వీబీసీ కల్యాణ మండపంలో జరుగుతాయన్నారు. రెజ్లర్లకు ఉచిత భోజన వసతి సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో క్లబ్ కార్యదర్శి ఉదయగిరి సురేష్, కోశాధికారి కామేశ్వరిదేవి, స్పోర్ట్స్ డైరెక్టర్ పి.హెచ్.ఎస్.కార్తీక్, సంయుక్త కార్యదర్శి వంశీ పాల్గొన్నారు.