మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండల పరిధిలోని మల్లూరు గుట్టపై గల హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయానికి ఆదివారం వేలాదిగా భక్తులు తరలిరావడంతో సందడి నెలకొంది. రాష్ట్రంలోని వివిధ సుదూర ప్రాంతాలతో పాటు పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సుమారు రెండు నుంచి మూడు వేల మంది వరకు భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆయా ప్రాంతాల నుంచి భక్తులు కార్లు, ఆటోలు, ప్రైవేట్ బస్సులు తదితర వాహనాల్లో ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్నారు. ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి హేమాచల కొండపై ఉన్న ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు రాజశేఖర్శర్మ కారంపుడి పవన్కుమార్ ఆచార్యులు, ఈశ్వర్చంద్ స్వామివారికి ఉదయం 10నుంచి 12గంటల వరకు నువ్వుల నూనెతో తిల తైలాభిషేకం పూజలు నిర్వహించి నూతన పట్టు వస్త్రాలతో అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని పులకించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు ఆలయ పూజారులు గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. కార్యక్రమంలో ఆలయ సీనియర్ అసిస్టెంట్ సీతారాములు, శేషు, అజయ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment