జలవనరుల శాఖ పనుల పరిశీలన | - | Sakshi

జలవనరుల శాఖ పనుల పరిశీలన

Mar 28 2025 1:49 AM | Updated on Mar 28 2025 1:47 AM

ఖమ్మంఅర్బన్‌: జిల్లాలో జలవనరులశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న పనులను క్వాలిటీ కంట్రోల్‌ విభాగం ఎస్‌ఈ బుచ్చిరెడ్డి, ఈఈ వెంకటరమణరావు, డీఈ చంద్రమోహన్‌ గురువారం పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటిస్తున్నారా అని ఆరా తీశారు. మున్నేరుపై నిర్మిస్తున్న రీటైనింగ్‌ వాల్స్‌, తిరుమలాయపాలెం మండలంలో కొనసాగుతున్న సీతారామప్రాజెక్ట్‌ అండర్‌ టన్నెల్‌ పనులు, రఘునాథపాలెం మండలంలోని మంచుకొండ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో జలవనరుల శాఖ ఎస్‌ఈ మంగళపుడి వెంకటేశ్వర్లు, ఈఈ అనన్య, డీఈలు జాన్‌బీ, ఝాన్సీ పాల్గొన్నారు.

పంటలు నమోదు చేసుకోవాలి

కారేపల్లి: రైతులు విధిగా పంట నమోదు చేయించుకోవాలని డీఏఓ పుల్లయ్య సూచించారు. గురువారం కారేపల్లి సొసైటీ ఎరువుల గోడౌన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పంటలు నమోదు చేస్తేనే ప్రభుత్వ రంగ సంస్థలకు విక్రయించే అవకాశం ఉంటుందన్నారు. పంటల విస్తరణను అనుసరించి ప్రభుత్వం వ్యవసాయ ప్రణాళికను తయారు చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ఏఓ బి.అశోక్‌కుమార్‌, ఏఈఓ బి. నరేష్‌, కార్యదర్శి బొల్లు హన్మంతరావు, గోడౌన్‌ ఇన్‌చార్జి ముండ్ల సురేష్‌ పాల్గొన్నారు.

‘ఉపాధి’ పనుల అక్రమాలు బట్టబయలు

తిరుమలాయపాలెం: మండల పరిధిలోని 2023– 24 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన ఉపాధి హామీ పనులలో పలు అవినీతి అక్రమాలు వెలుగుచూశాయి. గురువారం తిరుమలాయపాలెం ఎంపీడీఓ కార్యాలయంలో 16వ విడత ఓపెన్‌ఫోరమ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడీ చుంచు శ్రీనివాస్‌ ఎంపీడీఓ సిలార్‌సాహెబ్‌ ఆధ్వర్యాన నిర్వహించిన సామాజిక తనిఖీలో పలు అక్రమాలు వెలుగుచూశాయి. మొక్కలు లేకుండానే నిధుల డ్రాతో పాటు తప్పుడు మస్టర్లు, ఎర్రగడ్డలో తీర్మానాలు లేకుండా పనుల ఎంపిక తదితర అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా ఈజీఎస్‌ సిబ్బందికి రూ.52వేల జరిమానా విధించగా రూ.3.24లక్షలు రికవరీ చేసేందుకు అధికారులు నిర్ణయించారు. వీటిలో ఈజీఎస్‌ రూ.1.19లక్షలు కాగా మిగిలినవి ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌్‌ శాఖలలో అక్రమాలు జరిగినట్లు వెల్లడైంది. ఈ కార్యక్రమంలో డీవీఓ సక్రియనాయక్‌, డీసీ వీరయ్య, అసిస్టెంట్‌ డీవీఓ పవన్‌, ఏపీఓ శ్రీదేవి, రమేష్‌ బాబు, ఎస్‌ఆర్‌పీ చారి, పంచాయతీరాజ్‌ జేఈ ప్రపుల్‌కుమార్‌, ఏపీఓ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

సత్తుపల్లి టౌన్‌: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన సత్తుపల్లి మండలం కాకర్లపల్లి లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామానికి చెందిన మట్ట వెంకటేశ్వరరావు (35) ద్విచక్ర వాహనంపై సత్తుపల్లిలోని ఒక షాపింగ్‌ మాల్‌లో పనిచేస్తున్న తన భార్యను తీసుకెళ్లేందుకు వస్తున్నాడు. ఈ క్రమంలో కాకర్లపల్లి శివారులోని పాత ఎన్టీఆర్‌ కాలువ వంతెన సమీపంలో ఓ పానీపూరి బండిని ఢీ కొన్నాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇతడు పెయింటర్‌ గా పనిచేస్తున్నాడు. మృతునికి భార్య భవాని, ఒక కుమార్తె ఉన్నారు.

కూసుమంచి మండలంలో మరొకరు..

కూసుమంచి: ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం తురకగూడెం గ్రామానికి చెందిన షేక్‌ జాన్‌పాషా(40)తన బైక్‌పై ఖమ్మం నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో జుజుల్‌రావుపేట గ్రామ సమీపాన అతడి బైక్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్సై నాగరాజు మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

జలవనరుల శాఖ పనుల పరిశీలన1
1/1

జలవనరుల శాఖ పనుల పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement