
మాదక ద్రవ్యాలతో యువత భవిష్యత్ నాశనం
జిల్లా ఇన్చార్జి కలెక్టర్ భార్గవ్ తేజ
గుంటూరు వెస్ట్ : మాదక ద్రవ్యాల వినియోగంతో యువత భవిష్యత్తు నాశనంతో పాటు దేశ అభివృద్ధిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్తేజ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ కమ్యూనిటీ విజిలెన్స్ అవగాహన సదస్సును జిల్లా ఎస్పీ సతీష్కుమార్తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల వినియోగం, అమ్మకాలపై కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. ముఖ్యంగా యువత, విద్యార్థులు వీటిని వినియోగిస్తున్నట్లు తెలిపారు. వినియోగం అరికట్టేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో పోలీసులు సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నిషేధిత మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై సమాజంలో విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. నిషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ర్యాలీలు, విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ సతీష్కుమార్ మాట్లాడుతూ నిషేధిత మాదక ద్రవ్యాల కేసుల్లో వ్యక్తులను అరెస్టులు చేసి విచారించేటప్పుడు, ఉన్నత విద్యా సంస్థల్లోని విద్యార్థులకు వీటిని తీసుకొచ్చినట్లు తెలిపారన్నారు. ముఖ్యంగా యూనివర్సిటీల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ విద్యనభ్యసిస్తున్న వారు అధికంగా సేవిస్తున్నట్లు తమ విచారణలో తేలిందని పేర్కొన్నారు. విద్యా సంస్థల్లో ఈగల్ క్లబ్లు ఏర్పాటు చేసి, నిషేధిత మత్తు పదార్థాలను విద్యార్థులు వినియోగించకుండా చూడాలని కోరారు. అనంతరం మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై పోలీసు శాఖ రూపొందించిన ఈగల్ ప్రచార పోస్టర్లను జిల్లా ఇన్చార్జి కలెక్టర్, ఎస్పీ, తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా, డీఆర్వో ఖాజావలి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, డీఈఓ రేణుక, ప్రొహిబిషన్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ అరుణకుమారి, జిల్లా అధికారులు ఆవిష్కరించారు.