
స్మార్ట్ సిటీ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి ఆరా
● వేగంగా పూర్తి చేయాలని ఆదేశాలు
● గడువు పొడిగింపు స్పష్టత లేదు
వరంగల్ అర్బన్: కేంద్ర హౌసింగ్–అర్బన్ ఎఫైర్స్ మంత్రి మనోహర్ లాల్ కట్టర్ గ్రేటర్ వరంగల్లో కొనసాగుతున్న స్మార్ట్ సిటీ ప్రాజెక్టుల పురోగతిపై ఆరా తీశారు. సోమవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తదితరులు పాల్గొన్నారు. వరంగల్ స్మార్ట్సిటీ కింద చేపట్టిన ప్రాజెక్టులు, పూర్తయిన పనులు, పురోగతిలో ఉన్న వాటిని అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. చాలా మేరకు పనులు పూర్తయ్యాయని, మరికొన్ని పనులు పురోగతిలో ఉన్నట్లు కమిషనర్ వెల్లడించారు. పురోగతిలో ఉన్న పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించినట్లు అధికారులు వెల్లడించారు. స్మార్ట్సిటీ ప్రాజెక్ట్ గడువు గత నెల 31తో ముగిసింది. కానీ మళ్లీ గడువు పొడిగింపుపై ఎలాంటి ప్రకటన చేయలేదని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఈ ప్రవీణ్చంద్ర, స్మార్ట్ సిటీ పీఎం సి.భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
చెత్త తరలించే వాహనాల అడ్డగింత
మడికొండ: మడికొండ – రాంపూర్ గ్రామాల మధ్య ఉ న్న డంపింగ్ యార్డుతో సు మారు చుట్టుపక్కల ఉన్న పది గ్రామాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అడ్హక్ కమిటీ సభ్యులు తెలిపారు. ఈమేరకు డంపింగ్ యార్డ్ను అక్కడ నుంచి తొలగించాలని కోరుతూ 64వ డివిజన్ కార్పొరేటర్ ఆవాల రాధికరెడ్డి ఆధ్వర్యంలో డంపింగ్ యార్డుకు వస్తున్న వాహనాలను మడికొండ చౌరస్తాలో సోమవారం అడ్డుకున్నారు. దాంతో ట్రాఫిక్ స్తంభించగా, ఇన్స్పెక్టర్ కిషన్.. తన సిబ్బందితో అక్కడకు చేరుకొని ఆందోళన చేస్తున్న వారిని పోలీసు స్టేసన్కు తరలించారు. కార్పొరేటర్ రాధికారెడ్డి మాట్లాడుతూ డంపింగ్ యార్డ్తో పలు గ్రామాల ప్రజలు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారన్నారు. గడ్డం మహేందర్, పల్లపు యాదగిరి, నర్సింగరావు, బుర్ర రాజ్కుమార్, తండా శంకర్, కట్ట వెంకట్రాంనర్సయ్య, ఆవాల నరోత్తంరెడ్డి, బరిగల కృష్ణమూర్తి, బోగి దేవేందర్, గడ్డం అశోక్, అరూరి తిరుపతి, మాచర్ల శ్రీధర్, బత్తి కిరణ్, వెన్నమల్ల రమేశ్, గడ్డం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

స్మార్ట్ సిటీ ప్రాజెక్టులపై కేంద్ర మంత్రి ఆరా