
శుభకార్యానికి వచ్చి..అనంతలోకాలకు
● రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
ఎమ్మిగనూరురూరల్: బంధువుల ఇంట్లో వివాహానికి వచ్చాడు. అర్ధరాత్రి వరకు సంబరాల్లో పాల్గొన్న ఆ యువకుడు ఆదోనికి వెళ్లి వస్తానని బైక్పై బయలుదేరి మృత్యుఒడికి చేరాడు. మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఆదోని పట్టణంలోని ఇంద్రానగర్ ఎరుకుల కాలనీకి చెందిన మారెన్న కుమారుడు ఎరుకుల లక్ష్మన్న(28) కొంత కాలంగా హైదరాబాద్లో వెంట్రుకల వ్యాపారం, ఆదోనిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. మంగళవారం ఎమ్మిగనూరు పట్టణంలోని తమ బంధువుల పెళ్లికి భార్య మాధవితో కలిసి వచ్చాడు. రాత్రి పెళ్లి కుమారుడి ఇంటి దగ్గర డీజే పాటలకు నృత్యం చేస్తూ అందరితో సంతోషంగా గడిపాడు. భార్య, బంధువులు వద్దని వారించినా అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆదోనికి వెళ్లి ఉదయం వస్తానని బుల్లెట్ బైక్పై బయలుదేరాడు. మండల పరిధిలోని కోటేకల్ – ఆరేకల్ గ్రామాల మధ్య ఉన్న కోళ్ల ఫారం దగ్గర బైక్ అదుపుతప్పడంతో రోడ్డు పక్కన ఉన్న ముళ్లపొదల్లో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం ఉదయం అటుగా వెళ్తున్న వారు గమనించి విషయాన్ని రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలికి చేరుకొని మృతుడి దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఆధారంగా కుటుంబసభ్యుల సమాచారం తెలుసుకుని ప్రమాదం విషయం తెలియజేశారు. లక్ష్మన్న మృతదేహాన్ని చూసి బంధువులు బోరున విలపించారు. మృతదేహాన్ని రూరల్ పోలీసులు పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దీంతో పెళ్లి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు.
ప్రమాదవశాత్తూ కుందూలో పడి..
బండి ఆత్మకూరు: ప్రమాదవశాత్తూ కుందూనదిలో పడి దివ్యాంగుడు మృతిచెందాడు. మండల కేంద్రం బండిఆత్మకూరులో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన సగిలే రమణ రెడ్డి (59) తన ట్రైసైకిల్పై బస్టాండ్ నుంచి ఊరిలోకి వెళ్తున్నాడు. స్థానిక కుందూనది వంతెనపై వెళ్తుండగా ట్రైసైకిల్ అదుపు తప్పి నదిలో పడిపోయింది. స్థానికులు గమనించేలోపే నీటి ప్రవాహంలో కొట్టుకోపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలించి నంద్యాల నందమూరి నగర్ వద్ద ఉన్న కుందూ బ్రిడ్జ్ వద్ద మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడికి భార్య లక్ష్మిదేవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా కుందూనది వంతెనకు ఎలాంటి రక్షణ గోడలు లేకపోవడంతో తరచు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.

శుభకార్యానికి వచ్చి..అనంతలోకాలకు