
మేమంతా శివరామసుబ్రహ్మణ్యం వెంటే..
స్పష్టం చేసిన ఆర్యవైశ్య సంఘం నాయకులు
రాజమహేంద్రవరం సిటీ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఆర్యవైశ్యులంతా ఏపీఐఐసీ మాజీ చైర్మన్, వైశ్య ప్రముఖుడు శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం వెంటే ఉంటామని వైశ్య సంఘం నాయకులంతా స్పష్టం చేశారు .తామంతా రాజకీయ పార్టీల జెండాలతో రాలేదని, వైశ్యుల అజెండాతో మాత్రమే వచ్చామని స్పష్టం చేశారు. శుక్రవారం లాలాచెరువులోని వైశ్య హాస్టల్లో ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రగళ్ళపాటి కనకరాజు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా రాజకీయాలతో సంబంధం లేకుండా శివరామ సుబ్రహ్మణ్యంను పెద్దగా ఉంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఏ సమస్య వచ్చినా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు. కోనసీమ జిల్లా విడదీసినప్పుడు రాష్ట్ర మహాసభ బైలాకు విరుద్ధంగా కమిటీ ఏర్పాటు వలన ప్రయోజనం లేదన్నారు. ప్రజలు సేవచేసే వ్యక్తులను గుర్తిస్తారని అన్నారు. శివరామసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జిల్లాలో అందరికీ వైశ్య హాస్టల్ ఒక షెల్టర్ కావాలనే ఉద్దేశంతో ఒక ఫ్లోరు అందిస్తున్నట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆతిథ్యానికి మారుపేరుగా ఉన్నవారిని విడదీయడం సబబు కాదన్నారు. తనను టార్గెట్ చేయాలని చూస్తున్నారని, తనవల్ల ఎవరూ మోసపోలేదని స్పష్టం చేశారు. తాను చెప్పిందే జరగాలని అనుకోనని, ఎవరు చెప్పినా వింటానన్నారు. రాష్ట్ర మహాసభ ఒకే నాయకత్వం కింద ఉండాలని భావిస్తానని, కాని రాష్ట్ర బైలాను పక్కన పెట్టి నియామకాలు చేపట్టడం కరెక్టో కాదో వారే ఆలోచించుకోవాలన్నారు. పెద్దలముందు చేసిన ప్రమాణాల ప్రకారం నడుచుకుంటే సమాజంలో కాని , సంఘంలో కాని గౌరవం ఉంటుందని శివరామ సుబ్రహ్మణ్యం హితవు పలికారు. ఉమ్మడి తూర్పుగోదావరిజిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కంచర్ల బాబీ, కార్యదర్శి కుసుమంచి పాపారావు, కోశాధికారి కంచర్ల కృష్ణ మోహన్, నంబూరి రెడ్డియ్య, పల్లపోతు బంగారం, కోరుప్రోలు వెంకటేశ్వరరావు, అత్తలూరి సాయిబాబా, కుసుమంచి సుబ్బరాయులు రాజమండ్రి చాంబర్ అధ్యక్షుడు తవ్వా రాజా పాల్గొన్నారు.