Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today

ప్రధాన వార్తలు

Supreme Court gives a big shock to Chandrababu Naidu government1
ఎడాపెడా అక్రమ అరెస్టులపై చెంపదెబ్బ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పౌరులు, మేధావులు, పాత్రికేయుల వాక్‌ స్వాతంత్య్ర హక్కును హరిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు గట్టి షాక్‌ ఇచ్చింది. వాక్‌ స్వాతంత్య్ర హక్కును కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని తేల్చిచెప్పింది. సీనియర్‌ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌ను తప్పుపట్టింది. లైవ్‌ షోలో ఓ ప్యానలిస్ట్‌ చేసిన వ్యాఖ్యలపై నవ్వినందుకు కొమ్మినేనిని అరెస్ట్‌ చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. ‘‘నవ్వడం నేరమా? దానికే అరెస్ట్‌ చేసేస్తారా?’’ అంటూ మండిపడింది. నవ్వడమే తప్పయితే, తాము కూడా ప్రతి రోజూ నవ్వుతూనే కేసులను విచారణ చేస్తుంటామంటూ గుర్తు చేసింది. లైవ్‌ షోలో ప్యానలిస్ట్‌ వ్యాఖ్యలకు కొమ్మినేని శ్రీనివాసరావు నవ్వారే తప్ప, ఆయన ఎలాంటి అనుచిత, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేసింది. ఓ జర్నలిస్టుగా లైవ్‌ న్యూస్‌ షోలో పాల్గొనే కొమ్మినేని హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని, తద్వారా ఆయన వాక్‌ స్వాతంత్య్ర హక్కును కూడా పరిరక్షించినట్లవుతుందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు ఈ నెల 8న నమోదు చేసిన కేసులో కొమ్మినేని శ్రీనివాసరావుకు బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. బెయిల్‌ మంజూరు సందర్భంగా షరతులు విధించాలని కింది కోర్టుకు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ మన్మోహన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.అరెస్ట్‌... రిమాండ్‌ను సవాల్‌ చేసిన కొమ్మినేనికొమ్మినేని శ్రీనివాసరావు నిర్వహించే కేఎస్సార్‌ లైవ్‌ షోలో పాల్గొన్న మరో సీనియర్‌ జర్నలిస్ట్‌ కృష్ణంరాజు అమరావతి రాజధాని గురించి పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో కృష్ణంరాజు, కొమ్మినేనిపై టీడీపీకి చెందిన కంభంపాటి శిరీష ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కొమ్మినేని, కృష్ణంరాజుపై ఐటీ చట్టంతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. తర్వాత పోలీసులు కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు. ఆయనను మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఈ నేపథ్యంలో కొమ్మినేని తన అరెస్ట్, రిమాండ్‌ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై శుక్రవారం జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. కొమ్మినేని తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ దవే, పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, అల్లంకి రమేశ్‌ వాదనలు వినిపించారు. » ఈ నెల 6న కొమ్మినేని లైవ్‌ షో నిర్వహించారని, అందులో ప్యానలిస్ట్‌గా పాల్గొన్న మరో సీనియర్‌ జర్నలిస్ట్‌ అమరావతి గురించి వ్యాఖ్యలు చేశారని సిద్ధార్థ దవే ధర్మాసనానికి వివరించారు. ఈ వ్యాఖ్యలతో కొమ్మినేనికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఆయన ఎవరి మనోభావాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదని నివేదించారు. ప్యానలిస్ట్‌ వ్యాఖ్యలకు.. కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వ్యక్తిని బాధ్యుడిగా చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు.మరొకరు చేసిన వ్యాఖ్యలకు యాంకర్‌ను ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించిన జస్టిస్‌ మన్మోహన్‌... అలా అదుపులోకి తీసుకునేందుకు చట్టం అనుమతిస్తుందా? అని ప్రశ్నించారు. ఏ నిబంధన మేరకు అరెస్టు చేశారో చెప్పాలని ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైన సీనియర్‌ న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, సిద్ధార్థ్‌ లూథ్రాలను ప్రశ్నించారు. చర్చలో ఆ వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు కొమ్మినేని నవ్వారని, ఈ విషయంలో ప్రేక్షక పాత్ర పోషించారని వివరించారు. ఆయన మాట్లాడేటప్పుడు అడ్డుకోకుండా నవ్వారని రోహత్గీ బదులిచ్చారు. ఈ వాదనపై ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. నవ్వడం నేరమా? నవ్వితే అరెస్ట్‌ చేస్తారా? అంటూ నిలదీసింది. ఎవరైనా నవ్వొచ్చేలా మాట్లాడితే ధర్మాసనంపై ఉన్న తాము కూడా నవ్వుతామన్న జస్టిస్‌ మన్మోహన్‌.. అంతమాత్రాన తప్పుడు కేసులు అంటగట్టేస్తారా? అని ప్రశ్నించారు. జస్టిస్‌ మిశ్రా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తూ... ప్రతి రోజూ ఇలా జరుగుతూనే ఉంటుందని అన్నారు. కొమ్మినేని చర్చలో ప్రేక్షకుడు కాదని రోహత్గీ చెప్పగా... ఆయన ఆ వ్యాఖ్యలు చేయలేదు కదా? అని జస్టిస్‌ మిశ్రా అసహనం వ్యక్తం చేశారు. పిటిషనర్‌ స్వయంగా ఎటువంటి పరువు నష్టం కలిగించే, అవమానకర వ్యాఖ్యలు చేయలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. లైవ్‌ షోలో ఆయన పాత్రికేయ భాగస్వామ్యం రక్షణకు అర్హమైనదని, ఇది వాక్‌ స్వాతంత్య్ర హక్కును కాపాడుతుందని తెలిపింది. కొమ్మినేని అరెస్ట్‌ ఎంతమాత్రం సహేతుకం కాదంటూ ఆయనను బెయిల్‌పై విడుదల చేయాలని ఆదేశించింది. ట్రయల్‌ కోర్టు విధించే నిబంధనలు, షరతులకు లోబడి ఈ నెల 8న నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ 108లో కొమ్మినేనిని బెయిల్‌పై విడుదల చేయాలని నిర్దేశించింది. తాను నిర్వహించే షోలో కొమ్మినేని ఎలాంటి పరువు నష్టం వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదని, ఇతరులను అలాంటి ప్రకటనలు చేయడానికి అనుమతించడం గానీ చేయొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Political Tension In tadipatri Police Block kethireddy pedda reddy2
తాడిపత్రిలో టెన్షన్‌.. పెద్దారెడ్డిని అడ్డుకున్న పోలీసులు

సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కూటమి సర్కార్‌ కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం తాడిపత్రి వెళ్లేందుకు బయలుదేరిన కేతిరెడ్ఢి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకోవడం చర్చకు దారి తీసింది. రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలులో భాగంగా పోలీసులు.. ఆయనతో అనుచితంగా ప్రవర్తించినట్టు సమాచారం. తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం ఉదయమే తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్ఢి పెద్దారెడ్డి బయలుదేరారు. వెంటనే ఆయన వద్దకు చేరుకున్న పోలీసులు.. శింగనమల నియోజకవర్గం యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో పెద్దారెడ్డిని అడ్డుకున్నారు. పోలీసులు వాహనాలు అడ్డుపెట్టి మరీ పెద్దారెడ్డిని అడ్డుకోవడం గమనార్హం. ఈ సందర్బంగా పోలీసులు తీరుపై కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ పోలీసులు.. ఎందుకు అడ్డుకుంటున్నారని.. ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు.ఇదిలా ఉండగా.. తాడిపత్రి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్సీ కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ, పోలీసులు మాత్రం హైకోర్టు ఆదేశాలను అమలు చేయడం లేదు. కేతిరెడ్డిని తాడిపత్రికి వెళ్లనివ్వడం లేదు. ఇ‍ప్పటి వరకు కేతిరెడ్డి.. తాడిపత్రికి వెళ్లకుండా పోలీసులు మూడు సార్లు అడ్డుకున్నారు. మరోవైపు.. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే దాడులు చేసేందుకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌ రెడ్డి అనుచరులు సిద్ధంగా ఉన్నారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే.. కచ్చితంగా దాడులు చేస్తామని గతంలోనే జేసీ ప్రభాకర్‌ రెడ్డి బహిరంగంగానే వార్నింగ్‌ ఇచ్చారు.

Telangana Police Case Filed Against KTR3
కేటీఆర్‌పై మరో కేసు నమోదు

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై అసభ్యంతర వ్యాఖ్యలు చేశారు. సోషల్‌ మీడియా కూడా పోస్టు పెట్టారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం, హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు కేటీఆర్‌పై ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి పట్ల కేటీఆర్‌ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని వెంకట్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.అలాగే, కేటీఆర్ వ్యాఖ్యలు సీఎం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉండడంతో పాటు, సామాజిక శాంతిని భంగపరిచే విధంగా ఉన్నాయని మండిపడ్డారు. ఇక, ఎమ్మెల్సీ వెంకట్‌ ఫిర్యాదుతో పోలీసులు.. కేటీఆర్‌పై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. దీంతో, సీసీఎస్‌ పోలీసులు.. కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.ఫార్ములా–ఈ కార్‌ రేస్‌ కేసులో నోటీసులు..ఇదిలా ఉండగా.. ఫార్ములా–ఈ కార్‌ రేస్‌ కేసు దర్యాప్తులో భాగంగా బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు అవినీతి నిరోధక శాఖ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని ఏసీబీ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని కేటీఆర్‌కు ఏసీబీ అధికారులు శుక్రవారం పంపిన నోటీసులో సూచించారు. ఈ కేసులో కేటీఆర్‌ ఏ–1గా ఉన్నారు. వాస్తవానికి మే 28నే తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ కేటీఆర్‌కు మే 26న ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు.అయితే విదేశీ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నందున తిరిగి వచ్చాక హాజరవుతానని కేటీఆర్‌ సమాధానం ఇచ్చారు. దీంతో ఈ నెల 16న విచారణకు హాజరుకావాలంటూ ఏసీబీ అధికారులు తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఫార్ములా–ఈ కార్‌ రేస్‌లో రూ.54.89 కోట్లు దుర్వినియోగం జరిగినట్టు ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఫార్ములా–ఈ కార్‌ రేస్‌ నిర్వహణకు సంబంధించి నిబంధనలు అతిక్రమించి విదేశీ కంపెనీకి డబ్బులు పంపారన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో ఇప్పటికే జనవరి 9న కేటీఆర్‌ స్టేట్‌మెంట్‌ను ఏసీబీ అధికారులు రికార్డు చేశారు.కేసులో ఏ–2గా ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అర్వింద్‌కుమార్, ఏ–3గా ఉన్న హెచ్‌ఎండీఏ బోర్డు మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌రెడ్డిని సైతం ఇప్పటికే ఏసీబీ అధికారులు విచారించారు. జనవరి 8న అర్వింద్‌కుమార్‌ను, జనవరి 9న కేటీఆర్, 10న బీఎల్‌ఎన్‌రెడ్డిని, అదే నెల 18న గ్రీన్‌కో ఏస్‌ నెక్సŠట్‌జెన్‌ ఎండీ చలమలశెట్టి అనిల్‌కుమార్‌ను ఏసీబీ అధికారులు విచారించారు. వీరందరి స్టేట్‌మెంట్ల ఆధారంగా ఫార్ములా–ఈ ఆపరేషన్స్‌ సంస్థ ప్రతినిధులు, సీఈవోను జూమ్‌ మీటింగ్‌ ద్వారా వర్చువల్‌గా విచారించారు. తాజాగా కేటీఆర్‌ను ఏసీబీ ప్రశ్నిస్తుండడంతో ఈ కేసు దర్యాప్తు తుది దశకు చేరినట్టుగా తెలుస్తోంది. ఏసీబీ నోటీసులు జారీ చేసిన విషయాన్ని కేటీఆర్‌ సైతం ధ్రువీకరించారు. కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడం కక్షసాధింపే: కవితఫార్ములా–ఈ రేసింగ్‌లో మరోసారి విచారణకు రావాలని కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే కాంగ్రెస్‌ ప్రభుత్వం మళ్లీ నోటీసులు జారీ చేసిందని ఎక్స్‌ వేదికగా ఆమె ఆరోపించారు.

Supreme Court orders immediate release of Kommineni Srinivasa Rao4
సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబుకు పెద్ద చెంపపెట్టు

సాక్షి, అమరావతి: ‘సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును వెంటనే విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెద్ద చెంపపెట్టు’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ అభివర్ణించారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ‘ఎక్స్‌’ వేదికగా శుక్రవారం ఆయన పోస్టు చేశారు. ‘నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు సుప్రీంకోర్టు గట్టిగా బుద్ధిచెప్పింది.కొమ్మినేని అరెస్టు ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛకు తీవ్ర భంగకరమని సుప్రీంకోర్టు చెప్పడం ముదావహం’ అని పేర్కొన్నారు. ఆ పోస్టులో వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. ‘అమరావతి నిర్మాణం పేరిట రూ.వేల కోట్ల అవినీతి నుంచి, తన పాలనా వైఫల్యాల నుంచి, క్షీణించిన లా అండ్‌ ఆర్డర్‌ పరిస్థితులపై తీవ్రంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించడానికి తన ఎల్లో ముఠాతో కలిసి చంద్రబాబు కృత్రిమ వివాదాన్ని సృష్టించారు.అబద్ధాలు, మోసాలతో కూడిన పాలన నుంచి మళ్లించడానికి, చేయని వ్యాఖ్యలను కొమ్మినేనికి ఆపాదించి, దానిచుట్టూ తన ఎల్లో గ్యాంగ్‌ ద్వారా పథకం ప్రకారం విష ప్రచారం చేయించారు. వాటిని పట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా రౌడీయిజం చేశారు. ఆస్తులను ధ్వంసం చేశారు. మహిళల నిరసన పేరుతో ఒక ముసుగు వేసుకుని ‘సాక్షి’ మీడియా యూనిట్‌ ఆఫీసుల మీద, కార్యాలయాల మీద అరాచకంగా దాడులు చేయించారు. మీడియా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాలరాశారు. చంద్రబాబు తన తప్పు తెలుసుకోకుండా ఇంకా ఆ వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీకి, ‘సాక్షి’ మీడియాకు ఆపాదిస్తూ జుగుప్సాకరంగా మాట్లాడడంతోనే ఆయన రాజకీయ లబ్ధి కోసం ఈ కుట్ర పన్నారని అర్థం అవుతోంది. విశ్లేషకుడి వ్యాఖ్యలతో యాంకర్‌గా వ్యవహరించిన కొమ్మినేనికి ఏం సంబంధం అంటూ ఇవాళ సుప్రీంకోర్టు ఇచి్చన ఆర్డర్‌ చంద్రబాబు కుట్రను బద్దలు చేసింది, ఎండగట్టింది. తద్వారా ఆంధ్రప్రదేశ్‌లో అక్రమ అరెస్టుల అంశం మరోసారి దేశం దృష్టికి వెళ్లింది. వక్రీకరణలు, అబద్ధాలు ఎల్లకాలం చెల్లుబాటుకావు. సత్యమేవ జయతే’ అని పేర్కొన్నారు. చంద్రబాబుకు ఇదొక హెచ్చరికకొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్‌ అక్రమం అంటూ సుప్రీంకోర్ట్‌ ఇచ్చిన ఉత్త­ర్వులు ప్రభుత్వానికి చెంపపెట్టు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు చంద్రబాబు ప్రభు­త్వం వేసిన సంకెళ్లను న్యాయ వ్యవస్థ బద్దలు కొట్టింది. కొమ్మినేని అరెస్ట్‌ అక్రమం అని దేశం మొత్తం తెలిసింది. సాక్షి కార్యాలయాలపై తన కార్య­కర్తలను, నాయకులను ఉసిగొల్పి దాడులు చేయించిన చంద్రబాబు అరాచకానికి తాజా తీర్పు ఒక హెచ్చరిక. చంద్రబాబు కుట్రపూరిత విధానాలను న్యాయస్థానం ఉత్తర్వులు ఎత్తిచూపాయి.– పూనూరు గౌతంరెడ్డి, వైఎస్సార్‌టీయూసీ అధ్యక్షుడుబాబు సిగ్గుతో తలదించుకోవాలికొమ్మినేని అరెస్ట్‌ అక్రమమని తన తీర్పుతో కూటమి ప్రభుత్వానికి సుప్రీం కోర్టు బుద్ధి చెప్పింది. చంద్రబాబు సర్కార్‌ పత్రికా స్వేచ్ఛను హరించే ప్రయత్నాలకు ఈ తీర్పు గట్టి హెచ్చరిక. ఇకనైనా చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలి. అక్రమ అరెస్టులను ఆపాలి. –పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీతల ఎక్కడ పెట్టుకుంటారు..కొమ్మినేని అరెస్ట్‌ అక్రమం అంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు చంద్రబాబుకు చెంపపెట్టు. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు చంద్రబాబు ప్రభుత్వం వేసిన సంకెళ్లను న్యాయ వ్యవస్థ బద్దలు కొట్టింది. ఇప్పుడు చంద్రబాబు తల ఎక్కడ పెట్టుకుంటారు. – కల్పలత, ఎమ్మెల్సీసుప్రీం తీర్పుతోనైనా బాబు కళ్లు తెరవాలికొమ్మినేనిది అక్రమ అరెస్ట్‌ అంటూ సుప్రీం ఇచ్చిన తీర్పుతో అయినా చంద్రబాబు కళ్లు తెరవాలి. చంద్రబాబు మెప్పు కోసం రెడ్‌బుక్‌ రాజ్యాంగం ప్రకారం పనిచేస్తున్న పోలీసులు పునరాలోచన చేయాలి. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరించే వారిని కోర్టుల్లో నిలబెడతాం. – తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్యేరాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బకొమ్మినేని అక్రమ అరెస్టుపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురురెబ్బ. కనీస నిబంధనలు పాటించకుండా అరెస్ట్‌ చేయడంపై సుప్రీం కోర్టు సీరియస్‌ అయింది. ఆయనను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం హర్షణీయం. – బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేక్షమాపణ చెప్పాలి సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు అక్రమంగా అరెస్టు చేసిన అంశంలో మంగళగిరి కోర్టు న్యాయమూర్తి, డీజీపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, తాజాగా సుప్రీంకోర్టు జర్నలిస్టుల భావప్రకటన స్వేచ్ఛను కాపాడుతూ వెంటనే విడుదల చేయాలని ఇచ్చిన తీర్పు కూటమి ప్రభుత్వానికి చెంపపెట్టు. తెనాలిలో దళిత, ముస్లిం యువకులపై థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడాన్ని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ తప్పు పట్టడం కూడా ప్రభుత్వ నేతలను తలదించుకునేలా చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌ అందరూ కొమ్మినేని అరెస్టుతో ఆగకుండా సాక్షి కార్యాలయాలపై దాడులకు ప్రేరేపించినందుకు తక్షణం ప్రజలకు క్షమాపణ చెప్పాలి. అలాగే కొమ్మినేని, కృష్ణంరాజులపై కేసులను ఉపసంహరించుకోవాలి. – ఈదర గోపీచంద్, సామాజిక విశ్లేషకులు

Rasi Phalalu: Daily Horoscope On 14-06-2025 In Telugu5
ఈ రాశి వారికి అందరిలోనూ గౌరవం పెరుగుతుంది.. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి: బ.తదియ ప.2.32 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: ఉత్తరాషాఢ రా.11.41 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: ఉ.7.09 నుండి 8.48 వరకు, తదుపరి రా.3.43 నుండి 5.20 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.02 నుండి 7.13 వరకు, అమృతఘడియలు: సా.4.54 నుండి 5.46 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.28, సూర్యాస్తమయం: 6.30. మేషం: శ్రమ ఫలిస్తుంది. సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి. దైవచింతన.వృషభం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబంలో వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. పనుల్లో ప్రతిబంధకాలు.మిథునం: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు.కర్కాటకం: అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం. కీలక నిర్ణయాలు.సింహం: పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. ప్రముఖుల నుంచి శుభవార్తలు. ఆస్తి లాభం. దైవదర్శనాలు. పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.కన్య: కొన్ని పనులు వాయిదా. శ్రమాధిక్యం. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. దూరపు బంధువుల కలయిక. స్థిరాస్తి వివాదాలు.తుల: వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఇంటాబయటా సమస్యలు. నిర్ణయాలు మార్చుకుంటారు. ఆలయ దర్శనాలు.వృశ్చికం: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. విందువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.ధనుస్సు: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. స్వల్ప అనారోగ్యం. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి.మకరం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆహ్వానాలు రాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.కుంభం: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. అనుకోని సంఘటనలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. పనులు ముందుకు సాగవు.మీనం: కొత్త పనులు చేపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

Air India crash probe focuses on engine, flaps6
ఇంజన్‌ వైఫల్యమే!

దేశాన్ని దిగ్భ్రాంతికి లోను చేసిన ఎయిరిండియా బోయింగ్‌ 787–8 డ్రీమ్‌లైనర్‌ (వీటీ–ఏఎన్‌బీ) 171 విమాన ప్రమాదానికి ఇంజన్‌ వైఫల్యమే కారణమై ఉంటుందని వైమానిక రంగ నిపుణులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే పెను ప్రమాదాన్ని సూచిస్తూ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కు పైలట్‌ చేసిన మేడే కాల్‌లోనూ, ప్రమాద వీడియోల్లోనూ విమానం ఇంజన్‌ శబ్దం అసలు విన్పించమే లేదు. దాన్నిబట్టి విమానం అప్పటికే పూర్తిగా థ్రస్ట్‌ (ఎగిరేందుకు అవసరమైన వేగం) పూర్తిగా కోల్పోయిందని విశ్లేషిస్తున్నారు. పక్షులు ఢీకొట్టడం వంటివి ఇందుకు కారణం కావచ్చంటున్నారు. అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో పక్షుల బెడద ఎక్కువే. అయితే బోయింగ్‌లో అత్యాధునికమైన ఈ శ్రేణి విమానాల్లో రెండు అత్యంత శక్తిమంతమైన ఇంజన్లుంటాయి. ఒకటి అనుకోకుండా ఫెయిలైనా రెండో ఇంజన్‌ సాయంతో విమానం సునాయాసంగా ఎగరగలదు. దాన్ని బట్టి రెండు ఇంజన్లూ విఫలమై ఉంటాయని అనుకోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కానీ 10 లక్షల ప్రయాణాలకు కేవలం ఒకసారి మాత్రమే అలా జరిగే ఆస్కారముంటుంది! ఇంధన కల్తీ, యాంత్రిక వైఫల్యం వల్ల కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తవచ్చు. కానీ బోయింగ్‌ 787లో వాడేది అత్యంత శక్తిమంతమైన జనరల్‌ మోటార్స్‌ కంపెనీ తాలూకు జీఈఎన్‌ఎక్స్‌ ఇంజన్లు. అవి అత్యంత విశ్వసనీయమైనవి. ఈ నేపథ్యంలో ప్రమాద కారణం పెద్ద పజిల్‌గా మారింది. బ్లాక్‌బాక్స్‌ డేటాను పూర్తిగా విశ్లేషించిన మీదటే దీనిపై స్పష్టత వస్తుందని నిపుణులు అంటున్నారు. వారి విశ్లేషణ ప్రకారం ప్రమాద కారణాలు ఏమై ఉండొచ్చంటే...టేకాఫ్‌ సెట్టింగుల్లో లోపంవిమానం టేకాఫ్‌ కాగానే లాండింగ్‌ గేర్‌ మూసుకోవాలి. సురక్షితమైన ఎత్తుకు చేరేదాకా రెండు ఫ్లాప్‌లూ (రెక్కల వెనక భాగం) విచ్చుకుని ఉండాలి. అప్పుడే విమానానికి ఎగిరేందుకు అవసరమైన శక్తి, ఊపు లభిస్తాయి. వీటన్నింటినీ టేకాఫ్‌ సెట్టింగులుగా పిలుస్తారు. ఇకగురువారం మధ్యాహ్నం ప్రమాద సమయంలో అహ్మదాబాద్‌లో ఏకంగా 43 డిగ్రీ సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదైంది. దాంతో వాయుసాంద్రత తక్కువగా ఉంది. అలాంటప్పుడు లాండింగ్‌ గేర్, ఫ్లాప్‌లు అత్యంత కచ్చితత్వంతో పని చేయడం చాలా కీలకం. కానీ ఏఐ171 విమానం గేర్‌ తెరుచుకునే ఉండగా ఫ్లాప్‌లు మూసుకుపోయాయి. ఇది పెను ప్రమాదానికి దారితీసే అసాధారణ పరిస్థితి. దీనివల్ల పైకెగిరేందుకు కావాల్సిన శక్తి సమకూరక విమానం అదుపు తప్పుతుంది. పైగా అవసరమైన థ్రస్ట్‌ లభించకుండానే పైలట్‌ టేకాఫ్‌కు ప్రయత్నించి ఉంటాడంటున్నారు. ఇలా ఫ్లాప్‌లు వెంటనే ముడుచుకుపోవడం వల్లే 2008లో స్పాన్‌ఎయిర్‌ విమానం కుప్పకూలింది.సరిపోని థ్రస్ట్‌ బోయింగ్‌ ఇంజన్లు శక్తిమంతమైనవే అయినా విమానం బరువు, రన్‌వే పొడవు, ఉష్ణోగ్రత తదితరాల ఆధారంగా టేకాఫ్‌కు నిర్దిష్ట థ్రస్ట్‌ సెటింగ్‌లు అవసరమవుతాయి. 43 డిగ్రీల ఎండ ఉన్నందున ఇంజన్‌ సామర్థ్యం సహజంగానే కాస్త తగ్గుతుంది. అలాంటప్పుడు టేకాఫ్‌కు మామూలు కంటే అధిక థ్రస్ట్‌ తప్పనిసరి. కానీ ఏఐ171 పైలట్‌ రొటేషన్‌ స్పీడ్‌ను పొరపాటుగా లెక్కించి తక్కువ థ్రస్ట్‌ ప్రయోగించి ఉండొచ్చు. 241 మంది ప్రయాణికులు, భారీ లగేజీ, ఏకంగా 1.25 లక్షల లీటర్ల ఇంధన బరువు దీనికి తోడై విమానం సజావుగా ఎగరలేకపోయి ఉంటుంది.లాండింగ్‌ గేర్‌ వైఫల్యంప్రమాద సమయంలో ఏఐ171 విమానం లాండింగ్‌ గేర్‌ తెరుచుకునే ఉంది. ఇది డ్రాగ్‌కు దారితీస్తుంది. దాంతో విమానం సజావుగా ఎగరలేదు. అందుకే టేకాఫ్‌ అయ్యాక క్షణాల్లోనే గేర్‌ మూసుకోవాల్సి ఉంటుంది. కానీ తొలుత దాదాపుగా మూసుకున్న ఏఐ171 లాండింగ్‌ గేర్‌ ఆ వెంటనే బయటికొస్తూ కన్పించింది. బహుశా విమానాన్ని పైకి తీసుకెళ్లేందుకు అవసరమైన థ్రస్ట్‌ లభించడం లేదని అర్థమై ఎమర్జెన్సీ లాండింగ్‌కు వీలుగా పైలట్‌ ఉద్దేశపూర్వకంగానే అలా చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. మొత్తం ఉదంతంలో ఏదో ఒక దశలో పైలట్‌ లోపం కచ్చితంగా ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి లోపాలను సునాయాసంగా అధిగమించే అత్యాధునిక సాంకేతికత 787 సొంతం. ఇక్కడే పైలట్‌ మానవ తప్పిదం చోటుచేసుకుని ఉంటుందంటున్నారు.విద్రోహ కోణంఉగ్రవాదులో, దేశ వ్యతిరేక శక్తులో ఉద్దేశపూర్వకంగానే విమానాన్ని కూల్చేయడం. కానీ ఇప్పటిదాకా అందుబాటులో ఉన్న సమాచారం,సాక్ష్యాలను బట్టి ఇందుకు అవకాశాలు తక్కువే.– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Bhumanakarunakara Reddy about YS Rajasekhara Reddy Padayatra7
నడచిన హిమాలయం... ఎగసిన ప్రజాకెరటం!

కళ్లు ఆకారాన్ని చూస్తాయి. మనస్సు ఆంతర్యాన్ని చూస్తుంది. దాని పరిధి చాలా విశాలం. మనసుతో మను షుల్ని, సమాజాన్ని చూడగలిగినవాడు, చదవగలిగినవాడు మహానాయకుడు. ఆ మహానాయకుడే మాజీ ముఖ్యమంత్రి డా‘‘ వై.ఎస్‌. రాజశేఖర రెడ్డి. నాకు అత్యంత సన్నిహితుడు, హితుడు, గురువు, మార్గదర్శి. అకుంఠిత దీక్ష, ప్రజల పట్ల అపారమైన ప్రేమ, మనిషి పట్ల మమ కారం, పేదరికాన్ని పారద్రోలాలన్న పట్టుదల, అణగారిన జనానికి అన్నీ సమకూర్చాలన్న కోరిక, సమసమాజ స్థాపన ఆయన లక్షణాలు, లక్ష్యాలు. శత్రువును కూడా క్షమించగలిగే సంస్కారం, పగవాడికైనా మేలు చేసే గుణం ఆయన సొంతం. హిమాలయ సమున్నతుడు కాబట్టే ప్రజలు ప్రేమగా ఆయ నను ‘రాజన్న’ అని పిలుచుకున్నారు. పాదయాత్ర:2003లో చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు ఆయన చేసిన 1,648 కిలోమీటర్ల పాదయాత్ర ఓ చరిత్ర. ఆయన వెంట నేను ఉండటం నా అదృష్టం. ఎంత జీవితాన్ని చూశానో, ఎన్ని నేర్చు కున్నానో అన్నిటికీ ‘సాక్షి’ ఆ పాదయాత్ర. 2003 ఏప్రిల్‌ 9న చేవెళ్లలో పెద్ద బహిరంగ సభతో ప్రారంభమైంది మహాయాత్ర. ఆ సభా వేదికకు పైన నీడగా షామియానా వేశారు. విపరీతంగా వచ్చిన జనం అందరూ ఎండలోనే ఉన్నారు. అది గమనించిన వైఎస్‌ ‘జనం ఎండలో ఉంటే నేను నీడలోఉండాలా’ అంటూ షామియానా తీయించారు. మండుటెండలోనే సాగింది ఆయన ప్రసంగం. అనంతరం తొలి అడుగు వేశారు ప్రజా ప్రస్థానానికి! కీపాస్‌ కట్టిన పంచ, తలపాగాలతో రైతులా కదిలారు. ఆయనను దగ్గరగా చూడా లని, కరచాలనం చేయాలని, కష్టాలు చెప్పుకోవాలని, గ్రామాలకు గ్రామాలు కదలి వచ్చాయి. చేవెళ్ల దాటి కౌకుంట్ల, మన్నెగూడ, శివారెడ్డిపేట... ఇలా అనేక గ్రామాల గుండా సాగుతోంది పాదయాత్ర. దారి పొడుగునా కనిపిస్తున్న ప్రజల ఆవేదనకు ఆయన చలించిపోతున్నారు. రాత్రి బస చేస్తున్న గ్రామాలలో కొందరు పెద్దలు ఆయన వద్దకు వచ్చి అక్కడ ఏసీ సౌకర్యం ఉన్న ఇల్లు ఉందని ఆహ్వానించినా, సున్నితంగా కాదని జనం మధ్య పడుకునేవారు వైఎస్‌. సదాశివ పేటకు చేరింది యాత్ర. అక్కడ ఎందరో కుండలు చేస్తున్నారు. వారిని చూపించాను ఆయనకు. ‘కరుణా! చూడాల్సింది వారు చేస్తున్న కుండల్ని కాదు, వారిగుండెల్ని’ అంటూ వారి దగ్గరికి వెళ్లారు. అంత దగ్గరగా ఆయనను చూసి చెమ్మగిల్లిన కళ్లతో వారు వారి బాధల్ని చెప్పుకున్నారు. ‘మంచిరోజులు వస్తున్నాయి’ అంటూ వారిని ఓదార్చారు. ప్రజలలో కనిపిస్తున్న పేదరికం, అనారోగ్యం, కరవు చూసి చలించిపోయిన ఆయనలో అప్పుడే ఉచితకరెంటు, ‘ఆరోగ్యశ్రీ’ లాంటి పథకాలు రూపుదిద్దుకున్నాయి. ఎనిమిదవ రోజు సుల్తానాపూర్‌లో యాత్ర సాగుతోంది.ఆ గ్రామంలో నర్సారెడ్డి అనే రైతు కుటుంబాన్ని అప్పు తీర్చ మని బ్యాంకు వారు దౌర్జన్యం చేస్తున్నారని గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. అప్పటికే నర్సారెడ్డి ఆత్మహత్య చేసు కున్నాడు. అయినా ఆ కుటుంబాన్ని బ్యాంకువాళ్లు వేధిస్తు న్నారు. అది విన్న వైఎస్‌ ముఖంలో బాధ, కోపం! వెంటనే బ్యాంకు వారిని పిలిపించి నిలదీశారు, హెచ్చరించారు.బ్యాంకువారు భయపడి వెనక్కి తగ్గారు, ఆ కుటుంబం రక్షింప బడింది.పొతంశెట్టి పల్లెలో యాత్ర సాగుతోంది. ఓ యువ జంట వైఎస్‌ ఎదురుగా వచ్చి కాళ్ళమీద పడింది. తాము ప్రేమి కులమని, కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని, చాలా దూరం నుంచి మిమ్మల్ని నమ్మి వచ్చామని వారు చెప్పుకొన్నారు. కొన్ని క్షణాలు ఆలోచించిన ఆయన అక్కడే అప్పుడే ఆ జంటకు వివాహం చేశారు, అక్షింతలు వేశారు. మరో నాయకుడైతే వారిని అక్కడే వదిలేసేవారు. కానీ వైఎస్‌ ముందుచూపుతో హైదరాబాదులోని ఓ పోలీసు ఉన్నతాధి కారికి ఫోన్‌ చేసి ఆ జంటకు రక్షణ కల్పించమని చెప్పారు. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర సాగే దారిలో నేను, మరికొందరు మిత్రులం వైఎస్‌ కన్నా కాస్త ముందుగా ఆ దారిలో వెళ్లేవాళ్ళం. వైఎస్‌ రాక గురించీ, పాదయాత్ర గురించీ ప్రజలు ఏమనుకుంటున్నారు అని తెలుసుకునేందుకు మా ప్రయత్నం. బురుగిద్ద గ్రామం దాటి, గాంధీనగర్‌ చేరుకున్నాం. అప్పటికి రాత్రి ఏడు గంటలు అయి ఉంటుంది. హఠాత్తుగా వడగళ్ళ వాన, విపరీతమైన చలి! వర్షంలో తడుస్తామని ప్రక్కనే వున్న జీపు ఎక్కి కూర్చున్నా. దాదాపు అరగంట పాటు వర్షం కురిసింది. మా వెనుక దాదాపు కిలోమీటరు దూరంలో ఉన్న వైఎస్‌ ఆ చలిలో, వర్షంలో అలాగే తడుస్తూ వచ్చారు. అందుకే ధీరుడు, నాయకుడు అయ్యారాయన. నాయకపురం దాటి, లక్ష్మీపురం గ్రామంలో ప్రవేశించాం. అక్కడ రెండు గ్రూపులు ఉన్నాయి. ఒకే పార్టీ, ఇద్దరు నాయకులు! ఎవరి ఏర్పాట్లు వాళ్లు చేస్తున్నారు. అది గమనించిన వైఎస్సార్‌ ఇద్దర్నీ పిలిచి అక్కడే రాజీ చేశారు. పాదయాత్ర గోదావరి జిల్లాలలోకి ప్రవేశించింది. అక్కడ కూడా రైతు బతుకు దీనంగా ఉండటం, గ్రాసం లేక పశువు లను రైతులు సగం ధరకు అమ్ముకోవడం చూసి వైఎస్‌ చలించి పోయారు. సీతంపేట గ్రామంలో నాగపద్మిని అనే మహిళ వైఎస్‌ దగ్గరికి వచ్చింది. కుటుంబ నియంత్రణకు ఆపరేషన్‌ చేయించున్నాననీ, అధికారులు ఆ సర్టిఫికెట్‌ ఇవ్వకుండా వేధిస్తున్నారనీ చెప్పింది. వెంటనే అధికారులను పిలిపించి అక్కడే సర్టిఫికెట్‌ ఇప్పించారు. ఆమె చేతిలో పదిహేను రోజుల పసికందు ఉంది. ఆ బిడ్డకు ‘రాజశేఖర్‌’ అని పేరు పెడతానంటే, ఆయన కాదని ‘రాజీవ్‌‘ అని నామకరణం చేశారు. రాజ మండ్రి సమీపం కోవూరుకు చేరుకున్నాం. జన ప్రవాహం మరింత ఎక్కువయింది. ఆయన ప్రసంగం ప్రారంభం నుంచి పూర్తయ్యేవరకు జనం చప్పట్లు ఆగలేదు. ఆ క్షణమే అర్థమ య్యింది రాష్ట్రానికి కాబోయే అధినాయకుడు ఎవరో!2003 మే 18:తెల్లారింది. కానీ నిప్పుల కొలిమిలో నిద్ర లేచినట్లు ఉంది. వైఎస్‌ నీరసంగా కనిపించారు. అయినా నడక సాగింది. కానీ నీరసం తెలుస్తోంది. ఓ చెట్టు క్రింద మంచం వేసి కాసేపు కూర్చోబెట్టాం. తరువాత మెల్లగా మధురపూడి గ్రామం చేరుకున్నాం. ఆయన పూర్తిగా నీరసించి పోయారు. వైద్యులు విశ్రాంతికి ఆదేశించారు. రాష్ట్రం అంతా కలకలం. ఆయన ఆరోగ్యం కోసం అన్ని మతాల వారి ప్రార్థనలు కొనసాగాయి. ఆరు రోజుల విరామం తరువాత మే 24న తిరిగి నడక ప్రారంభించారు వైఎస్‌. యాత్ర పత్తిపాడు గ్రామం దగ్గర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.జనప్రవాహం చెక్కు చెదరడం లేదు. జూన్‌ 11న జర్జంగి గ్రామం చేరుకున్నాం. అక్కడ రాళ్ళ క్వారీలలో వందలాది మంది వడ్డెరలు పని చేస్తున్నారు. వారంతా ఆయణ్ణి చూడటానికి వచ్చారు. తమ తలపాగాలను తీసి రోడ్డుమీద పరిచారు. దానిపై ఆయన్ని నడవమన్నారు. చూస్తున్న అందరి కళ్ళూ చెమరించాయి. శరీరాలు పులకరించాయి. అది కదా అభిమానం, అది కదా గౌరవం... అది కదా నిజమైన సన్మానం! జూన్‌ 15న ఇచ్ఛాపురం చేరుకున్నాం. ఆ సాయంత్రం బ్రహ్మాండమైన బహిరంగ సభ జరిగింది. పార్టీలోని అతిరథ మహారథులందరూ వేదికపైకి వచ్చారు. లక్షలాది మందిజనం. చప్పట్లకు దిక్కులు దద్దరిల్లాయి. ఆ మహా ప్రజా ప్రస్థానానికి చిహ్నంగా ఒక స్తూపాన్ని ఏర్పాటు చేశారు. మహా పాదయాత్ర పూర్తి అయింది. ఎన్నో అనుభవాలు, ఎన్నో జ్ఞాపకాలు! చాలు జీవితానికి ఈ అనుభూతి. గుర్తు చేసుకుంటే శరీరం పులకరిస్తోంది. ఆయన జ్ఞాపకంతో కళ్లు చెమరిస్తు న్నాయి. రైతు బాంధవుడైన ఆ మహానేత అడుగులో అడుగు వేసి నడచిన నా జన్మ ధన్యం. చరిత్ర ఏనాడూ మరచిపోలేని సత్యం ఈ మహాయాత్ర!-వ్యాసకర్త టీటీడీ మాజీ చైర్మన్‌-భూమనకరుణాకర రెడ్డి

South Africa showed complete dominance over Australia on the third day wtc final 8
విజయం దిశగా దక్షిణాఫ్రికా

ఐసీసీ టోర్నీల్లో తమ రాత మార్చుకునేందుకు దక్షిణాఫ్రికా సిద్ధమైంది. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో మూడో రోజు అసాధారణ ఆటతో టైటిల్‌కు చేరువైంది. 282 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఎక్కడా తడబడని సఫారీ టీమ్‌ గెలుపుపై గురి పెట్టింది. పేలవ ప్రదర్శనతో ఆసీస్‌ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేయగా... మార్క్‌రమ్‌ సెంచరీతో చెలరేగాడు. మరోవైపు కండరాల నొప్పితో బాధపడుతూ కూడా బ్యాటింగ్‌ కొనసాగించిన కెపె్టన్‌ తెంబా బవుమా అండగా నిలిచాడు. చేతిలో 8 వికెట్లతో శనివారం మరో 69 పరుగులు సాధిస్తే 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ దక్షిణాఫ్రికా ఖాతాలో చేరుతుంది. లండన్‌: వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ)లో విజేతగా నిలిచే దిశగా దక్షిణాఫ్రికా అడుగులు వేస్తోంది. లార్డ్స్‌ మైదానంలో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో సఫారీ టీమ్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆ్రస్టేలియాపై మూడో రోజు సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 282 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి 56 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 213 పరుగులు సాధించింది. మార్క్‌రమ్‌ (159 బంతుల్లో 102 బ్యాటింగ్‌; 11 ఫోర్లు) శతకం బాదగా... కెప్టెన్‌ తెంబా బవుమా (121 బంతుల్లో 65 బ్యాటింగ్‌; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు ఇప్పటికే అభేద్యంగా 143 పరుగులు జోడించారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 144/8తో ఆట కొనసాగించిన ఆ్రస్టేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 207 పరుగులకు ఆలౌటైంది. స్టార్క్‌ (136 బంతుల్లో 58 నాటౌట్‌; 5 ఫోర్లు) హాఫ్‌ సెంచరీ సాధించాడు. చివరి వికెట్‌కు 59 పరుగులు... మూడో రోజు ఆట ఆరంభంలోనే లయన్‌ (2)ను రబాడ అవుట్‌ చేయడంతో ఆసీస్‌ 9వ వికెట్‌ కోల్పోయింది. ఇన్నింగ్స్‌ ముగిసేందుకు ఎంతో సమయం పట్టదనిపించింది. అయితే స్టార్క్‌ పట్టుదలగా పోరాడాడు. అతనికి హాజల్‌వుడ్‌ (53 బంతుల్లో 17; 2 ఫోర్లు) అండగా నిలవడంతో ఆలౌట్‌ చేసేందుకు సఫారీ బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కొన్ని చక్కటి షాట్లు ఆడిన స్టార్క్‌ 131 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో ఆసీస్‌ స్కోరు కూడా 200 దాటింది. ఎట్టకేలకు మార్క్‌రమ్‌ బౌలింగ్‌లో హాజల్‌వుడ్‌ వెనుదిరగడంతో దక్షిణాఫ్రికా ఊపిరి పీల్చుకుంది. స్టార్క్, హాజల్‌వుడ్‌ 22.3 ఓవర్ల పాటు ఆడి చివరి వికెట్‌కు 59 పరుగులు జోడించడం విశేషం. శతక భాగస్వామ్యం... తొలి ఇన్నింగ్స్‌కు భిన్నంగా దక్షిణాఫ్రికా ఆరంభం నుంచే ధాటిగా ఆడింది. 10 ఓవర్లలోనే 47 పరుగులు చేసిన జట్టు రికెల్టన్‌ (6) కోల్పోయింది. మార్క్‌రమ్, ముల్డర్‌ (27; 5 ఫోర్లు) ఓవర్‌కు 4 పరుగుల రన్‌రేట్‌తో ధాటిని కొనసాగించారు. లబుషేన్‌ చక్కటి క్యాచ్‌తో ముల్డర్‌ వెనుదిరగడంతో ఈ భాగస్వామ్యం ముగిసింది. అయితే ఆ్రస్టేలియా ఆనందం ఇక్కడికే పరిమితమైంది. మార్క్‌రమ్, బవుమా కలిసి సమర్థంగా ఇన్నింగ్స్‌ను నడిపించారు.ఈ క్రమంలో 69 బంతుల్లోనే మార్క్‌రమ్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తీవ్రంగా ఎండ కాయడంతో పిచ్‌ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిపోయింది. దాంతో ఆసీస్‌ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. కొద్ది సేపటికి బవుమా 83 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆట ముగియడానికి కొద్దిసేపు ముందు మార్క్‌రమ్‌ 156 బంతుల్లో సెంచరీతో సగర్వంగా నిలిచాడు. బవుమా క్యాచ్‌ పట్టి ఉంటే... భారీ భాగస్వామ్యానికి ముందు ఒకే ఒక్క సారి ఆసీస్‌కు మరింత పట్టు బిగించే అవకాశం వచ్చింది. 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బవుమాకు లైఫ్‌ లభించింది. స్టార్క్‌ ఓవర్లో బవుమా ఆడిన షాట్‌కు బంతి మొదటి స్లిప్‌లోకి దూసుకెళ్ళగా క్యాచ్‌ అందుకోవడంలో స్మిత్‌ విఫలమయ్యాడు. అయితే నిజానికి అది అంత సులువైన క్యాచ్‌ కాదు. ఈ టెస్టులో చాలా బంతులు బ్యాట్‌కు తగిలాక స్లిప్‌ కార్డాన్‌కు కాస్త ముందే పడుతుండటంతో స్మిత్‌ సాహసం చేస్తూ సాధారణంగా నిలబడే చోటుకంటే కాస్త ముందు వచ్చి నిలబడ్డాడు. ముందు జాగ్రత్తగా హెల్మెట్‌ కూడా పెట్టుకున్నాడు. ఊహించినట్లుగానే బంతి చాలా వేగంగా దూసుకొచి్చంది. మరీ దగ్గర కావడం వల్ల స్పందించే సమయం కూడా లేకపోయింది. దాంతో స్మిత్‌ కుడి చేతి వేలికి బంతి బలంగా తగిలి కింద పడిపోయింది. నొప్పితో విలవిల్లాడిన అతను వెంటనే మైదానం వీడాడు. అనంతరం స్కానింగ్‌లో వేలు విరిగినట్లు తేలింది! స్కోరు వివరాలు: ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌: 212; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌: 138; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్‌: 207; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌: మార్క్‌రమ్‌ (బ్యాటింగ్‌) 102; రికెల్టన్‌ (సి) కేరీ (బి) స్టార్క్‌ 6; ముల్డర్‌ (సి) లబుషేన్‌ (బి) స్టార్క్‌ 27; బవుమా (బ్యాటింగ్‌) 65; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (56 ఓవర్లలో 2 వికెట్లకు) 213. వికెట్ల పతనం: 1–9, 2–70. బౌలింగ్‌: స్టార్క్‌ 9–0–53–2, హాజల్‌వుడ్‌ 13–0–43–0, కమిన్స్‌ 10–0–36–0, లయన్‌ 18–3–51–0, వెబ్‌స్టర్‌ 4–0–11–0, హెడ్‌ 2–0–8–0.

India influencer marketing industry to grow by 25percent in 20259
ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్‌ రంగం @ రూ. 3,600 కోట్లు

న్యూఢిల్లీ: దేశీయంగా ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్‌ పరిశ్రమ 2024లో రూ. 3,600 కోట్ల స్థాయికి చేరింది. 2025లో ఇది మరో 25 శాతం వృద్ధి చెందనుంది. ది గోట్‌ ఏజెన్సీ, డబ్ల్యూపీపీ మీడియా, కాంటార్‌ కలిసి రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్‌ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్‌ తీరుతెన్నులు, వినియోగదారుల ధోరణులను మార్చేందుకు .. బ్రాండ్‌పై విశ్వసనీయతను పెంచుకునేందుకు కంపెనీలు ఏ విధంగా తమ మార్కెటింగ్‌ వ్యూహాల్లో ఇన్‌ఫ్లుయెన్సర్లను భాగం చేసుకుంటున్నాయి లాంటి అంశాలను ఇది వివరించింది. దీని ప్రకారం ఈ పరిశ్రమలో ప్రధానంగా ఫాలోయర్ల సంఖ్యపైనే దృష్టి పెట్టే ధోరణిలో మార్పులు వస్తున్నాయి. బ్రాండ్లు ఎక్కువగా కంటెంట్‌ నాణ్యత, క్రియేటర్ల ఔచిత్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా తయారీ రంగంలో ఇలాంటి ట్రెండ్‌ కనిపిస్తోంది. ఈ విభాగంలో 85 శాతం బ్రాండ్లు ఇన్‌ఫ్లుయెన్సర్ల ఎంపికలో కంటెంట్‌ నాణ్యత ప్రాథమిక ప్రాతిపదికగా ఉంటున్నట్లు వివరించాయి. దీర్ఘకాలిక భాగస్వామ్యానికి మొగ్గు.. నివేదిక ప్రకారం ఇన్‌ఫ్లుయెన్సర్లతో దీర్ఘకాలిక భాగస్వామ్యాలను కుదుర్చుకునేందుకు బ్రాండ్లు మొగ్గు చూపుతున్నాయి. 72 శాతం బ్రాండ్లు ఇలాంటి భాగస్వామ్యాలను ఎంచుకున్నాయి. కంటెంట్‌ నియంత్రణ, బ్రాండ్‌ భద్రత రీత్యా 95 శాతం బ్రాండ్లు పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్లను ఎంచుకుంటున్నాయి. అయితే, విశిష్టమైన రంగాల్లో ప్రత్యేక నైపుణ్యాలున్న ఇన్‌ఫ్లుయెన్సర్లకు ఆటోమోటివ్, కన్జూమర్‌ డ్యూరబుల్స్‌లాంటి విభాగాల్లో డిమాండ్‌ ఉంటోంది. సవాళ్లు ఉన్నాయి... → సానుకూలాంశాలు అనేకం ఉన్నప్పటికీ ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెటింగ్‌లో సవాళ్లు కూడా ఉంటున్నాయి. సరైన ఇన్‌ఫ్లుయెన్సర్లను దొరకపుచ్చుకోవడం ప్రధాన సవాలుగా ఉంటోంది. 83 శాతం మార్కెటర్లు, బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాలు) సెక్టార్లో 95 శాతం సంస్థలు సరైన టాలెంట్‌ను దొరకపుచ్చుకోవడంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు వివరించాయి. పెట్టుబడులపై రాబడులను (ఆర్‌వోఐ) లెక్కించేందుకు మార్కెటర్లు ఎక్కువగా ఎంగేజ్‌మెంట్‌ రేట్‌ (39 శాతం), కంటెంట్‌ నాణ్యత (36 శాతం)కు ప్రాధాన్యత ఇస్తున్నారు. → వినియోగదారుల కోణం నుంచి చూస్తే కొనుగోలు ప్రస్థానంలో ఇన్‌ఫ్లుయెన్సర్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్లను ప్రోడక్ట్‌ డిస్కవరీ కోసం (63 శాతం మంది), సమాచార సేకరణ కోసం (69 శాతం మంది) ఫాలో చేస్తున్నట్లు భారతీయ వినియోగదారులు తెలిపారు. → ఇన్‌ఫ్లుయెన్సర్లతో చేతులు కలపడంలో విశ్వసనీయతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు 70 శాతం బ్రాండ్లు తెలిపాయి. బీఎఫ్‌ఎస్‌ఐలో ఇది 77 శాతంగా ఎఫ్‌ఎంసీజీలో ఇది 76 శాతంగా ఉంది. → నేటి వినియోగదారులు కేవలం ప్రోడక్టుల కొనుగోలుకే కాకుండా, స్టోరీలు, కమ్యూనిటీలు, తాము విశ్వసించే క్రియేటర్లు చెప్పే విషయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. భవిష్యత్తులో ఇన్‌ఫ్లుయెన్సర్లను వ్యూహాత్మక భాగస్వాములుగా వ్యవహరించే బ్రాండ్లే రాణిస్తాయి. నియంత్రణలు, కంటెంట్‌పై ఫోకస్‌ పెరుగుతున్న పరిస్థితుల్లో బ్రాండ్లు, క్రియేటర్లు అర్థవంతమైన, దీర్ఘకాలం నిలబడే భాగస్వామ్యాలను ఏర్పర్చుకోవడం కీలకంగా నిలుస్తుంది.

Chandrababu Naidu has reneged on 143 promises including Super Six10
బాబు తొలి ఏడాది మోసాల ఖరీదు రూ.81,398 కోట్లు

చెరువు గట్టున మర్రి చెట్టు కింద వేటాడే సత్తువ లేని ఓ ముసలి పులి కూర్చొని ఉండేది. చేతితో బంగారు కడియం పట్టుకుని.. అటుగా వెళ్తున్న బాటసారులను బంగారు కడియం ఇస్తా నా వద్దకు రా అంటూ పిలుస్తూ ఉండేది. ఒక రోజున చెరువు గట్టుపై నుంచి వెళ్తున్న బాటసారిని ముసలి పులి నా వద్దకు రా అంటూ పిలిచింది. బాటసారి భయపడి పారిపోతుంటే.. ‘భయపడకు.. నా చేతిలో బంగారు కడియం చూశావా.. నీలాంటి పుణ్యాత్మునికి ఈ బంగారు కడియం ఇస్తే నాకు స్వర్గ లోక ప్రాప్తి కలుగుతుంది’ అంటూ ఆశ పెట్టింది. ‘నువ్వేమో క్రూర జంతువు.. నిన్నెలా నమ్మేది?’ అంటూ ఆ బాటసారి అనుమానం వ్యక్తం చేస్తే.. ఆ ముసలి పులి పక్కనే ఉన్న నక్క జోక్యం చేసుకుంటూ ‘పండు ముసలి పులి పరుగెత్తలేదు.. పళ్లూడిపోయాయి.. మాంసం తినడం ఎప్పుడో మానేసింది.. చెరువులో శుభ్రంగా స్నానం చేసి రా.. బంగారు కడియం తీసుకో’ అంటూ ఊరించింది.బంగారు కడియంపై ఆశపడ్డ బాటసారి.. నక్క చెప్పినట్టే చెరువులో స్నానం చేసి, మర్రి చెట్టు కింద కూర్చున్న ముసలి పులి వద్దకు వెళ్లాడు.. ముసలి పులి ఒక్కసారిగా బాటసారిపై పడి చంపేసి కడుపు నిండా తినేసింది.. మిగిలిపోయిన బాటసారి మాంసాన్ని నక్క తినేసింది. ఇదీ పంచతంత్రం నీతి కథ. ఈ కథ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితికి అద్దం పడుతోంది.ఎన్నికల్లో సూపర్‌ సిక్స్‌ సహా 143 హామీలను టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చారు. ఆ హామీల అమలు పూచీపత్రం ఇదిగో అంటూ ‘బాబు ష్యూరిటీృభవిష్యత్తుకు గ్యారంటీ’ పేరుతో ఏటా పథకాల ద్వారా ఆ కుటుంబానికి ఒనగూరే లబ్ధిని వివరిస్తూ ఇంటింటా బాండ్లను పంపిణీ చేశారు. గత చరిత్రను చూసి చంద్రబాబును ప్రజలు నమ్మరేమో అనే భయంతో.. ఆ హామీల అమలు పూచీ నాదీ అంటూ జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ భరోసా ఇచ్చారు.వైఎస్‌ జగన్‌ పథకాలను కొనసాగించడంతోపాటు రెండింతలు సంక్షేమం అధికంగా ఇస్తామంటూ చంద్రబాబు, పవన్‌ నమ్మబలికారు. ఆ మేరకు ఎల్లో మీడియా కూడా ఊదరగొట్టింది. ఆ హామీలతో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. అయితే తొలి ఏడాది సూపర్‌ సిక్స్‌లో ఒక్కటంటే ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. మిగతా హామీలకు దిక్కే లేదు. ఆ హామీలన్నీ మోసాలుగా మిగిలాయి. సూపర్‌ సిక్స్, ఇతర పథకాల ద్వారా తొలి ఏడాది లబ్ధిని ప్రజలకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఈ లెక్కన చంద్రబాబు మొదటి ఏడాది మోసాల ఖరీదు రూ.81,397.83 కోట్లు.సాక్షి, అమరావతి : సార్వత్రిక ఎన్నికల్లో సూపర్‌ సిక్స్‌ సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి.. ఓట్లేయించుకుని విజయం సాధించిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. అయితే ఏరు దాటే వరకు ఓడ మల్లన్న, ఏరు దాటాక బోడి మల్లన్న.. అనే సామెతను అవపోసన పట్టిన సీఎం చంద్రబాబు, అధికారం చేపట్టిన వెంటనే తన నైజాన్ని చాటిచెప్పారు. సూపర్‌ సిక్స్‌ సహా సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఎవరైనా ప్రశ్నిస్తే.. సంపద సృష్టించే రహస్యం చెవిలో చెప్పండి.. సంపద సృష్టించాక సంక్షేమం ఇస్తా.. అంటూ ఎదురు దాడికి దిగుతూ వచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఏడాదిలోనే రూ.1,58,604 కోట్లు అప్పు చేసి రికార్డు సృష్టించారు. అయినా సరే ఒక్కటంటే ఒక్క పథకాన్ని అమలు చేయకపోవడం గమనార్హం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డ నిధి, దీపం, ఉచిత బస్సు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్, నిరుద్యోగ భృతి, మత్స్యకార భరోసా, ఉచిత పంటల బీమా పథకాల కిందే రూ.81,397.83 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. తద్వారా చంద్రబాబును నమ్మి ఓటేయడమంటే చంద్రముఖిని మళ్లీ నిద్రలేపడమేనని ఎన్నికల ప్రచారంలో ఓటర్లను అప్రమత్తం చేస్తూ నాటి సీఎం వైఎస్‌ జగన్‌ చెప్పిన మాటలు అక్షర సత్యమని నిరూపితమైందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.అది మేనిఫెస్టో.. ఇది మాయఫెస్టో రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో నాలుగే నాలుగు పేజీలతో కూడిన మేనిఫెస్టోను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ విడుదల చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించారు. తొలి ఏడాదే 95 శాతం హామీలు అమలు చేశారు. సంక్షేమ పథకాల ద్వారా తొలి ఏడాదే 3.58 కోట్ల మంది లబ్ధిదారులకు రూ.40,627 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. ఐదేళ్ల పాలనలో రూ.2,73,756.17 కోట్లను డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో పేదల ఖాతాల్లో జమ చేశారు. నాన్‌ డీబీటీ రూపంలో మరో రూ.1,84,604.32 కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. డీబీటీ, నాన్‌ డీబీటీ పథకాలు కలిపితే ఐదేళ్లలో పేదలకు మొత్తం రూ.4,58,360.49 కోట్ల ప్రయోజనం కలిగించారు. మేనిఫెస్టో అమలు అంటే ఇదీ అని నిరూపించారు. కానీ.. సూపర్‌ సిక్స్‌ సహా 143 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తొలి ఏడాది సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేయకుండా మేనిఫెస్టోను మాయఫెస్టోగా మార్చారు. వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తామంటూ నమ్మబలికి, అంతకంటే రెండింతలు సంక్షేమం ఇస్తామని నమ్మించి ప్రజలను నట్టేట ముంచారు.మోసాలుగా మిగిలిన హామీలు » సూపర్‌ సిక్స్‌ పథకాల్లో ఆడబిడ్డ నిధి పథకం ఒకటి. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారు 1.80 కోట్ల మంది. వీరికి నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలను ఆడబిడ్డ నిధి కింద ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. మొదటి ఏడాది ఒక్క పైసా ఇవ్వలేదు. అంటే.. ఆడబిడ్డ నిధి కింద మహిళలకు రూ.32,400 కోట్లు ఎగ్గొట్టారు. » దీపం పథకం కింద రాష్ట్రంలో 1,59,20,000 గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సిలిండర్‌ ధర రూ.855. ఈ లెక్కన ఏడాదికి మూడు సిలిండర్లు ఇవ్వాలంటే.. రూ.4,083.48 కోట్లు అవసరం. కానీ.. తొలి ఏడాది ఒక సిలిండర్‌కు మాత్రమే రూ.865 కోట్లు మాత్రమే ఇచ్చారు. అంటే.. రూ.3,218.48 కోట్లు ఎగ్గొట్టారు.» మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీని అమలు చేయాలంటే నెలకు రూ.275 కోట్ల చొప్పున ఆర్టీసీకి ఇవ్వాలి. కానీ.. తొలి ఏడాది ఈ హామీని అమలు చేయలేదు. అంటే.. ఉచిత బస్సు రూపంలో మహిళలకు రూ.3,500 కోట్లు ఎగ్గొట్టారు. ఉచిత బస్సు సౌకర్యం అమలై ఉండింటే అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు మహిళలంతా అమరావతికి వెళ్లి చూసొచ్చే వారు. కడప, తిరుపతి, కర్నూలు తదితర ప్రాంతాల వాళ్లంతా విశాఖ నగరానికి వెళ్లొచ్చేవారు. వారి ఆశలు ఇప్పటి దాకా నెరవేర లేదు. » 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు పెన్షన్‌ ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు 20 లక్షల మంది ఉన్నారు. వారికి నెలకు రూ.4 వేల చొప్పున ఏడాదికి రూ.9,600 కోట్లు పెన్షన్‌ రూపంలో ఇవ్వాలి. కానీ.. తొలి ఏడాది పెన్షన్‌ ఇవ్వకుండా రూ.9,600 కోట్లు ఎగ్గొట్టారు.» తల్లికి వందనం పథకం కింద ఎంత మంది పిల్లలను బడికి పంపిస్తే అంత మంది పిల్లలకు రూ.15 వేల వంతున తల్లి ఖాతాలో జమ చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. యూడీఐఎస్‌ఈ (యునిఫైడ్‌ డిస్ట్రిక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఫర్‌ ఎడ్యుకేషన్‌–యూడైస్‌) గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతున్నారు. రూ.15 వేల వంతున వారికి ఏడాదికి రూ.13,112.82 కోట్లు ఇవ్వాలి. కానీ.. తొలి ఏడాది ఆ మేరకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు.» 20 లక్షల మందికి ఉద్యోగాలు.. లేదా ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. తొలి ఏడాది నిరుద్యోగ భృతి జాడే లేదు. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. వారికి నెలకు రూ.3 వేల చొప్పున ఏడాదికి రూ.7,200 కోట్లు ఎగ్గొట్టారు.» ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ పథకంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ.20 వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వారికి రూ.20 వేల చొప్పున ఇవ్వాలంటే ఏటా రూ.10,716.53 కోట్లు అవసరం. కానీ.. తొలి ఏడాది వాటిని ఇవ్వకుండా ఎగ్గొట్టారు.» వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న ఉచిత పంటల బీమా పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ.. 2023–24లో పంటలు సాగు చేసిన రైతులకు బీమా ప్రీమియం చెల్లించకుండా ఎగ్గొట్టారు. దాంతో రైతులకు బీమా పరిహారం రూ.1,385 కోట్లు రాలేదు.» మత్స్యకారులకు వేట నిషేధ భృతి కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ.. మొదటి ఏడాది మత్స్యకారులకు వేట నిషేధ భృతి ఇవ్వకుండా రూ.265 కోట్లు ఎగ్గొట్టారు.సూపర్‌ సిక్స్‌ ఇచ్చేశా అంటూ హూంకరింపు కూటమి సర్కార్‌ రెండో ఏడాదిలోకి అడుగు పెట్టాక తల్లికి వందనం పథకం కింద 87,41,885 మందికి రూ.15 వేల వంతున ఇవ్వాల్సి ఉండగా 54,94,703 మందికి మాత్రమే రూ.13 వేల చొప్పున జమ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అంటే 32,47,182 మందికి ఎగనామం పెట్టి తల్లికి వందనం పథకాన్ని మహా మోసంగా మార్చారు. ఈ పథకంపై మీడియాతో మాట్లాడుతూ పీృ4కు ఆడబిడ్డ నిధి, స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు నిరుద్యోగ భృతి అనుసంధానం చేశానని.. 20న అన్నదాత సుఖీభవ, ఆగస్టు 15న ఉచిత బస్సు పథకాలను అమలు చేస్తానని చెప్పుకొచ్చారు. మొత్తంగా సూపర్‌ సిక్స్‌ అమలు చేసేశానని, ఇంకెవరైనా దీని గురించి మాట్లాడితే నాలుక మందం తప్ప మరోటి కాదంటూ హూంకరించారు. 32,400 కోట్లు18 నుంచి 59 ఏళ్లలోపు మహిళలకు ఏటా రూ. 18 వేల చొప్పున‌ ఎగ్గొట్టిన ఆడబిడ్డ నిధి ల‌బ్ధిదారులు 1.80కోట్లు3,218.48 కోట్లుదీపం2 పథకం కింద మహిళలకు టోకరాల‌బ్ధిదారులు 1.59 కోట్లు13,112.82 కోట్లుతల్లికి వందనం పథకం కింద మహిళలకు రూ. 15 వేల చొప్పున‌ టోపీల‌బ్ధిదారులు 87,41,8851,385 కోట్లుపంటల బీమా పరిహారం చెల్లించకుండా రైతులకు కలిగించిన నష్టం ల‌బ్ధిదారులు53 ల‌క్ష‌లు9,600 కోట్లు50 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు నెల‌కు రూ. 4 వేలు చొప్పున‌ ఇవ్వని పింఛన్‌ సొమ్ము ల‌బ్ధిదారులు 20 ల‌క్ష‌లు10,716.53 కోట్లుఅన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు రూ. 20 వేల చొప్పున‌ అన్యాయం ల‌బ్ధిదారులు 53,58,266265 కోట్లుమత్స్యకారులకు వేట నిషేధ భృతి కింద రూ. 24 వేల చొప్పున‌ తొలి ఏడాది ఎగవేసిన మొత్తం 7,200 కోట్లునిరుద్యోగ భృతి కింద యువతకు రూ. 36 వేల చొప్పున‌ దగాల‌బ్ధిదారులు 20 ల‌క్ష‌లు3,500 కోట్లుఉచిత బస్సు కింద మహిళలకు మోసం ల‌బ్ధిదారులు 2.7 కోట్లు

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement