
మన్యంలో ఘనంగా మామిడికాయ పండుగ
బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో ఉగాది పండుగ పర్వదినంతో ప్రారంభమయ్యే మామిడికాయ పండుగను ఆదివారం పలు గిరిజన గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. వేసవిలో మామిడికాయ పండుగ అత్యంత ముఖ్యమైనది. ఈ పండుగ జరిపిన తర్వాత మాత్రమే గిరిజనులు మామిడికాయను తింటారు. ఉగాది రోజున ఇళ్లలో, గ్రామాల్లో ,తోటల్లో కాసిన మామిడి కాయలను అందరూ పండగకు కోసుకొని తీసుకొచి అక్కడ పూజల అనంతరం తింటారు. ప్రతి గ్రామంలో గంగానమ్మతో పాటు ఆయా గ్రామాల్లోని వన దేవతలను గిరిజనులు పూజిస్తారు. ఆయా దేవతలకు దూప దీప నైవేద్యాలతో ఘనంగా పూజలు చేసిన తర్వాతే మామిడి కాయలు చెట్ల నుంచి కాయలను కోస్తారు. ప్రతి ఇంటికీ కోడిని తీసుకువచ్చి గ్రామ దేవతకు మొక్కుగా ఇస్తారు. గ్రామంలో ఎన్ని ఇళ్లు ఉంటే అన్ని కోళ్లు మొక్కుగా ఇస్తారు. ఆ కోళ్లును వండుకుని సహపంక్తి భోజనాలు చేస్తారు. మామిడికాయ పండుగలో దేవతలకు పూజలనంతరం గ్రామంలోని చిన్నాపెద్దా కలిసి ఒక గుజిడీ (స్థలం) ఏర్పాటు చేసుకుంటారు. అక్కడికి కోడి కూర తెచ్చుకుని లొట్లలో తాటి కల్లు ఏర్పాటు చేసుకుని జీడి, మామిడి ఆకులతో, దారకాయలతో తాటికల్లును సేవిస్తారు.
గిరిజన సంప్రదాయ నృత్యాలు
మామడి కాయ పండుగను పురస్కరించుకుని గ్రామంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా గిరిజన సంప్రదాయ రేల నృత్యాలు చేస్తారు. ఈ నృత్యాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఆదివారం కంసాలి కుంటలో ఈ ప్రారంభమైన ఈ మామిడికాయ పండుగలో సర్పంచ్ తెల్లం వెంకాయమ్మ పాల్గొని వన దేవతలకు పూజలు చేయడంతో పాటు మహిళలతో కలిసి గిరిజన నృత్యాలు చేశారు.

మన్యంలో ఘనంగా మామిడికాయ పండుగ