
టేకు ప్లాంటేషన్ సంరక్షణకు ప్రాధాన్యమివ్వండి
బుట్టాయగూడెం: రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న టేకు ప్లాంటేషన్ సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని పీసీసీఎఫ్ డాక్టర్ పీవీ చలపతిరావు ఫారెస్ట్ రేంజ్ అధికారులను ఆదేశించారు. బుట్టాయగూడెం మండలం మారుమూల గ్రామమైన రామనర్సాపురంలో ఉన్న 72–73 టేకు ప్లాంటేషన్ను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా చెట్ల ఎత్తు, మొదలులోని చుట్టుకొలతలను స్వయంగా పరిశీలించారు. అలాగే ప్లాంటేషన్లోని చెట్ల తాజా పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టేకు చెట్లను స్మగ్లర్లు నరికి వేయకుండా బీటు స్థాయి ఉద్యోగులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అటవీశాఖ ఉద్యోగులు అటవీ సంరక్షణ విధులతోపాటు టేకు ప్లాంటేషన్ను కాపాడేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అలాగే వేసవికాలం కావడంతో అగ్నిప్రమాదాలు జరగకుండా ఫైర్పాత్, ఫైర్లైన్స్ క్లియరెన్స్ పనులు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ శ్రీశుభం, సబ్ డీఎఫ్ఓ వెంకట సుబ్బయ్య, కన్నాపురం రేంజ్ అధికారి ఎం.శివరామకృష్ణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా జీలుగుమిల్లి మండలంలో రమణక్కపేటలో ఉన్న టేకు ప్లాంటేషన్ను కూడా పీసీసీఎఫ్ చలపతిరావు పరిశీలించారు. జంగారెడ్డిగూడెం రేంజ్ పరిధిలోని అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఫారెస్ట్ రేంజ్ అధికారులకు ఆదేశం
టేకు ప్లాంటేషన్ను పరిశీలించిన పీసీసీఎఫ్