
విధులను బాధ్యతగా నిర్వర్తించండి
కోనేరుసెంటర్: పోలీసులు యూనిఫాంను అధికారంలా కాకుండా బాధ్యతగా భావించి విధులను నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు అన్నారు. ఎస్ఐలుగా శిక్షణ పూర్తి చేసుకుని జిల్లాకు కేటాయించిన 21 మంది సబ్ ఇన్స్పెక్టర్లు మంగళవారం ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. వారిని ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించడమే తమ బాధ్యతగా భావించాలన్నారు. సమాజంలో చెడును అరికట్టేలా పని చేయాలని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవించేందుకు కృషి చేయాలన్నారు. విధుల్లో ఎలాంటి రిమార్కులు లేకుండా సత్ప్రవర్తనతో మెలుగుతూ ప్రజల మన్ననలు పొందేందుకు ప్రయత్నించాలన్నారు. విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా, నిజాయతీగా వ్యవహరిస్తూ ప్రజలకు సేవలు అందించాలన్నారు. ప్రజల్లో పోలీసుల పట్ల విశ్వాసం పెరిగేలా పనిచేయాలన్నారు. నేర పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ కేసుల దర్యాప్తును పూర్తిచేయాలన్నారు. శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని విధి నిర్వహణలో అమలుపరుస్తూ పోలీస్ శాఖకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు. బాధితులతో మర్యాదపూర్వకంగా మసులుకోవడం, వారి సమస్యలను సానుకూలంగా ఆలకించడం, వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం ద్వారా పోలీసుల పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగేందుకు మరింత కృషి చేయాలన్నారు. చట్టాలను అమలు చేసే విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. కేసు దర్యాప్తులకు సంబంధించి ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గరాదన్నారు. శిక్షణ పూర్తి చేసుకుని జిల్లాకు వచ్చిన 21 మంది పీఎస్ఐలను ఆయన అభినందించారు.
శిక్షణ పూర్తి చేసుకుని ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రొబేషనరీ ఎస్ఐలు పీఎస్ఐలను అభినందించి దిశానిర్దేశం చేసిన ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment