
చెత్తతో విద్యుత్ ఉత్పత్తి అద్భుతం
వరంగల్ అర్బన్: చెత్తతో విద్యుత్ను ఉత్పత్తి చేయడం అద్భుతమని హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద అన్నారు. హైదరాబాద్లోని జవహర్నగర్ డంపింగ్ యార్డును వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు సత్యశారద, ప్రావీణ్య, గ్రేటర్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే బుధవారం సందర్శించారు. ఘన వ్యర్థాల నిర్వహణ పద్ధతి, చెత్త నుంచి విద్యుత్ తయారీ, చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్లను పరిశీలించారు. డివిజన్ల నుంచి చెత్తను ఎలా తరలిస్తున్నారు? డంపింగ్ యార్డు వద్ద ఎలాంటి పద్ధతులను అనుసరిస్తున్నారు? చెత్తను ఎలా రీసైక్లింగ్ చేస్తున్నారనే విషయాలను క్షేత్ర స్థాయిలో అధికారులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చెత్త నుంచి కరెంట్, గ్యాస్ను తయారు చేస్తున్న విధానాన్ని ఇదే తరహాలో గ్రేటర్ వరంగల్లో అభివృద్ధి చేస్తామన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ చేపడుతున్న రాంకీ సంస్థ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ ఎస్ఈ ప్రవీణ్ చంద్ర, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, సంబంధిత అధికారులు, రాంకీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్లు ప్రావీణ్య, సత్యశారద
హైదరాబాద్లోని
డంపింగ్ యార్డు పరిశీలన