
విద్యార్థులపై తేనెటీగల దాడి
చింతామణి: పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్లో హఠాత్తుగా తేనెటీగలు దాడి చేసి సుమారు 20 మందికి విద్యార్థులను కుట్టాయి. బాధితులు చింతామణి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మంగళవారం పాలిటెక్నిక్ ఆవరణలో ఉన్న చెట్టుపై ఉండే తేనెపుట్టను కోతులు కదిలించాయి. దీంతో తేనెటీగలు చెలరేగిపోయాయి. ఆవరణలో ఉన్న విద్యార్ధులను కరిచాయి. విద్యార్ధులు నొప్పితో కేకలు వేసుకొంటూ పరుగులు తీశారు. కాలేజీ సిబ్బంది బాధితులను ఆస్పత్రిలో చేర్పించారు. అపాయం లేదనడంతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకొన్నారు.
రియల్ మోసగాడు అరెస్టు
దొడ్డబళ్లాపురం: నకిలీ పత్రాలు తయారుచేసి ఇతరుల స్థలాలను తనవిగా చెప్పుకుని అమ్మేసిన వంచకున్ని యలహంక పోలీసులు గోవాలో అరెస్టు చేశారు. ప్రదీప్ అలియాస్ పాయిజన్ ప్రదీప్ నిందితుడు. ఇతడు విద్యారణ్యపుర, యలంక, యలహంక న్యూటౌన్ పరిసర ప్రాంతాల్లో బోగస్ డాక్యుమెంట్లు తయారు చేసి కొన్ని స్థలాలు విక్రయించి మోసం చేశాడు. నిందితుడు ఆటో రామ అనే మరో రౌడీషీటర్తో కలిసి రియల్ ఎస్టేట్ పేరిట జనాన్ని కోట్ల రూపాయల మేర వంచన చేశాడు. బాధితుల్లో కొందరు పోలీసులు ఉన్నారు. పలువురు బాధితులు ఫిర్యాదు చేయగా గాలించి ఒకరిని పట్టుకున్నారు.
కరెంటు కంచెకు ఏనుగు బలి
మైసూరు: పొలంలో పంటల రక్షణ కోసం రైతులు అమర్చిన విద్యుత్ కంచెను తాకి ఓ అడవి ఏనుగు మృత్యువాత పడిన ఘటన చామరాజనగర జిల్లా గుండ్లుపేటె తాలూకా బండీపుర అభయారణ్యంలోని ఆలత్తూరు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన రాజేష్ అనే రైతు పొలంలో సుమారు 40 ఏళ్ల వయస్సుగల అడవి ఏనుగు చనిపోయింది. సోమవారం రాత్రి ఆహారం కోసం వచ్చిన ఏనుగు పొలానికి అమర్చిన కరెంటు కంచెను తాకడంతో షాక్ కొట్టి చనిపోయింది. ఓంకార వలయపు అటవీ అధికారులు పరిశీలించి రైతుపై కేసు నమోదు చేశారు. ఏనుగు కళేబరాన్ని పూడ్చిపెట్టారు.
తప్పయితే విచారిస్తున్నా: హోంమంత్రి
శివాజీనగర: సుద్దగుంటెపాళ్య ఘటన గురించి తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడమైనది. ఎప్పటికీ మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యతను ఇస్తానని హోం మంత్రి జీ.పరమేశ్వర్ చెప్పారు. అర్ధరాత్రి రోడ్డుపై వెళ్తున్న యువతిని ఓ దుండగుడు అసభ్యంగా తాకిన ఘటన కలకలం రేపుతోంది. బెంగళూరు వంటి నగరంలో ఇటువంటివి జరుగుతుంటాయని హోంమంత్రి చెప్పడం తెలిసిందే. దీనిపై పలు వర్గాల నుంచి విమర్శలు రావడంతో మంగళవారం వివరణ ఇచ్చారు. బీజేపీవారు రాజకీయం చేస్తున్నారని, ఒకవేళ రాష్ట్రంలో తల్లుల మనస్సుకు బాధ కలిగించి ఉంటే విచారం వ్యక్తం చేస్తానని తెలిపారు.
పెట్రో, గ్యాస్ ధరలపై నిరసన
శివాజీనగర: కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ సిలిండర్ల ధరను పెంపును నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు మంగళవారం బెంగళూరులోని గాంధీ విగ్రహం ముందు ధర్నా చేశారు. ధరలను నిత్యం పెంచి పేదల జీవితాల మీద భారం పెంచుతున్నారు, ఇది అవినీతి కేంద్ర ప్రభుత్వ సాధన అని నేతలు ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీ పరిపాలనలో అచ్చే దిన్ పేరుతో నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం ద్వారా రికార్డు సృష్టించింది. ప్రతి వ్యక్తిపై నేడు లక్షలాది రూపాయలు రుణ భారాన్ని నరేంద్ర మోదీ మోపారు అని ఆరోపించారు. ఈ సందర్భంగా మహిళా కార్యకర్తలు గ్యాస్ సిలిండర్లతో, పురుష కార్యకర్తలు ఎద్దుల బండి ఎక్కి నిరసన తెలిపారు.

విద్యార్థులపై తేనెటీగల దాడి

విద్యార్థులపై తేనెటీగల దాడి