
రిటైర్మెంట్ ఫలితం అందక మనోవేదన
ఖమ్మం సహకారనగర్: విశ్రాంత ఉద్యోగ, ఉపాధ్యాయులకు రిటైర్మెంట్ బెనిఫిట్లు అందక మనోవేదనకు గురవుతున్నారని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు పేర్కొన్నారు. రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు కూరపాటి పాండురంగయ్య మృతిపై వారు ఓ ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆయన జూలైలో ఉద్యోగ విరమణ చేసినా నేటికీ రిటైర్మెంట్ బెనిఫిట్లు అందక మానసికంగా ఇబ్బంది పడ్డారని, అనారోగ్యానికి గురైనా వైద్యం చేయించుకోలేకపోయారని పేర్కొన్నారు. ఇకనైనా ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులకు ఎప్పటికప్పుడు బెనిఫిట్లు మంజూరు చేయాలని కోరారు.
108లో గర్భిణికి ప్రసవం
పెనుబల్లి: ఆస్పత్రికి తరలిస్తున్న గర్భిణి మార్గమధ్యలోనే పురిటినొప్పులు పెరగడంలో 108 వాహనంలో ప్రసవించింది. మండలంలోని తాళ్లపెంట గ్రామానికి చెందిన డి.సుక్కీ పురిటి నొప్పులతో బాధపడుతుండగా 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వాహనంతో వచ్చిన సిబ్బంది ఆమెను పెనుబల్లి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే సుక్కీకి నొప్పుల తీవ్రత పెరగడంతో సిబ్బంది ప్రసవం చేశారు. తల్లీబిడ్డ క్షేమంగానే ఉండగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ధాన్యం కొనుగోళ్లు పరిశీలించిన డీఎస్ఓ
కూసుమంచి/ముదిగొండ: కూసుమంచి, ముదిగొండ మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి(డీఎస్ఓ) చందన్కుమార్ ఆదివారం తనిఖీ చేశారు. కూసుమంచి మండలం పాలేరుతో పాటు ముదిగొండ మండలంలోని పలు గ్రామాల్లో తనిఖీ చేసిన ఆయన ఇప్పటివరకు చేపట్టిన కొనుగోళ్లపై నిర్వాహకులను ఆరా తీశారు. అలాగే, రైతులతో మాట్లాడి ధాన్యం తేమ శాతం నిర్ధారణ, గన్నీ బ్యాగ్ల కేటాయింపు, రవాణాలో సమస్యలు ఎదురవుతున్నాయా అని తెలుసుకున్నారు. ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యాన కేంద్రాల వద్ద టెంట్ వేయించడమేకాక తాగునీరు అందుబాటులో ఉంచాలని, రైతులకు కుర్చీలు వేయించాలని సెంటర్ల ఇన్చార్జిలకు సూచించారు.
ఎన్నెస్పీ కాల్వలో పడి వ్యక్తి మృతి
తల్లాడ: మండలంలోని అన్నారుగూడెంకు చెందిన వ్యక్తి ఎన్నెస్పీ మెయిన్ బ్రాంచ్ కెనాల్లో కాలు జారి పడగా మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు... అన్నారుగూడెంకు చెందిన కటుకూరి జయరాజు(58) ఈనెల 4న గోపాలపేట సమీపాన పొలంలో పనికి వెళ్లాడు. మధ్యాహ్నం తాగునీటి కోసం గొడ్ల బ్రిడ్జి వద్ద కాలువలోకి దిగగా, నీటి ప్రవాహం ఉధృతంగా ఉండడంతో కాలు జారి పడి కొట్టుకుపోయాడు. కుటుంబీకులు, పోలీసులు గాలిస్తుండగా ఆదివారం ఉదయం లోకవరం సమీపాన ఆయన మృతదేహం లభ్యమైంది. ఈమేరకు జయరాజు కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సుబాబుల్ లోడింగ్కు వచ్చిన లారీ డ్రైవర్ మృతి
ఎర్రుపాలెం: మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ సమీపాన వే బ్రిడ్జి వద్ద ఓ లారీ డ్రైవర్ మృతి చెందాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం చౌటిగూడెంకు చెందిన లారీ డ్రైవర్ కొంపల్లి వెంకటేశ్వరరావు(56) శనివారం సుబాబుల్ కర్ర లోడింగ్కు వచ్చాడు. ఆయన లారీలో వ్రిశ్రాంతి తీసుకుంటూ మృత్యువాత పడ్డాడు. వే బ్రిడ్జి నిర్వాహకులు ఈ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాగా, ఆయన మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని ఆర్కే ఫౌండేషన్ బాధ్యుల సాయంతో మధిర ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
గుండెపోటుతో గ్రానైట్ కార్మికుడు...
ఖమ్మంరూరల్: మండలంలోని వెంకటగిరి క్రాస్ వద్ద ఓ గ్రానైట్ ఫ్యాక్టరీలో కటింగ్ ఆపరేటర్ కనపర్తి లక్ష్మయ్య(55) గుండెపోటుతో ఆదివారం మృతి చెందాడు. ముదిగొండ మండలం సువర్ణాపురానికి చెందిన లక్ష్మయ్య పనిలో ఉండగా, మధ్యాహ్నం కళ్లు తిరిగి కింద పడడంతో సహచరులు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆయన గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో లక్ష్మయ్య కుమారుడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.

రిటైర్మెంట్ ఫలితం అందక మనోవేదన