నేడు, రేపు మంత్రి తుమ్మల పర్యటన | - | Sakshi

నేడు, రేపు మంత్రి తుమ్మల పర్యటన

Mar 28 2025 1:49 AM | Updated on Mar 28 2025 1:46 AM

ఖమ్మంవన్‌టౌన్‌: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లాలో శుక్ర, శనివారాల్లో పర్యటించనున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నగరంలోని సీక్వెల్‌ వద్ద నిర్వహించే ఇఫ్తార్‌ విందులో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు వైరారోడ్‌, 42వ డివిజన్‌లో ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. శనివారం ఉదయం 9 గంటలకు 18వ డివిజన్‌ శ్రీరామ్‌హిల్స్‌లో బీటీ రోడ్డు నిర్మాణానికి, సాయంత్రం 4.30 గంటలకు రఘునాథపాలెం మండలం వీవీ పాలెం నుంచి ఇల్లెందు రోడ్డులో ఎన్నెస్పీ కెనాల్‌ వద్ద బీటీ రోడ్డు నిర్మాణానికి, అంతర్గత సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 6 గంటలకు తల్లాడ మండలం బిల్లుపాడులో ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొంటారు.

పడిపోతున్న నీటి మట్టం

11.8 అడుగులకు చేరిన వైరా రిజర్వాయర్‌

వైరా: వైరా రిజర్వాయర్‌ నుంచి తాగు, సాగు అవసరాలకు నీరు విడుదల చేస్తుండడంతో నీటి మట్టం వేగంగా తగ్గుతోంది. రిజర్వాయర్‌ పూర్తి స్థాయి నీటి మట్టం 18.3 అడుగులు కాగా ప్రస్తుతం 11.8 అడుగులకు చేరుకుంది. ఎండల తీవ్రత నేపథ్యంలో రోజుకు 33 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతుండగా.. రిజర్వాయర్‌ కుడి, ఎడమ కాల్వల ద్వారా 12 క్యూసెక్కుల నీటిని పంటలకు విడుదల చేస్తున్నారు. మరో 37 క్యూసెక్కుల నీటిని మిషన్‌ భగీరథ పథకానికి వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో నీటి పారుదల శాఖ అధికారులు రిర్వాయర్‌లో నీటి లభ్యతపై ప్రభుత్వానికి నివేదిక అందించారు. సాగర్‌ ప్రధాన కాల్వ నుంచి వైరా రిజర్వాయర్‌కు నీటిని మళ్లిస్తే వేసవి నుంచి గట్టెక్కే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆలోచించి రిజర్వాయర్‌కు సాగర్‌ జలాలు మళ్లించాలని పలువురు కోరుతున్నారు.

ఖమ్మం మార్కెట్‌కు

వరుస సెలవులు

ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా నాలుగు రోజులు సెలవులు ప్రకటించారు. ఈనెల 29న అమావాస్య, 30న ఆదివారంతో పాటు ఉగాది, 31న రంజాన్‌, ఏప్రిల్‌ 1న రంజాన్‌ పండుగ తెల్లవారి కూడా సెలవు ఇస్తున్నట్లు మార్కెట్‌ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌ 2వ తేదీ బుధవారం నుంచి పంట ఉత్పత్తుల క్రయ, విక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు.

ముగిసిన ‘బార్‌’ ఎన్నికలు

ఖమ్మంలీగల్‌ : ఖమ్మం బార్‌ అసోసియేషన్‌ ఎన్నికలు గురువారం ముగిశాయి. కొంతకాలంగా హోరాహోరీ ప్రచారం సాగించిన ఈ ఎన్నికల్లో మొత్తం 816 ఓట్లకు గాను 719 ఓట్లు పోలయ్యాయి. ఉదయం 10 గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా, న్యాయవాదులు ఉత్సాహంగా వచ్చి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ‘బార్‌’ అధ్యక్షుడిగా తొండపు వెంకటేశ్వరరావు తన సమీప అభ్యర్థి వెంకటేశ్వర గుప్తాపై 168 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఉపాధ్యక్ష పదవికి విజయశాంత సమీప ప్రత్యర్థి ఎస్‌కే జానీపై 5 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా గద్దల దిలీప్‌ తెల్లాకుల రమేష్‌ బాబుపై 39 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. గ్రంథాలయ కార్యదర్శిగా సింగారపు రాంబాబు, క్రీడా కార్యదర్శిగా కేవీపీ లక్ష్మి విజయం సాధించారు. జాయింట్‌ సెక్రటరీ, కోశాధికారి, మహిళా ప్రతినిధి పదవులు గతంలోనే ఏకగ్రీవమయ్యాయి. కాగా, గెలుపొందిన అభ్యర్థులకు ఎన్నికల అధికారి ధ్రువీకరణ పత్రాలు అందించారు.

ముగిసిన శిక్షణ

ఖమ్మం సహకారనగర్‌ : నగరంలోని ప్రభుత్వ ఐటీఐలో డాక్టర్‌ రెడ్డీస్‌ సంస్థ(సీఎస్‌డీ) సెంటర్‌ ఫర్‌ సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ సంస్థతో అనుసంధానంగా ఎలక్ట్రికల్‌ వెహికిల్‌ సర్వీస్‌ టెక్నీషియన్‌ అనే అంశంపై పది రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా సంస్థ బాధ్యులు భవ్య, దివ్వెల వెంకటేశ్వరరావు, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎ.శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించటంతో పాటు వారి భవిష్యత్‌ మార్చేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందించారు.

నేడు, రేపు మంత్రి తుమ్మల పర్యటన1
1/1

నేడు, రేపు మంత్రి తుమ్మల పర్యటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement