
గాలిలో ప్రాణాలు...
రవాణా వాహనాల్లో ప్రయాణికుల తరలింపు
● అదనపు లోడ్కు తోడు డ్రైవర్ల మితిమీరిన వేగం ● వ్యాన్లు, ట్రాక్టర్లలో సామర్థ్యానికి మించి తీసుకెళ్తుండడంతో ప్రమాదాలు ● కూలీకి వెళ్తూ ప్రమాదాల బారిన పడుతున్న పేదలు
● కొద్దిరోజుల క్రితం బోనకల్ మండలంలో మహిళా కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తా పడగా ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో మరికొందరు గాయపడ్డారు.
● గత గురువారం ఖమ్మం రూరల్ మండలంలోనూ వాహనం బోల్తా కొట్టగా కూలీలకు గాయాలయ్యాయి.
● ఏన్కూరు మండలం నుంచి గత శుక్రవారం మహిళా కూలీలను తరలిస్తున్న ట్రాలీ ఆటో బోల్తా పడింది. దీంతో పలువురు మహిళలు గాయపడ్డారు.
ఖమ్మం క్రైం: రెక్కాడితే గాని డోక్కాడని కుటుంబాలు వారివి. ఇంటోభార్య, భర్త పనిచేస్తేగాని నోట్లోకి అన్నం వెళ్లలేని పరిస్దితి. అందుకోసం చద్దిమూట కట్టుకోని కూలీ పనులకు భర్త ఒక దిక్కు, భార్య ఓ దిక్కు వెళ్లుతుంటారు. ఈకూలీపనులకు వెళ్లి వచ్చే వరకు తమ ప్రాణాలకు గ్యారెంటీ లేకున్నా ఆవిషయం తెలిసికూడా ఇంట్లో పోయ్యి వెలగటం కోసం, తమ బిడ్డల కనీస అవసరాలను తీర్చడం కోసం దూరప్రాంతాలకు వాహనాలలో ప్రయాణం చేసి మరి మిరపతోటలకు వెళ్లుతున్నారు. ఈక్రమంలో తమను తీసుకోని వెళ్లే వాహనాల డ్రైవర్ల నిర్లక్ష్య డ్రైవింగ్కు బలవుతున్నారు. ఇటీవల కాలంలో మిరపతోటలకు వెళ్లే కూలీల వాహనాలు తరుచుగా ప్రమాదాలకు గురి అవుతున్నాయి.
10మందికి 30మందికి పైగా...
వేసవి కాలంలో మిరపతోటలో కూలీ పనిచేయడానికి ఎక్కువమంది కూలీలు అవసరం అవుతారు. దీంతో మిర్చితోట యజమానులు తమ ప్రాంతానికి చెందిన ట్రాలీలు, టాటా ఏస్ల డ్రైవర్లతో కూలీలను తీసుకొచ్చి, మళ్లీ వారిని దింపి వచ్చేదానికి కాంట్రాక్ట్ పద్ధతిపై ఒప్పందం చేసుకోంటారు. దీంతో ట్రాలీలు, టాటాఎస్లు నడిపే డ్రైవర్లు కూలీలు ఎక్కువగా నివసించే ప్రాంతాలు, గ్రామాల దగ్గరనుంచి, పట్టణాలు, చివరకు నగరాల నుంచి కూడా కూలీలను తీసుకోనివెళ్లుతుంటారు, వీరిలో అత్యధికంగా మహిళ కూలీలు ఉంటారు. వాస్తవానికి వారి వాహనాలలో 10నుంచి 12మంది మాత్రమే పట్టే ఖాళీగా ఉంటుంది. అయితే వీరు డిజిల్, పెట్రోల్తోపాటు ట్రిప్పులు తిరగటానికి ఇష్టంలేక డబ్బులకు కక్కుర్తిపడి ఒకేసారి 30మందికిపైగా కూలీలను కిక్కిరిసే విధంగా ఎక్కించి తీసుకెళ్లి, పని ముగిశాక మరలా అదే మాదిరిగా తీసుకొస్తున్నారు.
మితీమిరిన వేగం, అధిక ఓవర్ లోడ్
కూలీలను తీసుకోని వచ్చే వాహనాల డ్రైవర్లు ఇష్టారాజ్యంగా రోడ్లపై వాహనాలను నడుపుతున్నారు. సెల్ఫోన్ మాట్లాడుతూ , వాహనంలో పెద్దగా స్పీకర్లు పెడుతూ మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతుండటంతో వాహనాలు అధికలోడ్తో ఉండటంతో అదుపు తప్పి క్రింద పడిపోతున్నాయి. దీంతో ట్రాలీలో కూర్చోటానికి స్దలం లేక నిలబడే ఉండే కూలీలు క్రిందపడిపోయి కొంతమంది మత్యువాత పడిపోతుండగా మరికొంతమంది క్షతగాత్రులు అవుతున్నారు. నిరుపేద కుటంబానికి చెందిన వీరి కుటుంబాలు ఈఘటనలతో నిరాశ్రయులుగా మిగిలిపోతున్నారు.
పట్టించుకోని రవాణాశాఖ, పోలీస్శాఖ
రోడ్లపై ఓవర్లోడ్తో కూలీలను తీసుకోని వెళ్లేవాహనాల గురించి రవాణాశాఖ, పోలీస్ శాఖలు పట్టించుకోకపోవడంతో వారు తమ ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతూ కూలీల ప్రాణాలు గాలిలో పెట్టి నడుపుతున్నారు, వెంటనే పోలీస్, రవాణాశాఖ పట్టించుకోని ఓవర్లోడ్తో తీసుకొని వెళ్లుతున్న వాహనాలపై కొరడా ఝుళిపించి జరిమానా విధించి వాటిని సీజ్ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం....
ఆటోలు, ట్రాలీలు, టాటా ఏస్ల్లో సామర్థ్యానికి మించి కూలీలను తీసుకెళ్లవద్దని డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నాం. దీన్ని అరికకట్టేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం. ఓవర్లోడ్తో వెళ్లినట్లు తేలితే భారీ జరిమానా విధించడమే కాక వాహనాలు సీజ్ చేస్తాం. ఇప్పటికే పలు వాహనదారులకు జరిమానా విధించాం.
–వరప్రసాద్, ఇన్చార్జ్ ఆర్టీఓ

గాలిలో ప్రాణాలు...