ఖమ్మంవన్టౌన్: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10–30గంటల కు కూసుమంచి మండలం నాయకన్గూడెంలోని గంగమ్మతల్లి ఆలయంలో పూజలు చేయనున్న మంత్రి, ఆతర్వాత ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం జుజ్జుల్రావుపేట, తుమ్మలతండా, ధర్మాతండా మీదుగా మధ్యాహ్నం ఒంటి గంటకు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి మద్దులపల్లికి చేరుకుని సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత వరంగల్ క్రాస్రోడ్డులో 33/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్, గూడూరుపాడు–గోళ్లపాడు ఊటవాగు తండాకు బీటీ రోడ్డు, కస్నాతండాలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్ధాపన చేశాక కాచి రాజుగూడెం మీదుగా ఖమ్మం చేరుకుంటారు.
మంత్రి తుమ్మల...
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ఖమ్మంలో పర్యటిస్తారు. ఖమ్మం 44డివిజన్ శ్రీరాంనగర్లో రైతుబజార్ ను ప్రారంభించనున్న మంత్రి, ఆతర్వాత మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ప్రయాణికులు, సిబ్బందికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు
కల్లూరు: ఎండల కారణంగా ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది వడదెబ్బకు గురికాకుండా కల్లూరు కొత్త బస్టాండ్లో ఓఆర్ఎస్ ప్యాకెట్ల పంపిణీని ఖమ్మం రీజినల్ మేనేజర్ సరిరామ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ఎం మాట్లాడుతూ ఎండల నుంచి ఉపశమనం కలిగించేలా ఏటా మాదిరిగానే ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
కాగా, మూడు నెలలుగా దాతల సాయంతో మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఆ తర్వాత ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కండక్టర్ వీఎస్ఆర్.ప్రసాద్ కుటుంబాన్ని రీజినల్ మేనేజర్ సరిరామ్ పరామర్శించారు. ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించి కుటుంబీకులతో మాట్లాడారు. సంస్థ తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా కల్పించారు. ఈకార్యక్రమాల్లో సత్తుపల్లి, ఖమ్మం డిపో మేనేజర్లు యు.రాజ్యలక్ష్మి, దినేష్కుమార్, కల్లూరు మెడికల్ ఆఫీసర్ నవ్యకాంత్, వీబీఓ కిన్నెర ఆనందరావు, కంట్రోలర్ యంగళ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
నేడు, రేపు ఉపాధ్యాయులకు శిక్షణ
నేలకొండపల్లి: గత ఏడాది జూన్లో పదోన్నతి పొందిన ఉపాధ్యాయులకు బోధనా నైపుణ్యాల పెంపుదల, పాఠశాలల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా గురు, శుక్రవారాల్లో శిక్షణ ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు. జిల్లాలో 1,087 మంది పీజీ హెచ్ఎం, ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంలుగా, స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందారు. వీరిని కేటగిరీల వారీగా విభజించి ఏడు కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు. ఖమ్మం రోటరీనగర్లోని జెడ్పీహెచ్ఎస్తో పాటు ఎన్నెస్పీ కాలనీ, రాజేంద్రనగర్, రిక్కాబజార్, శాంతినగర్, ఇందిరానగర్, ఖాజీపుర జీహెచ్ఎస్ల్లో శిక్షణకు అధికారులు నిర్ణయించారు.
జేఈఈ మెయిన్స్ ప్రారంభం
ఖమ్మంసహకారనగర్: జిల్లాలో జేఈఈ మెయి న్స్ రెండో పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఖమ్మంలోని విజయ, శ్రీచైతన్య, బొమ్మ, ఎస్బీఐటీ కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేయగా రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించారు. ఉదయం పరీక్షకు 498మందిలో 454 మంది, మధ్యాహ్నం సెషన్లో 534మంది కి గాను 490మంది విద్యార్థులు హాజరయ్యారు.
ఎరువుల దుకాణాల్లో డీఏఓ తనిఖీ
ఖమ్మంరూరల్: రూరల్ మండలంలోని తల్లంపాడు, ముత్తగూడెం, నాయుడుపేట, ఆరేకోడులోఎరువులు, పురుగు మందుల దుకాణాలను జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య బుధవారం తనిఖీ చేశారు. ఈసందర్భంగా షాపుల్లో నిల్వలు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించిన ఆయన ప్రతీ అమ్మకంపై బిల్లు ఇవ్వాలని, స్టాక్ వివరాలతో రిజిస్టర్లు నిర్వహించాలని సూచించారు. డీలర్లు అమ్మకాల్లో అవకతవకలకు పాల్పడితే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఏఓ ఉమానగేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రయాణికులు, సిబ్బందికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు