రాయచూరు రూరల్ : రాయచూరులో సత్యనారాయణ అనే వ్యక్తి తన కూతురు, కుమారుడికి కాడు కురుబ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం తీసుకున్న అంశంలో రాయచూరు అసిస్టెంట్ కమిషనర్ గజానన రద్దు చేశారని హైదరాబాద్ కర్ణాటక వాల్మీకి నాయక్ సంఘం డివిజన్ కార్యదర్శి రఘువీర్ నాయక్ వెల్లడించారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పిల్లలకు పాఠశాలలో తండ్రి వారసత్వంతో కుల ప్రమాణపత్రం పొందకుండా తల్లి వారసత్వం ద్వారా కాడు కురుబ ఎస్టీ కుల ప్రమాణ పత్రాన్ని పొందడాన్ని వ్యతిరేకిస్తూ కురుబలు వెనుక బడిన వర్గాల పరిధిలోకి వస్తారని రుజువు కావడంతో తహసీల్దార్లు ఇచ్చిన కాడు కురుబ ఎస్టీ కుల ప్రమాణ పత్రాన్ని రద్దు చేశారన్నారు. పాఠశాలల్లో హెడ్మాస్టార్లు, టీసీ, ఇతర సర్టిఫికెట్లలో కాడు కురుబ ఎస్టీలను తొలగించి కురుబ వెనుక బడిన వర్గాల జాబితాలో చేర్చాలని నివేదికలను అందిస్తామన్నారు.