
లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేయడం జరిగిందని గుంటూరు డివిజన్ సీనియర్ డీసీఎం దినేష్కుమార్ బుధవారం వెల్లడించారు. గుంటూరు – కాచిగూడ (17251), గుంటూరు – తిరుపతి(17261), మచిలీపట్నం – ధర్మవరం(17215), సికింద్రాబాద్ – గుంటూరు(17254) రైళ్లు ఈనెల 6వ తేదీన రద్దు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా కాచిగూడ – గుంటూరు(17252), తిరుపతి – గుంటూరు (17262), ధర్మవరం – మచిలీపట్నం(17216) రైళ్లు ఈనెల 7వ తేదీన రద్దు చేయడం జరిగిందని తెలిపారు. ప్రయాణికులు గమనించి సహకరించాల్సిందిగా ఆయన కోరారు.
గుంటూరు డివిజన్ మీదుగా ప్రత్యేక రైళ్లు
లక్ష్మీపురం: దక్షిణ మధ్య రైల్వే ప్రయాణీకుల సౌకర్యార్ధం సాంబరం, ధన్బాద్ – సాంబరం వయా గుంటూరు డివిజన్ మీదుగా ప్రత్యేక రైళ్లు కేటాయించినట్లు గుంటూరు డివిజన్ సీనియర్ డీసీఎం దినేష్కుమార్ బుధవారం వెల్లడించారు. తాంబరం, ధన్బాద్ (06077) రైలు ఈనెల 7న ప్రత్యేక రైలును కేటాయించినట్లు తెలిపారు. ఈరైలు సాంబరం స్టేషన్ నుంచి శుక్రవారం రాత్రి 10 గంటలకు బయల్దేరి ధన్బాద్ స్టేషన్కు సోమవారం ఉదయం 5.30 గంటలకు చేరుకుంటుందన్నారు. ధన్బాద్– తాంబరం (06078) ప్రత్యేక రైలు ఈనెల 11న కేటాయించినట్లు వెల్లడించారు. ఈరైలు మంగళవారం ధన్బాద్లో మధ్యాహ్నం 3.35గంటలకు బయల్దేరి తాంబరం స్టేషన్కు బుధవారం రాత్రి 10 గంటలకు చేరుకుంటుందని తెలిపారు. ఈరైలు చైన్నె ఎగ్మోర్, సూళ్లూరుపేట, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, గుంటూరు, మిరియాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్ మీదుగా ప్రయాణిస్తుందని తెలిపారు.
53,538 బస్తాల
మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు బుధవారం 49,472 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 53,538 బస్తాల అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నెంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.10,000 నుంచి రూ.23,500 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగి, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.9,000 నుంచి రూ.26,000 వరకు పలికింది. ఏసీ కామన్ రకం మిర్చి క్వింటాళకు రూ.10,500 నుంచి 23,000 వరకు ధర లభించింది. ఏసీ ప్రత్యేక రకాల మిర్చికి రూ. 10,000 నుంచి రూ. 26,000 వరకు ధర పలికింది. తాలు రకం మిర్చికి రూ.6,000 నుంచి రూ.14,000 వరకు ధర లభించింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 16,850 బస్తాలు మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.
హక్కులు, విధులపై
అవగాహన అవసరం
నరసరావుపేట రూరల్: ప్రతి విద్యార్థి హక్కులు, విధులు తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి తెలిపారు. నెహ్రూ యువకేంద్ర ఆధ్వర్యంలో జిల్లాస్థాయి యువజన ఉత్సవాలు–2023 నరసరావుపేట ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ముఖ్యఅతిథులుగా పాల్గొని జ్యోతిప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శివశంకర్ మాట్లాడుతూ విద్యార్థులు మంచి అలవాట్లను అలవర్చుకొని జీవితాంత కొనసాగించాలన్నారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు అవుతున్నదా లేదా వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వినియోగించుకోవాలని తెలిపారు. స్టెప్ సీఈఓ పల్లవి, కళాశాల చైర్మన్ మిట్టపల్లి వెంకట కోటేశ్వరరావు, కార్యదర్శి మిట్టపల్లి రమేష్, ప్రిన్సిపాల్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
