వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు | - | Sakshi

వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల్లో నియామకాలు

Mar 28 2025 12:45 AM | Updated on Apr 1 2025 4:28 PM

ఏలూరు టౌన్‌: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీల్లో పలువురికి పదవులు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర బీసీ సెల్‌ సంయుక్త కార్యదర్శిగా గంటా శ్రీనివాస్‌, రాష్ట్ర ఎస్సీసెల్‌ ప్రధాన కార్యదర్శిగా నూకపెయ్యి సుధీర్‌బాబు (ఏలూరు), రాష్ట్ర ఎస్సీసెల్‌ కార్యదర్శిగా గుమ్మడి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఎస్సీ సెల్‌ సంయుక్త కార్యదర్శిగా కంబాల రాంబాబు, రాష్ట్ర బూత్‌ కమిటీ వింగ్‌ సెక్రటరీగా యర్రా గంగాధరరావును నియమించారు.

బూత్‌ కమిటీల జోనల్‌ అధ్యక్షుడిగా బీవీఆర్‌

జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడేనికి చెందిన బీవీఆర్‌ చౌదరిని వైఎస్సార్‌సీపీ బూత్‌ కమిటీల విభాగం జో నల్‌ అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటివరకు ఆయన ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల బూత్‌ కమిటీ కన్వీనర్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకముంచి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని, పార్టీ బలోపేతానికి కృషిచేస్తానని చెప్పారు.

ట్రావెల్స్‌ బస్సుల తనిఖీ

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని కలపర్రు టోల్‌ప్లాజా వద్ద రవాణా శాఖ అధికారులు బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు ప్రైవేట్‌, కాంట్రాక్ట్‌ బస్సులను తనిఖీ చేశారు. నిబంధనల అతిక్రమించిన 46 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.1.13 లక్షల అపరాధ రుసుం విధించినట్టు ఉప రవాణా కమిషనర్‌ షేక్‌ కరీమ్‌ తెలిపారు. రహదారి భద్రతలో భాగంగా డ్రైవర్లకు పేస్‌ వాష్‌ కార్యక్రమాన్ని నిర్వహించి, అవగాహన కల్పించారు. విరామ సమయంలో డ్రైవర్లు తప్పకుండా విశ్రాంతి తీసుకోవాలని హితవు పలికారు. వాహన తనిఖీ అధికారులు బి.భీమారావు, ఎన్‌డీ విఠల్‌, ఎస్‌బీ శేఖర్‌, జి.ప్రసాదరావు పాల్గొన్నారు.

పాస్టర్‌ ప్రవీణ్‌ మృతిపై సమగ్ర విచారణ జరిపించాలి

ఏలూరు (టూటౌన్‌): పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఏపీ పాస్టర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు పి.జీవన్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. నగరంలోని గెట్సేమనే సెంట్రల్‌ చర్చిలో గురువారం విలేకరులతో మాట్లాడారు. యావత్‌ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ప్రవీణ్‌ ప్రగడాల మృతి బాధాకరమని అన్నారు. నెల రోజుల క్రితం ఆయన సోషల్‌ మీడియా వేదికగా తనకు ప్రాణహాని ఉందని చెప్పడం, చెప్పిన నెల రోజులకే మృతి చెందడం అనుమానాలకు తావిస్తోందన్నారు. హెల్మెట్‌ పెట్టుకుని ఉన్నా ఆయన మొహంపై బలమైన గాయం ఎలా తగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ ప్రొటెక్షన్‌ బిల్లును తీసుకురావాలని కోరుతున్నామన్నారు. ఏలూరు సిటీ పాస్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చిక్కాల జోసెఫ్‌, సభ్యులు పీటర్‌, పాస్టర్‌ కిరణ్‌ పాల్‌, ఏలూరు సిటీ పాస్టర్స్‌ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

సెస్‌ బకాయిలు చెల్లించాలి

భీమవరం (ప్రకాశంచౌక్‌): జిల్లా గ్రంధాలయ సంస్థకు సెస్‌ బకాయిలను వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ కమిషనర్లు, పంచాయతీ అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. గురువారం భీమవరం కలెక్టరేట్‌లో సెస్‌ బకాయి లపై ఆయన సమీక్షించారు. గ్రంథాలయ సంస్థకు సెస్‌ రూపేణా రూ.4,53,48,404 బకాయిలు ఉన్నాయని, దీనిలో పంచాయతీల బకాయిలు రూ.2,96,90768 ఉన్నాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement