వైరాకు గోదావరి రానట్లేనా?
● లింక్ కెనాల్ పూర్తయినా రిజర్వాయర్కు చేరని నీరు ● ఎన్నెస్పీ కాల్వలోకి చేరాక ఇతర ప్రాంతాలకు మళ్లింపు ● వేసవి నేపథ్యాన రిజర్వాయర్లో తగ్గుతున్న నీటిమట్టం
వైరా: గోదావరి జలాలు తమ ప్రాంతానికి వస్తాయని.. సాగర్ ప్రాజెక్టు ద్వారా నీరు రాకున్నా ఇక్కట్లు ఉండబోవని వైరా ప్రాంత రైతులు కలలు కన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సాధ్యం కాని ఈ ప్రాజెక్టు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రూపుదాల్చడంతో ఆరు నెలల్లోనే నీరు అందుతుందని.. తద్వారా యాసంగిలో సాగునీటికే కాక వేసవిలో తాగునీటికి ఢోకా ఉండదని భావించారు. అయితే, ఏన్కూరు లింక్ కెనాల్ నిర్మాణం పూర్తయినా వైరా రిజర్వాయర్కు నీరు చేరకపోగా ఇతర ప్రాంతాలకు మళ్లించడంతో వారి ఆశలు నెరవేరేదెన్నడో తెలియరావడం లేదు.
గత ఏడాది శంకుస్థాపన..
సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాల్వ నుంచి ఏన్కూరు సమీపాన ఎన్నెస్పీ కెనాల్లోకి గోదావరి నీరు చేర్చేందుకు గాను రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణానికి సంకల్పించారు. ఈమేరకు గత ఏడాది మార్చి 13న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సహా మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ కెనాల్ నిర్మాణం ఇటీవల పూర్తవడంతో ఈనెల 5వ తేదీన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గోదావరి జలాలను విడుదల చేశారు.
ఎస్కేప్ లాక్లు మూసివేస్తేనే...
ఏన్కూరు లింక్ కెనాల్ నిర్మాణం పూర్తవడంతో ఈనెల 5న సీతారామ ప్రాజెక్టు నుంచి కెనాల్లోకి గోదావరి జలాలను మంత్రి తుమ్మల విడుదల చేశారు. ఈ నీరు సాఫీగా ముందుకు సాగి ఎన్నెస్పీ కెనాల్లోకి చేరింది. ఆపై నీరు వైరా రిజర్వాయర్లోకి చేరాలి. అలా జరగకపోగా సత్తుపల్లి నియోజకవర్గంలోని కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు మండలాలకు మళ్లాయి. ఏన్కూరు సమీపాన ఎన్నెస్పీ కెనాల్ నుంచి 13 కి.మీ. మేర జలాలు ప్రవహించి తిమ్మరావుపేట ఎస్కేప్ లాక్ల ద్వారా వైరా రిజర్వాయర్లోకి చేరాల్సి ఉంటుంది. ఇందుకోసం అధికారులు ముందుగానే లాక్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే, లాక్లు వేయకపోగా.. నీటి ఉధృతి లేకపోవడంతో వెనక్కి రాలేదు. కాగా, 600 క్యూసెక్కుల నీరే కెనాల్లో ప్రవహిస్తోందని, ఇది 800 క్యూసెక్కులకు చేరితేనే నిమ్మవాగు ద్వారా వైరా రిజర్వాయర్కు గోదావరి జలాలు వస్తాయిని అధికారులు చెబుతున్నారు. దీంతో ఇది ఎప్పుడు జరుగుతుందనే ప్రశ్న రైతులను వేధిస్తోంది. ఎండలు పెరుగుతుండడంతో రిజర్వాయర్లో నీరు అడుగంటుతుండగా, సాగర్ జలాలను వారబందీ విధానంలో విడుదల చేస్తున్నారు. కనీసం గోదావరి నీరయినా వస్తుందని తద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు, 16మండలాలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఉండబోవని భావిస్తే అందుకు విరుద్ధమైన పరిస్థితులు నెలకొనడం గమనార్హం.
ఏడాదిగా చూస్తున్నాం..
గోదావరి జలాలు వైరా రిజర్వాయర్లోకి వస్తాయని ఏడాదిగా చెబుతున్నారు. ఇటీవల నీరు విడుదల చేయగానే రిజర్వాయర్లోకి చేరతాయని అందరం అనుకున్నాం. కానీ ఇప్పటికీ ఆ నీరు రాలేదు. పంటల చివరి దశలో ఇబ్బంది ఉండదని భావిస్తే ఆ పరిస్థితి కానరావడం లేదు.
– వి.కృష్ణారెడ్డి, రైతు, గరికపాడు
రెండు పంటలు పండుతాయని
వైరా రిజర్వాయర్లోకి గోదావరి జలాలు చేరితే రెండు పంటలు పండుతాయని ఎదురుచూశాం. అయితే, ప్రభుత్వం మారినా వైరా రిజర్వాయర్లోకి గోదావరి జలాలు రాలేదు. పంపులు ఆన్ చేశారని చెప్పినా మా వైపు నీరు రాకపోగా.. కారణాలు ఎవరూ చెప్పడం లేదు.
– జె వెంకటరమణ, రైతు, దాచాపురం
త్వరలోనే గోదావరి నీళ్లు..
వైరా రిజర్వాయర్లోకి గోదావరి నీళ్లు తప్పక చేరతాయి. రైతులెవరూ ఆందోళన చెందొద్దు. ఈ విషయంలో పూర్తి బాధ్యత నేనే తీసుకుంటా. అతి త్వరలోనే రిజర్వాయర్లోకి గోదావరి జలాలు చేరడం ఖాయం.
– మాలోత్ రాందాస్ నాయక్, ఎమ్మెల్యే, వైరా
గోదావరి జలాలేవి?
గోదావరి జలాలేవి?
గోదావరి జలాలేవి?