
కృష్ణా వంతెనలకు మోక్షమెన్నడో?
రాయచూరు రూరల్: దేవుడు వరమిచ్చిన పూజారి వరమివ్వలేదన్న సామెత చందంగా ప్రజా ప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యంతో రూ.38 కోట్లతో కృష్ణా నది పాయలపై చేపట్టిన వంతెనల నిర్మాణ పనులు అర్థంతరంగా ఆగిపోయాయి. రాయచూరు తాలూకాలోని అత్కూరు, కురువపుర మధ్య కృష్ణా నదికి అడ్డంగా వంతెన నిర్మాణాల పనులు నత్తనడకన సాగుతున్నాయి. నది మధ్యలో 24 సిమెంట్ దిమ్మెలను నిర్మించారు. కురువపురలోని నారదగడ్డ దత్తాత్రేయుని ఆలయ దర్శనార్థం వెళ్లడానికి సుగమమైన మార్గం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం 2011లో 675 మీటర్ల పొడవున వంతెన నిర్మాణ పనులను రూ.14.25 కోట్లతో శ్రీకారం చుట్టారు.
తడిసి మోపైడెన వ్యయం
2022 నాటికి ఆ నిర్మాణ వ్యయం రూ.22 కోట్లకు చేరుకుంది. అర్థాంతరంగా ఆగిన వంతెన నిర్మాణ పనులను శాసన సభ్యుడి సోదరులు కాంట్రాక్ట్ పొందారు. శాసన సభ్యుడికి భయపడి అధికారులు వంతెన నిర్మాణ పనులకు సంబంధించి గత మూడేళ్ల నుంచి నోరు మెదపక పోవడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. ఇక మరో వంతెనను రాయచూరు తాలూకా దొంగరాంపుర వద్ద కృష్ణా నదికి అడ్డంగా 2008లో రూ.7 కోట్లతో దొంగరాంపుర, కుర్వకుర్ద మధ్య 285 మీటర్ల పొడవున నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినా పూర్తి కాకుండా పోయింది. టెండర్ ప్రకటనలో నిర్లక్ష్యంతో దాని వ్యయం నేడు రూ.14 కోట్ల మేర పెరిగింది.
బిల్లుల మంజూరులో జాప్యం
మొత్తం రూ.21 కోట్లతో పనులు చేయడానికి కాంట్రాక్టర్కు బిల్లులు మంజూరు చేయక పోవడంతో రెండు వంతెనల పనులు అర్థాంతరంగా నిలిచాయి. కురువపుర నారదగడ్డ దత్తాత్రేయుడు, కుర్వకుర్ద హనుమాన్ ఆలయ దర్శనార్థం వెళ్లే భక్తులు వర్షాకాలంలో నాటు పడవలు, తెప్పల్లో ప్రయాణం చేయాల్సి వస్తోంది. వంతెనల నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో నదిలో వరద ఎక్కువగా ఉన్నప్పుడు తెప్పలు, నాటు పడవలు మునిగి భక్తులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. కాగా ప్రతినిత్యం ట్రాక్టర్లు, జేసీబీలతో అక్రమంగా నదిలో నుంచి ఇసుక రవాణా మాత్రం యథేచ్ఛగా కొనసాగుతోంది.
రూ.38 కోట్లతో నిర్మాణానికి శ్రీకారం
అర్థంతరంగా ఆగిన వారధ ుల పనులు

కృష్ణా వంతెనలకు మోక్షమెన్నడో?

కృష్ణా వంతెనలకు మోక్షమెన్నడో?