
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
తాడికొండ: ఈ నెల 14న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని తాడికొండలో నిర్వహించేందుకు సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్ల ను మంగళవారం ఇన్చార్జి కలెక్టర్ భార్గవ్తేజ, ఆర్డీఓ శ్రీనివాసులు పరిశీలించారు. జయభారత్ కాలనీ, పొన్నెకల్లు ఎస్సీ కాలనీలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలను సందర్శించారు. పొన్నెకల్లులో కార్యక్రమ నిర్వహణకు అనువుగా ఉందని నిర్థారించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పిస్తారు. అనంతరం స్థానికంగా ఉన్న ఎస్సీ కుటుంబాలను పీ4 విధానంలో భాగంగా ఉన్నత కుటుంబాలకు దత్తత ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఎస్సీ కాలనీలో పలువురితో ముచ్చటించి, పొన్నెకల్లు బైపాస్లో ఏర్పాటు చేసిన సభా వేదికకు సీఎం చేరుకుని ప్రసంగిస్తారు. కార్యక్రమంలో తహసీల్దారు మెహర్బాబు, ఎంపీడీవో సమతావాణి ఉన్నారు.
‘శిశిరం’ మరింత గుర్తింపునిస్తుంది
చైల్డ్ సూపర్ స్టార్ లిటిల్ భాను
తెనాలి: శ్రీకృష్ణ ఆర్ట్స్ పతాకంపై తెనాలి, పరిసరాల్లో చిత్రీకరణ జరుపుకొంటున్న బాలల సినిమా ‘శిశిరం’లో ప్రధాన పాత్ర పోషిస్తున్న తనకు, ఈ చిత్రంలో మరింత గుర్తింపు లభిస్తుందని బాల నటుడు, తండేల్ ఫేమ్ భానుప్రకాష్ అన్నాడు. మంగళవారం సాయంత్రం స్థానిక ప్రిన్సెస్ హోటల్లో శిశిరం చిత్ర యూనిట్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో భాను మాట్లాడారు. కళల కాణాచి తెనాలిలో షూటింగ్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడు రత్నాకర్ మాట్లాడుతూ ఏప్రిల్ 9 నుంచి 11 వరకు తెనాలి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుందన్నారు. తండేల్ చిత్రంలో జాతీయ సమైక్యతను చాటి చెప్పే పాత్రలో భాను అద్భుత నటనకు గాను తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, ఏంఈఓ డాక్టర్ మేకల లక్ష్మీనారాయణ, వన్టౌన్ సీఐ మల్లికార్జున రావు, కొరియా గ్రాఫర్ ‘అమ్మ’ సుధీర్ అభినందించారు. సమావేశంలో ప్రొడక్షన్ డిజైనర్ ఎం.శ్రీకాంత్, పీఆర్ఓ అంబటి శ్యామ్సాగర్, బాలనటులు పాల్గొన్నారు.
రేపు గుంటూరులో జాబ్ మేళా
గుంటూరు ఎడ్యుకేషన్: గుజ్జనగుండ్ల సర్కిల్లోని గుంటూరుజిల్లా ఉపాధి కార్యాలయంలో గురువారం జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి డి.దుర్గాబాయి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గోదావరి ఆంధ్ర కో–ఆపరేటివ్ బ్యాంక్, సీఐఐ–ఎంసీసీ, పేటీఎం, అపెక్స్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఫెయిర్ డీల్ క్యాపిటల్, క్యాప్స్టన్ సర్వీసెస్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకై ఆయా సంస్థల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని తెలిపారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, పీజీ విద్యార్హతలు గల 18 నుంచి 35 ఏళ్ల లోపు వయసు గల నిరుద్యోగ యువతీ, యువకులు బయోడేటా, రెజ్యూమ్, విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్, ఆధార్ జిరాక్స్, పాస్పోర్ట్ సైజు ఫొటోతో గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు జరిగే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. వివరాలకు 98668 22697 నంబర్లో సంప్రదించాలని తెలిపారు.