
రేషన్ బియ్యం పట్టివేత
హొసపేటె: విజయనగర జిల్లాలో కొట్టూరు–హరపనహళ్లి రోడ్డులోని అయ్యనహళ్లి గ్రామంలో శనివారం అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న వాహనంపై అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. నిందితులు షబ్బీర్, జిందూసాబ్, మంజునాథ్ బియ్యం రవాణా చేస్తుండగా ఎస్ఐ గీతాంజలి షిండే, ఫుడ్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ దాడి చేసి రూ.25,604 విలువ చేసే 740 కేజీల బియ్యం, రూ.70 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కొట్టూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
నియామకం
రాయచూరు రూరల్: రాయచూరు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా శ్రీనివాసరెడ్డిని నియమిస్తూ కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆదేశాలు జారీ చేశారు. గతంలో ఉన్న బసవరాజరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఏడాది పాటు ఖాళీగా ఉన్న పదవిని భర్తీ చేస్తూ నగరసభ సభ్యుడిగా కొనసాగుతున్న శ్రీనివాసరెడ్డిని నియమించి శనివారం కేపీసీసీ అధ్యక్షుడు ఆదేశ పత్రం విడుదల చేశారు. గత 25 ఏళ్లుగా పార్టీ కార్యకర్తగా విధులు నిర్వహించిన శ్రీనివాసరెడ్డిని నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు.
అగ్నిప్రమాదంలో
గడ్డివాములు బుగ్గి
హొసపేటె: విజయనగర జిల్లా హడగలి తాలూకా హరవి బసాపుర తాండాలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో మూడు గడ్డివాములు కాలిబూడిదయ్యాయి. గ్రామానికి చెందిన హావనూరు నింగప్ప, మైలార లింగప్పలకు చెందిన రెండు ట్రాక్టర్ల మొక్కజొన్న గడ్డి, రెండు ట్రాక్టర్ల వరిగడ్డి, యల్లవ్వకు చెందిన నాలుగు ట్రాక్టర్ల వరిగడ్డి, రెండు ట్రాక్టర్ల మొక్కజొన్నగడ్డి, పుట్టప్పకు చెందిన గడ్డివాములు కాలిపోయాయి.
నిరాడంబర వివాహాలే ముద్దు
రాయచూరు రూరల్: నేటి ఆధునిక సమాజంలో ముఖ్యంగా కళ్యాణ కర్ణాటకలో సరళ వివాహాలకు ప్రాధాన్యత కల్పించాలని మాజీ లోక్సభ సభ్యుడు బీ.వీ.నాయక్ పిలుపునిచ్చారు. ఆదివారం యాదగిరి జిల్లా హేమనాళలోని దేవర గుండ్లగుర్తి మైలార లింగేశ్వర ఆలయంలో ఏర్పాటు చేసిన సామూహిక వివాహాల్లో పాల్గొని ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు, కర్షకులు, కార్మికులు అధికంగా ఉన్న సమాజంలో దుబారా వ్యయంతో పెళ్లిళ్లు చేయడం కష్టకరమన్నారు. సామూహిక వివాహాల్లో బూది బసవేశ్వర, శాంత నిజలింగ, శివశంకరప్ప, పంచాక్షరి, శంభు సోమనాథ స్వామీజీలు, శ్రీనివాస్, వరదానంద, శివణ్ణ, దానయ్యలున్నారు.
తాగునీటి కోసం నిరసన
రాయచూరు రూరల్: వేసవిలో తాగునీటి ఎద్దడి తీర్చాలని ఒత్తిడి చేస్తూ ఆదివారం యాపలదిన్ని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రజలు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. 15 రోజుల క్రితం వదిలిన తాగునీటిని నేటికీ వదలక పోవడంతో అధికారుల తీరుపై మండిపడుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. నీటి ఎద్దడి నెలకొనకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినా స్పందించక పోవడాన్ని ఖండించారు.
క్రీడలతో శారీరక ఆరోగ్యం
రాయచూరు రూరల్: క్రీడలు శారీరక ఆరోగ్యానికి నాంది పలుకుతాయని దేవసూగూరు కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ముజాహిద్ అన్నారు. ఆయన ఆదివారం ఎలిమినేటర్ క్రీడా పోటీల్లో పాల్గొని మాట్లాడారు. క్రీడల్లో గెలుపు ఓటమిలను సమానంగా స్వీకరించి ప్రత్యర్థికి మానసిక స్థైర్యాన్ని నింపాలన్నారు. నెల రోజుల పాటు జరిగే క్రికెట్ లీగ్ పోటీల్లో 8 జట్లు పాల్గొనడం అభినందనీయమన్నారు. పోటీల్లో బాషానాయక్, శాలం, బందే నవాజ్, రజాక్, బాబు, మొయినుద్దీన్లున్నారు.

రేషన్ బియ్యం పట్టివేత

రేషన్ బియ్యం పట్టివేత

రేషన్ బియ్యం పట్టివేత