
యాంత్రీకరణ.. పునరుద్ధరణ
గురువారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
రాయితీపై సాగు యంత్రాల పంపిణీ
భూపాలపల్లి రూరల్: సాంకేతిక అభివృద్ధితో వ్యవసాయ రంగంలో అనేక మార్పులు సంతరించుకున్నాయి. దీంతో సాగులో యంత్ర పరికరాల వినియోగం పెరిగింది. ఇందులో భాగంగా 2006లో అప్పటి ప్రభుత్వం రైతులకు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీలో అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 2018 వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో గత బీఆర్ఎస్ హయాంలో ఆగిపోయింది. ఈ వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పునరుద్ధరించి.. మహిళా రైతులకు వ్యవసాయ పరికరాలను రాయితీపై అందించాలని నిర్ణయించింది. ఇప్పటికే 18 రకాల యాంత్రీకరణ పరికరాలు( ట్రాక్టర్, రోటోవేటర్, స్ప్రెయర్, డ్రిప్, డ్రోన్, తదితరాలు) ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం జిల్లాకు రూ.38.51 లక్షలు నిధులను కేటాయించింది. రానున్న రోజుల్లో 820 వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను ఇవ్వాలని నిర్ణయించింది. వీటన్నింటిని 50 శాతం రాయితీలో మహిళా రైతులకు మాత్రమే అందించాలనే నిబంధన విధించింది. దీంతో అధికారులు గత నెల చివరి వరకు లబ్ధిదారులనుంచి దరఖాస్తులు స్వీకరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గాల వారీగా పరికరాలు, నిధులను కలెక్టర్ రాహుల్ శర్మ కేటాయించారు. మండలాల వారీగా మహిళా రైతులను ఎంపిక చేయనున్నారు.