● శాసనసభ సమావేశాల్లో ఆమోదం ● మండలిలో ఆమోదించాక గవర్నర్ సంతకమే తరువాయి.. ● 23,484 మంది జనాభాతో ఏర్పాటు
కల్లూరు: కల్లూరును మున్సిపాలిటీగా అప్గ్రేడ్ చేయాలని కోరుతున్న ప్రజల కల ఎట్టకేలకు సాకారమైంది. అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం కల్లూరు మున్సిపాలిటీకి సంబంధించి ముసాయిదాను మంత్రి శ్రీధర్బాబు ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో శాసన మండలిలోనూ ఆమోదించాక గవర్నర్ సంతకం పెడితే కల్లూరు మేజర్ గ్రామపంచాయతీ మున్సిపాలిటీగా అప్గ్రేడ్ కానుంది. ఇదే జరిగితే జిల్లాలో ఐదో మున్సిపాలిటీఏర్పాటవుతుంది. ఖమ్మం కార్పొరేషన్కు తోడు మధిర, వైరా, సత్తుపల్లి మున్సిపాలిటీలు ఉండగా ఇటీవలే ఏదులాపురం మున్సిపాలిటీ ఏర్పాటైన విషయం విదితమే.
డిసెంబర్లో మంత్రి హామీ
గత ఏడాది డిసెంబర్ 21న మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఇందిరమ్మ మోడల్ ఇంటి శంకుస్థాపనకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మాట్లాడుతూ కల్లూరు ప్రజల చిరకాల కోరిక అయిన మున్సిపాలిటీ అంశాన్ని ప్రస్తావించగా.. త్వరలోనే కల సాకారమవుతుందని హామీ ఇచ్చారు. ఆతర్వాతఈ ఏడాది జనవరి 3వ తేదీన పంచాయతీ ఈఓ నందిశెట్టి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన గ్రామసభలో మెజారిటీ ప్రజలు మున్సిపాలిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. దీంతో అసెంబ్లీలో ముసాయిదా ప్రవేశపెట్టగా ఆమోదం లభించింది.
ఆ గ్రామాలు మళ్లీ...
పరిపాలనా సౌలభ్యం కోసం 2018లో కల్లూరు, ఖాన్ఖాన్పేట, శ్రీరామపురం, జీడీబీపల్లి మినహా కప్పలబంధం, తూర్పు లోకవరం, పడమర లోకవరం, కిష్టయ్యబంజర్, పుల్లయ్యబంజర, హనుమా తండా గ్రామాలను విడదీసి కొత్త పంచాయతీలుగా ఏర్పాటుచేశారు. కల్లూరు, శ్రీరామపురం, ఖాన్ఖాన్పేట, జీడీబీపల్లి గ్రామాల్లో 18,170 మంది జనాభా ఉండగా, సుమారు 13,500 మంది ఓటర్లు ఉంటారు. అయితే, మున్సిపాలిటీ ఏర్పాటుకు కనీసం 20 వేల మంది జనాభా అవసరం కావడంతో పూర్వం విడిపోయిన ఆరు గ్రామాలే కాక వాచ్యా నాయక్ తండాను కూడా కలపనున్నాయి. దీంతో 23,484 మంది జనాభాతో కల్లూరు మున్సిపాలిటీగా అవతరించనుంది. ఈ మేరకు ఆయా గ్రామాల్లో తీర్మానాలు చేసి ఇప్పటికే కలెక్టర్కు నివేదికలు పంపించారు.
కలెక్టరేట్కు నివేదిక
మున్సిపాలిటీగా మారనున్న నేపథ్యాన కల్లూరు పంచాయతీలో గ్రామసభ నిర్వహించగా మెజారిటీ గ్రామస్తులు ఆమోదం తెలిపారు. అంతేకాక విలీనం కానున్న గ్రామాల్లోనూ సభలు నిర్వహించి కలెక్టరేట్కు నివేదిక పంపించాం.
– ఎన్.నాగేశ్వరరావు, ఈఓ
ఇకపై కల్లూరు మున్సిపాలిటీ!