
జామాయిల్ తోటలో అగ్నిప్రమాదం
ద్వారకాతిరుమల: మండలంలోని రాళ్లకుంటలో ఇటీవల నరికివేసిన జామాయిల్ తోటలో బుధవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భీమడోలు అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలను ఆర్పివేయడంతో పెనుముప్పు తప్పింది. స్థానికుల కథనం ప్రకారం. రాళ్లకుంటలోని సెయింట్ గ్జేవీయార్ పాఠశాలకు చెందిన జామాయిల్ తోటను కొద్దిరోజుల క్రితం నరికివేశారు. కలపను తరలించగా, మిగిలిన తుక్కు మొత్తం అక్కడే ఉంది. గుర్తు తెలియని వ్యక్తుల కారణంగా ఆ తుక్కుకు నిప్పు అంటుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో పాటు, చుట్టుపక్కలకు వ్యాపించాయి. దాంతో పరిసర ప్రాంత రైతులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న భీమడోలు అగ్నిమాపక ఎస్సై జి.నాగరాజు సిబ్బందితో కలసి హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు తాగి పడవేసిన సిగిరెట్ కారణంగానే ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.