
వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు
డీఎంహెచ్ఓ అప్పయ్య
ఎంజీఎం: వేసవిలో వడదెబ్బకు గురి కాకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై సరైన జాగ్రత్తలు తీసుకోవాలని హనుమకొండ డీఎంహెచ్ఓ అప్పయ్య ప్రజలకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వేసవిలో వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అప్పయ్య మాట్లాడుతూ.. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్యాధికారులు ప్రజలకు అవగాహన కల్పించాలని, వడదెబ్బకు గురవకుండా నివారణ చర్యలు చేపట్టాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు జరుగుతున్న ప్రదేశాల్లో ఓఆర్ఎస్ పాకెట్లు అందించేలా, షెడ్ నెట్ ఏర్పాటు చేయాలని సూచించారు. వడదెబ్బ తగలకుండా, తగిలితే తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కాజీపేట మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ.. బల్దియా కమిషనర్ ఆదేశాల మేరకు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల్లో భాగంగా నగరంలో ముఖ్యమైన 42 చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నగర పాలక సంస్థ పరిధిలో పనిచేసే కార్మికులకు వేసవి దష్ట్యా పనివేళల్లో మార్పు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ ఏడీ జీవీ.భానుప్రసాద్, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఇక్తేదార్ అహ్మద్, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్రెడ్డి పాల్గొన్నారు.