
అక్రమ ర్యాంప్.. జోరుగా తరలింపు
పెరవలి: అధికారి కూటమి నేతలు బరి తెగించి అక్రమ ఇసుక ర్యాంప్ ఏర్పాటు చేయటమే కాకుండా యథేచ్ఛగా రాత్రి పగలు ఇసుక తరలిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. పెరవలి మండలం ఖండవల్లి పరిధిలోని లంకమాలపల్లికి ఆనుకుని ఉండే ఎర్రవంతెన వద్ద నుంచి నిత్యం యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నా రెవెన్యూ, పోలీస్ డిపార్టుమెంట్లు పట్టించుకోవడం లేదు. అధికారపార్టీ నేతల ఒత్తిళ్లు ఒకవైపు, మామూళ్లూ ఇంకొక వైపు అఽందటంతో అధికారులు ఏమీ పట్టనట్లు ఉంటున్నారని అంటున్నారు. ఇసుక తరలిస్తున్నప్పుడు అధికారులకు ఎవరైనా చెప్పుచుంటే దళారీలను పట్టుకోవటం మాని అధికారులే నేరుగా దళారీలకు ఫోన్ చేసి చెప్పటం విడ్డూరంగా ఉందని అంటున్నారు. ఈ ఫిర్యాదు చేసిన వారు సామాన్యులైతే ఫర్వాలేదు కానీ ప్రతిపక్ష పార్టీ వారయితే వారిని టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇప్పటికే అధికార ర్యాంప్ల్లో అధికారుల సాక్షిగా ఇసుక దోపిడీ జరుగుతున్నా చర్యలు లేకపోవడంతో అధికారపార్టీ నేతలు ఒక అడుగు ముందుకు వేసి ర్యాంపునే ఏర్పాటు చేసుకుని ఇసుక అక్రమ రవాణాను జోరుగా చేస్తున్నారు. పెరవలి మండలంలో తీపర్రు, కానూరు–పెండ్యాల, కాకరపర్రు ఇసుక ర్యాంపులు ఉన్నా నేడు ఖండవల్లిలో ఏర్పాటైన అనధికార ఇసుక ర్యాంపు నుంచి నిత్యం రాత్రి సమయాల్లో 20 నుండి 40 ట్రాక్టర్లు ఇసుకను తరలిస్తున్నారు. మంగళవారం జిల్లాలో ఇసుక టెండర్లు వేసే పనిలో కాంట్రాక్టర్లు ఉండగా ఇదే అదనుగా పట్టపగలే ఇసుకను ట్రాక్టర్లతో తరలించారు. తీర ప్రాంతంలోని ప్రతీ గ్రామంలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి పగలు పంచాయతీ కార్యదర్శులు, రాత్రులు రెవెన్యూ సిబ్బంది పహరా కాస్తున్నా ఇసుక తరలివెళ్లిపోతున్నదంటే ఏ స్థాయిలో ముడుపులు అందుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. గతంలో సాక్షి ఈ విషయాన్ని బయట పెడితే కొద్దిరోజులు ఇసుక రవాణా నిలిచిపోయింది కానీ కొన్ని రోజులుగా కొనసాగుతోంది. అధికారులు కాసులకు కక్కుర్తి పడటం వలన ఇసుక అక్రమ రవాణా 3 ట్రాక్టర్లు 6 లారీలుగా కొనసాగుతోంది. ఈ ర్యాంప్ నుంచి ఇసుకను రాత్రి 11గంటల నుంచి తెల్లవారు జాము 4 గంటల వరకు తరలిస్తున్నారు.
అధికార నేతలే ర్యాంప్ ఏర్పాటు
ఖండవల్లిలో అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధే ఈ ర్యాంప్ ఏర్పాటు చేశారని బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై పెరవలి తహసీల్దార్ను వివరణ కోరగా గతంలో ర్యాంప్ ఏర్పాటు చేయటం నిజమేనని, దీనిని ధ్వంసం చేసామని, ఇప్పడు మళ్లీ తోలుతున్నారా అయితే వీఆర్ఓను పంపించి విషయం తెలుసుకుంటానని తెలిపారు. ఎస్సై ఎం.వెంకటేశ్వరరావును వివరణ కోరితే ఇసుక తరలిస్తున్నారని తెలిసిన వెంటనే సిబ్బందిని పంపించామని ఎవరూ దొరకలేదని చెప్పారు.
యథేచ్ఛగా రాత్రి పగలు ఇసుక రవాణా

అక్రమ ర్యాంప్.. జోరుగా తరలింపు