● ఈనెల 1నుంచి కేంద్రాల ప్రారంభం ● 25.84 లక్షల క్వింటాళ్ల సేకరణ అంచనా ● సన్నధాన్యానికి ఈసారి కూడా బోనస్
సన్న రకానికి ప్రాధాన్యత
వచ్చే నెల 1నుంచి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేయనుంది. ఇందుకోసం వానాకాలం సీజన్లో సన్న ధాన్యాన్ని సేకరించి మిల్లులకు అప్పగించాక సీఎంఆర్గా తీసుకున్నారు. ఇక యాసంగి సీజన్లోనే సన్న ధాన్యం కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అందుకోసమే జిల్లాలో 344 కొనుగోలు కేంద్రాలు తెరవనుండగా, ఇందులో సన్న రకం ధాన్యానికి 282, దొడ్డు రకాల కోసం 62 కేంద్రాలు ఏర్పాటుచేస్తున్నారు. కాగా, జిల్లాలో సన్న, దొడ్డు రకం కలిపి 25,84,928 క్వింటాళ్ల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో సన్న రకాలు 18,53,370 క్వింటాళ్లు, దొడ్డు రకం 7,31,558 క్వింటాళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. జిల్లాలోని 2,10,830 ఎకరాల్లో వరి సాగు కాగా, ఇందులో సన్న రకం 1,29,064 ఎకరాలు, దొడ్డు రకం ధాన్యం 81,766 ఎకరాల్లో సాగైంది.
క్వింటాకు రూ.500 బోనస్
గ్రేడ్–ఏ రకం క్వింటాకు రూ.2,320, సాధారణ రకాలకు రూ.2,300గా ధర నిర్ణయించారు. సన్న రకంలో 33రకాలను గుర్తించగా.. గత సీజన్ మాదిరే క్వింటాకు రూ.500 బోనస్ చెలిస్తారు. అయితే, మట్టి, రాళ్లు, పెళ్లలు, చెత్త, తాలు ఒక శాతం లోపే ఉండాలి. పూర్తిగా తయారు కాని, కుంచించుకుపోయిన ధాన్యం మూడు శాతం, పాడైన, రంగుమారి మొలకెత్తిన, పురుగు తిన్న ధాన్యం ఐదు శాతం, పక్వానికి రానిది ఒక శాతం, కల్తీ తక్కువ రకం ఆరు శాతం లోపు ఉంటేనే సేకరిస్తారు. తేమ 17 శాతంలోపు ఉంటేనే ధాన్యానికి మద్దతు ధర లభిస్తుందని అధికారులు అవగాహన కల్పించనున్నారు.
వేర్వేరు ట్యాగ్లు
డీఆర్డీఏ, పీఏసీఎస్, డీసీఎంఎస్, మెప్మా ఆధ్వర్యాన 344 కేంద్రాల ద్వారా ధాన్యం సేకరిస్తారు. సన్న, దొడ్డు ధాన్యం సేకరణకు వేర్వేరు కేంద్రాలు ఏర్పాటుచేయనున్న అధికారులు ప్యాకింగ్లోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోనున్నారు. సన్న ధాన్యం బస్తాలను ఎరుపు రంగు దారంతో, దొడ్డు ధాన్యం బస్తాలను గ్రీన్ కలర్ దారంతో సీల్ చేయిస్తారు. తద్వారా సులువుగా గుర్తుపట్టొచ్చని చెబుతున్నారు.
కేంద్రాల్లో సౌకర్యాలు
ఎండల నేపథ్యాన కొనుగోలు కేంద్రాల్లో చలివేంద్రం ఏర్పాటు చేయడమేకాక ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచనున్నారు. టెంట్లు, కుర్చీలు సమకూర్చి విద్యుత్ సౌకర్యం సమకూర్చుకోవాలని నిర్వాహకులకు సూచించారు. అలాగే, గన్నీబ్యాగ్లు, ఇతర సామగ్రి వివరాలతో స్టాక్బోర్డు నిర్వహించాలని తెలిపారు. ధాన్యం అమ్మి రైతుల భూవివరాలు, ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, సెల్ఫోన్ నంబర్ను ఓపీఎంఎస్ సాఫ్ట్వేర్లో నమోదు చేయాల్సి ఉంటుంది.
క్వింటాకు కనీస మద్దతు ధర (రూ.)
2,320 2,300
సాధారణ రకం
(గ్రేడ్–ఏ) రకం
కేంద్రాల ఏర్పాటుకు సిద్ధం
జిల్లాలో వచ్చేనెల 1నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నాం. అయితే, నేలకొండపల్లి, కూసుమంచి, తల్లాడ, సత్తుపల్లి మండలాల్లో ఇప్పటికే కోతలు మొదలైనందున అక్కడ ముందుగానే కొనుగోలు కేంద్రాలు తెరవనున్నాం. అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు టార్పాలిన్లు, తేమ పరిశీలించే యంత్రాలు అందుబాటులో ఉంచాలని సూచించాం.
– శ్రీలత, మేనేజర్, జిల్లా పౌరసరఫరాల సంస్థ
జిల్లాలోని 344 కేంద్రాల ఏర్పాటుకు కార్యాచరణ