
20 నుంచి ‘ఓపెన్’ పరీక్షలు
విద్యారణ్యపురి : హనుమకొండ జిల్లాలో ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ఈనెల 20నుంచి 26వతేదీ వరకు నిర్వహించనున్నట్లు డీఈఓ డి వాసంతి, ఉమ్మడి వరంగల్జిల్లా కోఆర్డినేటర్ ఎ. సదానందం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హనుమకొండ జిల్లాలో ఆరు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.అయితే పరకాలలోని జిల్లా పరిషత్ (బాలుర) హైస్కూల్ పరీక్ష కేంద్రానికి అనుబంధంగా ఆ పరీక్ష కేంద్రానికి దగ్గరలోనే ఎస్ఆర్ స్కూల్లో కూడా మరో కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. పరకాల జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో హాల్టికెట్ నంబర్ 2412130037 నుంచి 2412130187 వరకు గల విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సింటుందని తెలిపారు. పరకాలలోని ఎస్ఆర్ స్కూల్ పరీక్ష కేంద్రంలో హాల్టికెట్ నంబర్ 2412130188 నుంచి 2412130380వరకు గల విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాలన్నారు. ఆయా విద్యార్థులు ఒకరోజు ముందుగా పరీక్ష కేంద్రానికి వెళ్లి నిర్ధారించుకోవాలని వారు సూచించారు.
20న అండర్–7 జిల్లా స్థాయి చెస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి అండర్–07 చదరంగ ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు టోర్నమెంట్ నిర్వహణ కార్యదర్శి పి. కన్నా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హ నుమకొండ నక్కలగుట్టలోని ఎస్ఎంఆర్ హైస్కూ ల్లో ఎంపిక పోటీలు ఉంటాయని తెలిపారు. ఇందులో పాల్గొనే క్రీడాకారులు జనవరి01, 2018, ఆ తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు. ఇందులో గెలుపొందిన నలుగురు బాలురు, నలుగురు బాలికలను మే నెలలో హైదరాబాద్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు పేర్లు రిజిస్ట్రేషన్కు 90595 22986 నంబర్లో సంప్రదించాలని తెలిపారు.
మిర్చి కొనుగోళ్ల వివరాలు సేకరణ
వరంగల్: ఏనుమాములలోని వరంగల్ వ్యవసాయ మార్కెట్లో మిర్చి కొనుగోళ్లు చేసిన కమీషన్ వ్యా పారుల వివరాలను జీఎస్టీ అధికారులు సేకరిస్తున్నారు. గురువారం జీఎస్టీ అధికారులు శ్రీధర్, గోపి మార్కెట్ కార్యాలయానికి వచ్చి కార్యదర్శి జి.రెడ్డితో భేటీ అయ్యారు. మార్కెట్ ఫీజులు చెల్లించిన వ్యాపారులు జీఎస్టీ చెల్లించకపోవడం, ఏమేరకు సరుకులు ఖరీదు చేశారన్న వివరాలు తెలియకపోవడంతో అధికారులు కార్యాలయానికి వచ్చినట్లు తెలి సింది. వ్యాపారులు తాము కొనుగోలు చేసిన సరుకులకు ఒక శాతం మార్కెట్ ఫీజులు చెల్లించారు. ఈ ప్రకారం వ్యాపారులు తాము విక్రయించిన సరుకులకు 5శాతం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ వివరాలు అందిన వెంటనే సదరు వ్యాపారులకు జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేస్తారని తెలిసింది.
స్తంభాన్ని ఢీకొన్న లారీ
● ధర్మారంలో ఐదు గంటలపాటు నిలిచిన విద్యుత్ సరఫరా
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారం శివారులోని వరంగల్–నర్సంపేట రహదారి పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని గురువారం లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో విద్యుత్ తీగలు తెగిపోగా.. గొర్రెకుంట సబ్స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో సుమారు 5 గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయి వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గొర్రెకుంట సబ్స్టేషన్ ఏఈ దిలీప్ తన సిబ్బందితో కలిసి తీగలను సరి చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. స్థానిక శివ రోలర్ ఫ్లోర్మిల్లులోకి లోడ్లతో వచ్చిపోయే లారీలు తరచు స్తంభాలను ఢీకొనడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోతోందని స్థానికులు పేర్కొన్నారు.