Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today
Sakshi News home page
breaking news

ప్రధాన వార్తలు

Tdp Conspiracies Against Ys Jagan Nellore Visit1
వైఎస్‌ జగన్‌ నెల్లూరు పర్యటనపై టీడీపీ కుట్రలు

సాక్షి, నెల్లూరు జిల్లా: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటనపై టీడీపీ కుట్రలకు తెరలేపింది. జులై 3న వైఎస్‌ జగన్ పర్యటనకు అడ్డంకులు సృష్టిస్తోంది. హెలిప్యాడ్‌కి అనుమతి ఇవ్వకుండా అడ్డంకులు కలిగిస్తోంది. వైఎస్‌ జగన్ ప్రజాదరణ చూసి టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు. 27న వైఎస్ జగన్ పర్యటన కోసం వైఎస్సార్‌సీపీ నేతలు దరఖాస్తు చేశారు.ఇప్పటికి అనుమతి ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారు. కేవలం 100 మందే రావాలంటూ పార్టీ నేతలకు పోలీసులు ఆంక్షలు విధించారు. హెలిప్యాడ్ స్థలం యజమానికి అధికారులు, పోలీసులు ద్వారా బెదిరింపులకు దిగుతున్నారు. వైఎస్‌ జగన్‌ ఏ జిల్లాకు వెళ్లిన పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. దీంతో ఆయన పర్యటనపై టీడీపీ నేతలు ఉలిక్కిపడుతున్నారు. అక్కసుతో హెలిప్యాడ్‌ రద్దు చేయించేలా టీడీపీ నేతలు కుట్రలు పన్నుతూ.. అడుగడుగునా అడ్డంకులు పెడుతున్నారు.ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్‌ రావడం తథ్యం: అనిల్‌వైఎస్‌ జగన్‌ పర్యటనపై 10 రోజుల క్రితమే సమాచారం ఇచ్చామని.. పర్మిషన్‌ ఇవ్వకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా జగన్‌ రావడం తథ్యమన్నారు.

Major explosion in pharma industry 16 people lost breath2
బతుకులు బుగ్గి

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/పటాన్‌చెరు టౌన్‌/పటాన్‌చెరు/రామచంద్రాపురం/జిన్నారం/చందానగర్‌: ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరున్న పాశమైలారంలోని సిగాచి అనే ఫార్మాస్యూటికల్‌ పరిశ్రమలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. కంపెనీలోని రియాక్టర్‌ పేలిపోగా దాని తీవ్రతకు మూడంతస్తుల భవనాలు రెండు కుప్పకూలిపోయాయి. పరిశ్రమ పైకప్పు, రేకులు, ఇతర యంత్ర భాగాలు ఎగిరి వంద మీటర్ల దూరంలో పడ్డాయి. యంత్రాల భాగాలు చెల్లాచెదురయ్యాయి. భారీగా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. ఆ ప్రదేశమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఆ సమయంలో అక్కడ పని చేస్తున్న 100 మందికి పైగా కార్మికులు, ఉద్యోగులు పేలుడు ధాటికి చెల్లాచెదురుగా పడిపోయారు. శరీరాలు ఛిద్రమైపోయాయి. 10 మంది అక్కడికక్కడే సజీవ దహనం కాగా ఇద్దరు ఆస్పత్రుల్లో మృతి చెందినట్లు తెలుస్తోంది. మొత్తం 16 మంది మరణించినట్లు అనధికారిక సమాచారంకాగా, మంత్రులు దామోదర, వివేక్‌ మాత్రం 12 మంది మరణించినట్లు ప్రకటించారు. మృతదేహాలను గుర్తించలేని పరిస్థితి నెలకొంది. సుమారు 36 మంది గాయపడ్డారు. 20 మందికి పైగా కార్మికులకు 80 శాతానికి పైగా కాలిన గాయాలయ్యాయి. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. క్షతగాత్రులను సమీపంలో ఉన్న పటాన్‌చెరు, చందానగర్, మదీనాగూడ, మియాపూర్‌లలోని పలు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భవనాల శిథిలాల కింద మరింత మంది కార్మికులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. పరిశ్రమ ఆవరణలో భీతావహ వాతావరణం నెలకొంది. ఘటనా స్థలాన్ని మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్‌ వెంకటస్వామి, హైడ్రా కమిషనర్‌ రంగనాథ్, పోలీసు ఉన్నతాధికారులు, ఇతర అధికారులు సందర్శించారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ఘోర దుర్ఘటనపై ప్రధాని మోదీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ తదితర ప్రముఖులు ది్రగ్బాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. బ్లోయర్‌ పేలి.. రియాక్టర్‌కు అంటుకుని.. మందుల తయారీకి సంబంధించిన ఈ పరిశ్రమలో కన్సిస్టెన్స్‌ మైక్రోస్టెల్లయిన్‌ సెల్యులర్‌ పౌడర్‌ను ఉ త్పత్తి చేస్తారు. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం.. ఉదయం 9.10 గంటల ప్రాంతంలో మొత్తం 111 మంది కార్మికులు, ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. అంతా పనిలో నిమగ్నమై ఉండగా తొలుత హెయిర్‌ బ్లోయర్‌ పేలింది. దీంతో ఎగసిన మంటలు సమీపంలో ఉన్న రియాక్టర్‌కు అంటుకోవడంతో చెవులు చిల్లులు పడిపోయేంత శబ్దంతో భారీ పేలుడు సంభవించింది. భూమి కంపించినట్టు అయ్యింది. కొందరు కార్మికులు వెంటనే బయటకు పరుగులు తీసి ప్రాణాలు కాపాడుకున్నారు. మృతుల్లో యాజమాన్య ప్రతినిధి? మృతులు, గాయపడిన వారిలో ఎక్కువగా ఒడిశా, బిహార్, యూపీ వాళ్లే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. మరణించిన వారిలో ఫ్యాక్టరీ యాజమాన్యానికి చెందిన గోవన్‌ అనే వ్యక్తి కూడా ఉన్నారని అధికారవర్గాలు వెల్లడించాయి. ఆయన ఫ్యాక్టరీలోకి వచ్చిన కొద్ది సేపటికే ఈ పేలుడు సంభవించిందని తెలిపాయి. అర్ధరాత్రి వరకు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్‌ సిగాచి పరిశ్రమ భవనాల శిథిలాల కింద కార్మికులు చిక్కుకుపోయి ఉంటారనే అంచనాతో ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి. హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. భారీ కట్టర్లు, క్రేన్‌లు, హిటాచీలతో శిథిలాల తొలగింపును చేపట్టారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం కురిసిన చిన్న పాటి వర్షం సహాయక చర్యలకు కొంత అంతరా యం కలిగించింది. అయితే రెస్క్యూ ఆపరేషన్‌ అర్ధరాత్రి వరకు కొనసాగింది. మంగళవారం కూడా శిథిలాల తొలగింపు చర్యలు కొనసాగనున్నాయి. మిన్నంటిన రోదనలు.. ఆందోళన కార్మికుల కుటుంబసభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. విధులకు హాజరై ఆచూకీ లేకుండా పోయిన వారి కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. తమ వారి ఆచూకీ అధికారులను ఆరా తీశారు. వారి నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆందోళనకు దిగారు. పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి దామోదర రాజనర్సింహ నాలుగు గంటల పాటు అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. కలెక్టర్‌ ప్రావీణ్య, ఎస్పీ పరితోష్‌ పంకజ్‌కు పలు సూచనలిచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని పరిశ్రమల శాఖ ఫైర్‌ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. ఎయిర్‌ ఫైర్‌ సిస్టమ్‌లో ప్రెషర్‌ వల్లే సిగాచీ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్‌ స్పష్టం చేశారు. ఇప్పటికే పరిశ్రమల శాఖ అధికారులు దీనిపై విచారణ ప్రారంభించారని తెలిపారు. ప్రభుత్వం తరఫున మెరుగైన ఎక్స్‌గ్రేషియా అందించేందుకు కృషి చేస్తామన్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న మంత్రులు దామోదర, వివేక్‌ రాజకీయం చేయొద్దు: మంత్రులు పేలుడు ఘటనలో గాయపడిన వారిలో హేమ సుందర్, ధర్మరాజ్‌ ప్రసాద్, రాజేష్‌ కుమార్‌ చౌదరి, కమలేష్‌ ముఖియా, చందన్‌కుమార్‌ నాయక్, నగ్నజిత్, అభిషేక్‌ కుమార్, అజిత్‌ తివారి, సంజయ్‌కుమార్, యశ్వంత్‌ కుమార్, ధన్‌వీర్‌ కుమార్, సంజయ్‌ ముఖియా, రాజశేఖర్‌రెడ్డి, దేవనంద్, గణేష్‌ కుమార్, సంజయ్‌కుమార్‌ యాదవ్, నీలాంబర్‌ బట్రా, సమీర్, అమర్జిత్, అర్జున్‌కుమార్, అజిమ్‌ అన్సారీలను మియాపూర్‌ మదీనాగూడలోని ప్రణామ్‌ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఇక్కడ చికిత్స పొందుతూ అభిషేక్‌ కుమార్, అజిత్‌ తివారి మృతి చెందారు. ముగ్గురు కార్మికుల పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రివర్గాలు వెల్లడించాయి. ఆస్పత్రిలో ఉన్నవారిని మంత్రులు దామోదర్‌ రాజనర్సింహ, వివేక్‌ వెంకటస్వామి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదంలో గాయపడిన కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. దీనిపై ఎవరూ ఎలాంటి రాజకీయం చేయవద్దని కోరారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఇందుకు అయ్యే ఖర్చు ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం.. సిగాచీ పరిశ్రమలో ప్రమాదం నేపథ్యంలో బాధిత కుటుంబాలకు సహాయం కోసం సంగారెడ్డి కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు. తక్షణ సహాయం కోసం సంబంధిత వ్యక్తులు 08455–276155 నంబర్‌ను సంప్రదించవచ్చని కలెక్టర్‌ ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. నేడు సీఎం సందర్శన సిగాచి పరిశ్రమను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం ఉదయం 10 గంటలకు సందర్శించనున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించనున్నారు. అక్కడి కార్మికులతో మాట్లాడనున్నారు. సహాయక చర్యలను కూడా పరిశీలిస్తారు. కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి: కేసీఆర్‌ సిగాచి పరిశ్రమ ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడంపై బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. ప్రమాదానికి కారణాలపై విచారణ జరిపించాలని, గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందేలా చూడాలని, చనిపోయిన కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. ఇలావుండగా పాశమైలారం పరిశ్రమలో రియాక్టర్‌ పేలుడు అత్యంత విషాదకరమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పేర్కొన్నారు. పలువురు కార్మికులు చనిపోయారన్న వార్త తనను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు. రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధానిసాక్షి, న్యూఢిల్లీ: సంగారెడ్డి జిల్లాలో సంభవించిన పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ నాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రధాని తక్షణ ఆర్థిక సాయం ప్రకటించారు. ప్రధానమంత్రి జాతీయ ఉపశమన నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌) నుంచి మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు చొప్పున, గాయపడ్డ వారికి రూ.50 వేలు చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ‘ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నా. తమకు ప్రియమైన వారిని కోల్పోయిన వారికి సంతాపం తెలియజేస్తున్నా. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా..’ అని మోదీ పేర్కొన్నారు. ‘ఈ ఘోర ప్రమాదం గురించి విని చాలా బాధ కలిగింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు తక్షణ సహాయ, రక్షణ చర్యలు చేపడుతున్నారు..’ అని రాహుల్‌ పేర్కొన్నారు. ‘ఈ ఘోర ప్రమాదంలో అమూల్యమైన ప్రాణాలు పోవడం ఎంతో దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు నా హృదయపూర్వక సంతాపం..’ అని ఖర్గే అన్నారు.సీఎం రేవంత్‌ దిగ్భ్రాంతి.. ప్రమాదంపై ఆరా సాక్షి, హైదరాబాద్‌: పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన ఘోర ప్రమాదంఫై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయక చర్యలకు ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్‌ను అడిగి తెలుసుకున్నారు. డీజీపీ జితేందర్, సీఎస్‌ రామకృష్ణారావుతో సమీక్షించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని ఆదేశించారు. సహాయక చర్యలను నిరంతరాయంగా కొనసాగించేందుకు, వాటిని పర్యవేక్షించేందుకు ప్రభుత్వం తరఫున సీఎస్‌ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. డిజాస్టర్‌మేనేజ్‌మెంట్‌స్పెషల్‌ సీఎస్, కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఆరోగ్య శాఖ కార్యదర్శి, ఫైర్‌సరీ్వసెస్‌అడిషనల్‌డీజీని సభ్యులుగా నియమించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలను సిఫారసు చేసే బాధ్యతను కమిటీకి అప్పగించారు.

Sakshi Guest Column On BJP Telugu States new presidents3
దూకుడు కన్నా సమన్వయానికే మొగ్గు

‘మంచి ప్రారంభంతో సగం పని అయిపోయినట్టే’ అంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ కొత్త అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియను తామలానే జరిపించగలిగామని బీజేపీ అధినాయకత్వం భావిస్తోంది. తెలంగాణలో ఎన్‌.రామచంద్రరావు, ఆంధ్రప్రదేశ్‌లో పి.వి.ఎన్‌. మాధవ్‌ కొత్త అధ్యక్షులుగా ఎన్నికవడం చూస్తే, సుదీర్ఘ కాలం పార్టీనే అంటిపెట్టుకొని ఉండటం, సైద్ధాంతిక బలం వంటి అంశాలకే ప్రాధాన్యమిచ్చిందని స్పష్టమౌతోంది. తాజా నిర్ణయంపై ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రభావమూ విస్పష్టమే! పార్టీని దూకుడుగా తీసుకు వెళ్లటం కన్నా, ‘గ్రూప్‌’ల బెడద లేకుండా, ఐక్యంగా నడిపించటం పైనే అధిష్ఠానం దృష్టి నిలిపిందనిపిస్తోంది. పార్టీకి లభించే తక్షణ ఊపు కన్నా, ఎన్డీయే కూటమికి దీర్ఘకాలికంగా ఒనగూరే రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేశారని ఈ నిర్ణయం తేటతెల్లం చేస్తోంది. బయటి నుంచి వచ్చే నేతలకు లభించే ఇతర అందలాల సంగతెలా ఉన్నా, వారు పార్టీ సంస్థాగత పదవులు, హోదాల్లోకి రావటం అంత తేలికైన అంశం కాదనీ మరోమారు సంకేతాలు ఇచ్చినట్టయింది.జాప్యం జరిగినా తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల ఎన్నిక విషయంలో బీజేపీ అధినాయకత్వం వ్యూహాత్మకంగానే అడుగులు వేసింది. అభ్యర్థుల ఎంపికలో, దూకుడు స్వభావం కన్నా సంయమనం, సమన్వయం నెరిపే నాయకత్వానికి ప్రాధాన్యమిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోని కూటమి భాగస్వామ్య పక్షమైన బీజేపీ, కూటమి పార్టీల మధ్య సఖ్యతకు విఘాతం రానీయకుండా చూసుకోవడమే కాక... తెలంగాణలో అటువంటి భవిష్యత్‌ అవకాశానికి దారులు తెరచి ఉంచింది. రేపు అది తెలుగుదేశం–జనసేనతో జట్టు కొనసాగించడమైనా కావచ్చు, కాదు పరిస్థితులు మారితే భారతæ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)తో జోడీ కట్టడమైనా కావచ్చు. పార్టీ అధినాయకత్వం కనుసన్నల్లో మెదలవటమే కాకుండా, ఢిల్లీ నాయకత్వం నిర్దేశించిన తరహాలో రాష్ట్రాల్లో పార్టీ శ్రేణుల్ని నడపగలిగే అణకువ గలిగిన నాయకత్వానికి పీట వేసింది. మొదట్నుంచీ పార్టీలోనే ఎదిగిన ఇద్దరు మాజీ ఎమ్మెల్సీలు ఎన్‌.రామచంద్రరావు (తెలంగాణ), పి.వి.ఎన్‌. మాధవ్‌ (ఏపీ) పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికయేట్టు వ్యూహరచన చేసింది. దూకుడు నాయకత్వం ఉండుంటే, ఇతర పార్టీల నుంచి, ముఖ్యంగా బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీ వైపు వలసలుంటాయేమోననే భయం ఆ పార్టీకి ఉండేది. ఇప్పుడా భయం పోయింది.వీగిన తెలంగాణ చిక్కుముడితెలంగాణలో పార్టీ రాష్ట్రాధ్యక్ష ఎన్నిక బీజేపీ అధినాయకత్వానికి ఒక దశలో సవాల్‌గానే మారింది. పలువురు నాయకులు ఈ పదవిని ఆశించడమే కాకుండా ముమ్మరంగా తమ వంతు ప్రయత్నాలు చేశారు. తర్జన – భర్జనల తర్వాత త్రాసు రామచంద్రరావు వైపు మొగ్గింది. ఈ పదవిని ఆశించడమే కాకుండా ఢిల్లీ నాయకత్వాన్ని మెప్పించే ప్రయత్నం చేసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు నిరాశే మిగిలింది. ఈటలకు పార్టీలో ‘చేరికల కమిటీ’కి నేతృత్వం ఇచ్చినప్పటికీ, ఆశించిన స్థాయిలో చేరికలు జరగకపోవడం, పార్టీలో పాత –కొత్త నాయకుల మధ్య స్పర్థ పెరగటం వంటివి అధినాయకత్వానికి చీకాకు కలిగించాయి. బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రచారం జరగటం, గజ్వేల్‌తో పాటు హుజూరాబాద్‌లోనూ ఆయన ఓడిపోవడం వంటివే కాక బీజేపీ సంస్థాగత ఎన్నికల నిబంధనలు కూడా ఆయనకు ప్రతికూలంగా ఉన్నాయి. ఈటలకు పార్టీ అధ్యక్ష పీఠం దక్కకపోవడమొక్కటే కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు మిగిలిన సంతృప్తి కావచ్చని పార్టీలో గుసగుసలున్నాయి. బయటకు ఆసక్తిని వెల్లడించకపోయినా, ఒక దశలో తాను పోటీదారును కాదని ప్రకటించినా.... మరోమారు అధ్యక్షుడు కావాలని ఆయనకు లోలోపల ఉండినట్టు తెలుస్తోంది. అందుకు కారణం, లోగడ ఆయన బాగా పనిచేస్తున్నప్పుడు, పార్టీకి మంచి ఊపు తెచ్చినపుడు అర్ధంతరంగా ఆయన్ని తప్పించడమే! పార్టీ ఎదుగుదలకు ‘నేనే’ కారణం అనే స్థితిలోకి అధ్యక్షుడు వెళ్లిపోయారనీ, ‘నేను’ను బీజేపీ నాయకత్వం అంగీకరించదనీ పార్టీలో కొందరు అప్పట్లో అన్వయం చెప్పేవారు. ఇక తెలంగాణ అధ్యక్ష స్థానానికి ఎంపీలు అర్వింద్, డీకే అరుణ, రఘునందనరావు, డా.లక్ష్మణ్‌ పేర్లు ప్రచారంలోకి రావటమన్నది ఆటలో అరటిపండే!సత్తా కన్నా సంకేతాలకే మొగ్గుబీజేపీ అధిష్ఠానం వైఖరి కొన్నిసార్లు విచిత్రంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై దృష్టి నిలిపిన గొప్ప చరిత్ర ఏమీలేదు. ఏదో సమీకరణాల్లో... అయితే రాష్ట్రం రావాలి, కాదంటే వ్యూహం నెరవేరి ఎన్డీయేకు లబ్ధి చేకూరాలి. ఏపీ, తెలంగాణల్లో అధ్యక్షుల ఎన్నికకు అదే వ్యూహాన్ని అనుసరించినట్టు కనిపిస్తోంది. కూటమి పార్టీల మధ్య సఖ్యతకు, సయోధ్యకు మాజీ ఎమ్మెల్సీ (పట్టభద్రుల స్థానం) పి.వి.ఎన్‌. మాధవ్‌ అధ్యక్షులైతే అందరికీ ఆమోదయోగ్యంగా, అధిష్ఠానానికి తలలో నాలుకలా ఉంటారనే తాజా నిర్ణయానికి వచ్చినట్టుంది. కూటమి మిత్రులకు ఈ విషయంలో స్పష్టమైన సంకేతాలివ్వడం పార్టీకి ముఖ్యం. మాధవ్‌ దివంగత నేత పి.వి.చలపతిరావు తనయుడు. రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా ఉండి, ఉమ్మడి ఏపీ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగానూ పనిచేసిన చలపతిరావుకు మంచి పేరుండేది. కోస్తాంధ్ర ప్రాంతం నుంచి సుదీర్ఘకాలం ఆయనే బీజేపీకి పెద్ద దిక్కుగా ఉన్నారు.ఇక తెలంగాణలో రామచంద్రరావు అధ్యక్షుడవడం చాన్నాళ్లుగా పార్టీనే అంటిపెట్టుకొని ఉన్న పాత నాయకులకు సంతృప్తినిచ్చే నిర్ణయం. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి విభాగం (ఏబీవీపీ) నుంచి, యువమోర్చా నుంచి ఎదిగి వచ్చిన నాయకుడాయన. సంప్రదింపుల్లో దిట్ట అని పేరుంది. ఎమ్మెల్సీగా (పట్టభద్రులకు) ప్రాతినిధ్యం వహిస్తూ మండలిలో పార్టీ నాయకుడిగా ఉన్నారు. ప్రజలు తమకు అవకాశం ఇస్తే, బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పిన పార్టీ అధినాయకత్వం ఇతర అగ్రవర్ణాలను దూరం చేసుకోవద్దన్న వ్యూహమే ఇక్కడ పనిచేసి ఉంటుంది. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తనయ కవిత ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్టయినపుడు, ఆ పార్టీని బీజేపీతో జతచేయడమో, విలీనమో.... ప్రతిపాదనలొచ్చాయని ప్రచారం జరుగుతున్న పరిస్థితుల్లో ....తాజా అధ్యక్ష ఎంపిక/ఎన్నిక కీలకమైంది. రేపు ఏదైనా పరిణామాల్లో బీఆర్‌ఎస్‌తో బీజేపీ జట్టు కట్టాల్సివస్తే పార్టీకి సంయమనంతో వ్యవహరించే నాయకత్వం ఉండాలని ఇప్పట్నుంచే ఢిల్లీ నేతలు యోచించినట్టుంది. ఈటల రాజేందర్, బండి సంజయ్‌... ‘వారిద్దరిలో ఎవరికిచ్చినా వేరొకరు సహకరించక పోదుర’నే బలమైన అభిప్రాయముంది. ఇప్పటికే సిటీ వర్గం, నిజామాబాద్‌ బ్యాచ్, కరీంనగర్‌ టీమ్‌... ఇలా వర్గాలుగా చీలి ఉన్న తెలంగాణ బీజేపీలో మరో కొత్త వర్గాన్ని పుట్టించకుండా అధిష్ఠానం జాగ్రత్తపడిందనే సంతృప్తి కొందరిలోనైనా ఉంది. దివంగత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఒకప్పుడు చెప్పిన మాటలీ సందర్భంలో గుర్తుకొస్తాయి. బీజేపీకి సన్నిహితంగా పనిచేస్తూ, ఒక దశలో బీజేపీలో చేరే ఆలోచన చేసిన టీడీపీ నాయకుడు పర్వతనేని ఉపేంద్రనుద్దేశించి వాజ్‌పేయి ఈ మాటలన్నారు: ‘మీ పనితీరు మాకు అతకదేమో! మీరు ఇక్కడ ఇమడలేరు, మా వాళ్లు ఇమడనివ్వరు కూడా’ అని ఆ పెద్దాయన నర్మగర్భంగా చెప్పారు. అది కరడుగట్టిన సత్యమని తెలంగాణ బీజేపీ రాజకీయాలు నిరూపించాయి.దిలీప్‌ రెడ్డి వ్యాసకర్త పొలిటికల్‌ ఎనలిస్ట్, సీనియర్‌ జర్నలిస్ట్‌

Sakshi Editorial On Special Intensive Revision of Voter List4
ఎందుకొచ్చిన ‘సర్‌’?!

దేశంలో ఎన్నికలు జరిగినప్పుడల్లా ఆరోపణలు రావటం, మౌనంగా ఉండిపోయి నెలలు గడిచాక ముక్తసరిగా మాట్లాడటం ఎన్నికల సంఘం(ఈసీ)కి అలవాటైపోయింది. ఈసారి మార్పేమిటంటే... ఓటర్ల జాబితా సవరణ దశలోనే దానిపై ఆరోపణలు రావటం! రాజ్యాంగంలోని 326వ అధికరణం ప్రకారం పద్దెనిమిదేళ్లు నిండిన భారతీయ పౌరులు మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకోవాలి గనుక దానికి అనుగుణంగా ఈ దఫా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్టు ఈసీ చెబుతోంది. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (సర్‌) కింద ఓటర్ల వివరాలు సేకరిస్తామంటున్నది. ఇదే మాదిరి సవరణ 2003లో జరిగింది. కానీ ఆ ‘సర్‌’ వేరు! అప్పట్లో ఇంటింటికీ వెళ్లి జాబితాలోని ఫొటోలతో ఓటర్లను పోల్చిచూడటం, అనుమానాస్పదం అనిపిస్తే తొలగించటం వగైరాలు చేశారు. 2003 జనవరి 1ని ప్రాతిపదికగా తీసుకుని, ఆ తర్వాత జాబితాల్లోకి ఎక్కినవారందరినీ సంశయ ఓటర్లుగా పరిగణించి వారి నుంచి వివిధ పత్రాలు అడగాలన్నది ఈసీ తాజా నిర్ణయం. ఇవన్నీ 1955 నాటి జాతీయ పౌరసత్వ చిట్టా (ఎన్‌ఆర్‌సీ)లో నిర్దేశించిన పత్రాలు. సారాంశంలో ఈ ఓటర్లంతా జాబితాలో కెక్కాలంటే ముందుగా ఈ దేశ పౌరులమని నిరూపించుకోవాల్సి ఉంటుంది. తమ పుట్టుకకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు మాత్రమే కాదు... తమ తల్లిదండ్రుల జనన ధ్రువీకరణ పత్రాలు కూడా అందజేయాలి. ప్రస్తుతం ఓటర్లను ఈసీ మూడు కేటగిరీలుగా విభజించింది. దాని ప్రకారం 1987 జూలై 1 లేదా అంతకుముందు జన్మించినవారు జనన ధ్రువీకరణ పత్రం లేదా పుట్టిన ఊరు ధ్రువీకరణ పత్రం... లేదా రెండూ సమర్పిస్తే సరిపోతుంది. జూలై 1, 1987– డిసెంబర్‌ 2, 2024 మధ్య జన్మించినవారు ఈ పత్రాలతోపాటు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి జనన లేదా ప్రాంత ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. ఆ తర్వాత జన్మించినవారు తమ ధ్రువీకరణ పత్రాలతోపాటు తల్లిదండ్రులిద్దరివీ కూడా సమర్పించాలి. ఇవి అందజేయలేనివారి పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తారు. తుది జాబితా ప్రచురణలోగా అందిస్తేనే తిరిగి చేరుస్తారు.ఎన్నికలను సక్రమంగా నిర్వర్తించటంలో తరచూ విఫలమవుతున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈసీ దొడ్డిదారిన ఎన్‌ఆర్‌సీని అమల్లో పెట్టజూస్తున్నదని విపక్షాలు చేస్తున్న ఆరోపణ కొట్టిపారేయదగ్గది కాదు. అలాగని దొంగ ఓటర్ల సమస్య లేదని కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, అటు తర్వాత రెండు విభజిత రాష్ట్రాల్లో వేర్వేరు పోలింగ్‌ తేదీలున్నప్పుడు తెలుగుదేశం దీన్నొక కళగా అభివృద్ధి చేసింది. అక్కడా ఇక్కడా ఓటేయించటం, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాల నుంచి సైతం ఓటర్లను తరలించటం ఆ పార్టీకి అలవాటైన విద్య. ఇక అస్సాం, పశ్చిమ బెంగాల్, బిహార్‌ వగైరాల్లో బంగ్లాదేశ్, మయన్మార్‌ల నుంచి వచ్చినవారు ఓటర్లుగా నమోదై ఎన్నికల ఫలితాలు తారుమారు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అయితే అందుకు సంబంధించిన డేటా ఈసీ ఇంతవరకూ బయటపెట్టలేదు. అది విడుదల చేసివుంటే ఈ వ్యవహారం ఇంత వివాదం అయివుండేది కాదు. కానీ అలా చేయటం తన స్థాయికి తగదని సంస్థ భావిస్తున్నట్టుంది. బిహార్‌ మాత్రమే కాదు... వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరిగే అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో కూడా ఈ ‘సర్‌’ వచ్చిపడుతుందంటున్నారు. ఏడేళ్ల క్రితం అస్సాంలో ఈ దేశ పౌరులెందరు... ఇతరులెందరన్న ఆరా తీశారు. భారత రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ సర్వే తర్వాత 40.07 లక్షల మంది ‘విదేశీయులని’ నిర్ధారించారు. ఎన్నో ఆందోళనలు జరిగాక ఈ సంఖ్య 19 లక్షలకు తగ్గింది. వీరిలో అన్ని మతాలవారూ ఉండగా బిచ్చగాళ్లు, నిరుద్యోగులూ, ఇల్లూ వాకిలీ లేనివారూ ఎక్కువ. ఒక ఇంట్లో పెద్దన్న ‘భారతీయుడైతే’ మిగిలిన అన్నదమ్ములు ‘విదేశీయులు’గా ముద్రపడిన వారున్నారు. భర్తకు ఎన్‌ఆర్‌సీలో చోటు దక్కితే భార్య పేరు గల్లంతయిన ఉదంతాలు కోకొల్లలు. సైన్యంలో రిటైరై, అస్సాం సరిహద్దు పోలీసు విభాగంలో సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసే మహమ్మద్‌ సనావుల్లా పేరు సైతం మాయమైతే అరెస్టు చేసి నిర్బంధ శిబిరానికి తరలించారు. జాబితాలో ఉన్న కుటుంబ సభ్యులంతా గువాహటి హైకోర్టును ఆశ్రయించాక బెయిల్‌ దొరికింది. ఆ రాష్ట్రంలో ఏడేళ్లయినా ఇప్పటికీ లక్షల కేసులు తేలని నేపథ్యంలో ఇంత పని ఈసీ ఎందుకు నెత్తికెందుకుందన్న ప్రశ్న అందరినీ వేధిస్తోంది. బిహార్‌లో ఇప్పుడున్న ఓటర్ల సంఖ్య 7 కోట్ల 90 లక్షలు. ఇందులో 20–38 ఏళ్ల మధ్య వయస్కులు దాదాపు సగమని చెబుతున్నారు. ఈసీ లెక్క ప్రకారం ఈ సంఖ్య 2.93 కోట్లు. వీరు తమతోపాటు తమ తల్లిదండ్రుల్లో కనీసం ఒకరి పౌరసత్వాన్ని తేల్చిచెప్పాల్సి ఉంటుంది. నాలుగు నెలల్లో ఎన్నికలు పూర్తయి ప్రభుత్వం ఏర్పడాల్సిన బిహార్‌లో ఇది అంత తేలిగ్గా తేలే వ్యవహారమా? ఆ వంకన పాలక పక్షాల ఒత్తిడితో భారీయెత్తున ఓటర్లను తొలగించే ప్రమాదం ఉండదా? జాబితాలో చోటుదక్కనివారు న్యాయస్థానాలకెక్కితే పరిస్థితేమిటి? పాలకులుగా ఎవరున్నా పేదరికం రాజ్యమేలే బిహార్‌ నుంచి భారీయెత్తున వలసలుంటాయి. అక్కడ వృద్ధాప్య పింఛన్‌ నెలకు రూ. 700. ఇటీవలే దాన్ని రూ. 1,100 చేస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ఆర్భాటంగా ప్రకటించారు. పనుల కోసం వందలాది కిలోమీటర్లు దాటి తెలుగు రాష్ట్రాలకు వలస వస్తున్నవారి సంఖ్య తక్కువేమీ కాదు. అక్కడి జనాభాలో 7 శాతం మంది వేరే రాష్ట్రాలకు పోగా, అందులో 30 శాతం మంది ఉపాధి వెదుక్కొని వెళ్లినవారే. వారంతా వెనక్కొచ్చి తమ పత్రాల కోసం వెతుకులాడటం జరిగే పనేనా? బిహార్‌లో సకాలంలో ఎన్నికలు జరుగుతాయని ఈసీ విశ్వసిస్తోందా?

Wh Raja Singh Quits From BJP Few Details Here5
Raja Singh: ఆ గ్యాప్‌ కొనసాగుతూనే వచ్చింది..

రాజాసింగ్‌.. నిన్న మొన్నటి వరకూ బీజేపీలో ఓ సంచలనం. తెలంగాణలో బీజేపీ ఎదుగుదల కోసం కృషి చేసిన నాయకుల జాబితాలో రాజాసింగ్‌ కచ్చితంగా ఉంటారు. అయితే పార్టీకి ఉన్నపళంగా రాజీనామా చేశారు రాజాసింగ్‌. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఆశించి నామినేషన్‌ వేయడానికి బీజేపీ కార్యాలయానికి వచ్చిన రాజాసింగ్‌.. ఆపై కొద్ది సేపటికే పార్టీకి గుడ్‌ బై అంటూ ప్రకటించారు. ‘మీకో దండం.. మీ పార్టీకో దండం’ అని రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘ రాంచందర్‌రావుకు పార్టీ పగ్గాలు అప్పగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నా. బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేయాలనుకున్నా. కానీ, నా మద్దతుదారుల్ని బెదిరించారు. నామినేషన్‌ వేయడానికి వస్తే.. వేయనివ్వలేదు. వాళ్లు అనుకున్న వాళ్లకే పదవి ఇచ్చారు. అందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నా’ అని రాజాసింగ్‌ ప్రకటించారు. అసలు బీజేపీ అధిష్టానంతో రాజాసింగ్‌కు గ్యాప్‌ ఎలా ఏర్పడింది.. ఎక్కడ ఏర్పడింది అనే అంశాల్లో కొన్నింటిని పరిశీలిస్తే..ఆనాటి గ్యాప్‌.. కొనసాగుతూనే వచ్చింది..!రాజాసింగ్‌ అంటే బీజేపీ అధిష్టానానికి నమ్మకం. అది ఒకప్పుడు మాట. అది క్రమేపీ దూరం అయ్యింది. మూడేళ్ల క్రితం బీజేపీ అధికార ప్రతినిధి నుపూర్‌ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రత్యక్షంగా మద్దతు ప్రకటించారు రాజాసింగ్‌. 2022లో నుపూర్‌ శర్మ ఇస్లాం మత ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యలపై ఆమెను బీజేపీ సస్పెండ్ చేసిన తర్వాత, రాజాసింగ్‌ ఆమెను సమర్థిస్తూ వీడియో విడుదల చేశారు. ఇది బీజేపీ అధిష్టానం వైఖరిని తప్పుబట్టినట్లయ్యింది. అధిష్టానాన్ని చాలెంజ్‌ చేసినట్లు ఉండటంతో రాజాసింగ్‌ను వివరణ ఇవ్వాలని కోరింది అధిష్టానం. ఈ క్రమంలోనే రాజాసింగ్‌ సస్పెన్షన్‌కు గురయ్యారు. 2022 ఆగస్టు 23వ తేదీన రాజాసింగ్‌ను బీజేపీ సస్పెండ్‌ చేసింది. ఆ తర్వాత 2024 అక్టోబర్‌ 22వ తేదీన రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేయడంతో తిరిగి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దొరికింది రాజాసింగ్‌కు. అయితే అప్పట్నుంచి అధిష్టానంతో గ్యాప్‌ మాత్రం కొనసాగుతూనే వచ్చింది. 2024 ఎంపీ ఎన్నికల్లో బీజేపీ నుంచి హైదరాబాద్‌ ఎంపీగా ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోటీ చేయిస్తే అనూహ్య ఫలితాలు సాధించవచ్చనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా నడిచింది. అధిష్టానం రాజాసింగ్‌ను హైదరాబాద్‌ నుంచి పోటీ చేయించాలని చూసింది. ఇక్కడ రాజాసింగ్‌ మాత్రం ఎంపీగా విముఖత వ్యక్తం చేసిన కారణంగానే ఆయన మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేశారనేది మరో చర్చ. సస్పెన్షన్‌ గురైన సందర్భంతో పాటు తరచూ వివాదాలు కూడా రాజాసింగ్‌-అధిష్టానం మద్య గ్యాప్‌కు కారణమైంది. ఇటీవల కాలంలో పార్టీ లైన్‌కు భిన్నంగా రాజాసింగ్‌ వ్యవహరించడంతో ఆయన్ను అధిష్టానం పెద్దగా పట్టించుకోలేదు. ప్రధానంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని టార్గెట్‌ చేస్తూ చేసిన వ్యాఖ్యలతో పాటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు సైతం రాజాసింగ్‌ మద్దతు పలికారు. బీఆర్‌ఎస్–బీజేపీ మధ్య రహస్య ఒప్పందాలు ఉన్నాయన్న కవిత వ్యాఖ్యలను రాజాసింగ్‌ సమర్ధించారు. ఇవన్నీ కూడా అధిష్టానానికి కోపం తెప్పించాయి. రాజాసింగ్‌ రాజీనామా చేసే క్రమంలో అధిష్టానం పెద్దలు ఎవరూ కూడా ఆయన్ను బుజ్జగించే పని చేయకపోవడమే ఇందుకు ఉదాహరణ. ప్రధానంగా చూసుకుంటే 2022 నుంచే అధిష్టానంతో రాజాసింగ్‌కు సఖ్యత చెడిపోతూ వచ్చిందని, అదే ఇంతవరకూ తెచ్చిందనేది విశ్లేషకుల అభిప్రాయం.

Musheer Khan Slammed Century In England Against Notts 2nd 11 Team6
ఇంగ్లండ్‌ గడ్డపై సెంచరీ చేసిన మరో టీమిండియా యువ సంచలనం

ప్రస్తుతం భారత క్రికెట్‌ మొత్తం ఇంగ్లండ్‌ చుట్టూ తిరుగుతుంది. పురుషులు, మహిళలు, దివ్యాంగులు.. ఇలా విభాగంతో సంబంధం లేకుండా భారత క్రికెటర్లంతా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్నారు. భారత పురుషుల సీనియర్‌ జట్టు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడుతుండగా.. భారత పురుషుల అండర్‌-19 జట్టు ఇంగ్లండ్‌ అండర్‌-19 జట్టుతో ఐదు మ్యాచ్‌ల యూత్‌ వన్డే సిరీస్‌ ఆడుతుంది. భారత సీనియర్‌ మహిళల జట్టు కూడా ఇంగ్లండ్‌లోనే ఉంది. ఈ పర్యటనలో భారత జట్టు ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. పురుషులు, మహిళల జట్లే కాక, భారత పురుషుల దివ్యాంగ జట్టు కూడా ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ జట్టు ఇంగ్లండ్‌ దివ్యాంగ టీమ్‌తో ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతుంది. ఇదే కాక చాలామంది భారత పురుష క్రికెటర్లు ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్‌ ఆడుతున్నారు. టీమిండియా యువ ఆటగాళ్లు రుతురాజ్‌ గైక్వాడ్‌, తిలక్‌ వర్మ, ఇషాన్‌ కిషన్‌, ఖలీల్‌ అహ్మద్‌ వేర్వేరు జట్ల తరఫున కౌంటీ ఛాంపియన్‌షిప్‌ ఆడుతున్నారు. వీరిలో తిలక్‌ వర్మ, ఇషాన్‌ కిషన్‌ తమ కౌంటీ అరంగేట్రంలోనే సెంచరీలు చేసి అదరగొట్టగా.. మిగతా ఇద్దరు తమ తొలి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.పైన పేర్కొన్న జట్లు, ఆటగాళ్లే కాక ప్రస్తుతం మరో భారత స్థానిక జట్టు కూడా ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌ తమ ఎమర్జింగ్‌ జట్టును ఇంగ్లండ్‌కు పంపింది. ఈ జట్టు ప్రస్తుతం నాట్స్‌ సెకెండ్‌ 11తో మ్యాచ్‌ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ ఆటగాడు సర్ఫరాజ్‌ ఖాన్‌ సోదరుడు ముషీర్‌ ఖాన్‌ సెంచరీతో అదరగొట్టాడు. ముషీర్‌ 127 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. ముషీర్‌ సెంచరీ చేసిన విషయాన్ని ముంబై క్రికెట్‌ అసోసియేషన్‌కు చెందిన ఓ అధికారి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు.HUNDRED FOR MUSHEER KHAN 🇮🇳- Mumbai Cricket Association has sent the Emerging players to UK and they are currently playing against Notts 2nd 11, A great work by MCA for Developing the young stars. pic.twitter.com/lFkqecQ37n— Johns. (@CricCrazyJohns) June 30, 2025ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న అన్ని భారత క్రికెట్‌ జట్లలో ఒక్క భారత సీనియర్‌ పురుషుల జట్టు మినహా అన్ని జట్లు సక్సెస్‌ చూశాయి. భారత సీనియర్‌ పురుషుల జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఓటమిపాలు కాగా.. అండర్‌-19 జట్టు తొలి వన్డేలో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. మరోవైపు భారత సీనియర్‌ మహిళల జట్టు తొలి టీ20లో ఇంగ్లండ్‌ను చిత్తు చేయగా.. భారత పురుషుల దివ్యాంగుల జట్టు ప్రతిష్టాత్మక లార్డ్స్‌ మైదానంలో ఇంగ్లండ్‌ను ఓడించింది.ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న భారత ఆటగాళ్లలో చాలామంది శతకాలు చేశారు. సీనియర్‌ పురుషుల జట్టులో జైస్వాల్‌, గిల్‌, రాహుల్‌, పంత్‌ (2).. సీనియర్‌ మహిళల జట్టులో స్మృతి మంధన.. కౌంటీల్లో​ తిలక్‌ వర్మ, ఇషాన్‌ కిషన్‌.. తాజాగా ముషీర్‌ ఖాన్‌ శతకాలతో హోరెత్తించారు. ముషీర్‌ ఖాన్‌ ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఈ సీజన్‌లో అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. ముషీర్‌ దేశవాలీ సీజన్‌లో అన్న సర్ఫరాజ్‌ ఖాన్‌తో పోటీపడి పరుగులు సాధిస్తున్నాడు. అన్నదమ్ములిద్దరూ ముంబై జట్టుకే ఆడతారు. సర్ఫరాజ్‌ ఇటీవల ఇంగ్లండ్‌ లయన్స్‌పై తృటిలో సెంచరీ చేజార్చుకుప్పటికీ.. టీమిండియా ఇంట్రా స్క్వాడ్‌ మ్యాచ్‌లో మెరుపు సెంచరీ చేశాడు. అయినా అతనికి భారత జట్టు నుంచి పిలుపు రాలేదు.

Ysrcp Vows To Support Minorities: Sajjala Ramakrishna Reddy7
సంక్షేమానికి నిజమైన అర్థం.. వైఎస్‌ జగన్‌ పాలన: సజ్జల

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర స్థాయి సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ స్టేట్‌ కోఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వైఎస్సార్‌సీపీ మైనారిటీ విభాగం రాష్ట్ర అ«ధ్యక్షుడు ఖాదర్‌ బాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ మైనారిటీ విభాగం ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా, అసెంబ్లీ విభాగాల అ«ధ్యక్షులతో పాటు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ మైనారిటీ విభాగం చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని సంస్థాగతంగా పట్టిష్టం చేయడం మన ప్రధాన కర్తవ్యంమన్నారు. మన పార్టీకి నిజమైన బలం కార్యకర్తలేనని.. మన నాయకుడు వైఎస్‌ జగన్‌ శక్తి కూడా కార్యకర్తలేనని.. పార్టీ తన ప్రస్థానంలో అనేక రికార్డులు సృష్టించిందన్నారు.‘‘వైఎస్‌ జగన్‌ తన పాలనలో పలు విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చారు. పాలనలో డెలివరీ మెకానిజం డెవలప్‌ చేయడంతో పాటు, విద్య, వైద్యం వంటి కోర్‌ సెక్టార్స్‌ను ప్రతి గడపకు తీసుకెళ్ళారు. రాష్ట్రాన్ని అభ్యుదయ పథంలో నడిపించేందుకు, ఏమేం చేయాలో ఆలోచించి, వాటిని అమలు చేశారు. సంక్షేమానికి నిజమైన అర్థం చెప్పిన పాలన మనది. అదే కూటమి ప్రభుత్వంపై ఏడాది పాలనతోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది’’ అని సజ్జల పేర్కొన్నారు.అడ్డుకుంటూ.. అరాచకం:మరో వైపు జగన్‌ ప్రజాదరణ నానాటికి మరింత పెరుగుతోంది. ఆయన ఎక్కడికి వెళ్లినా, స్వచ్ఛందంగా వేలాది మంది తరలి వస్తున్నారు. అందుకే ఆయన పర్యటనలు అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. ఇటీవల పలు ఆంక్షలతో జగన్‌ పల్నాడు జిల్లా పర్యటన అడ్డుకోవాలని చూస్తే, సాధ్యం కాలేదు. ఇప్పుడు నెల్లూరు జిల్లా పర్యటన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేసులు పెట్టి ఎలాగైనా కట్టడి చేయాలని చూస్తున్నారు. పొలీసులను అడ్డు పెట్టుకుని రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తున్నారు.అప్రకటిత ఎమర్జెన్సీ:కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. ప్రశ్నించే గొంతులు నొక్కుతోంది. ఎక్కడికక్కడ అణిచివేసే ధోరణితో పని చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది. ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపే తప్పుడు సంప్రదాయానికి ఈ ప్రభుత్వం నాంది పలుకుతోంది. అయితే ఆ కేసులు ఎదుర్కొనే సత్తా మన నాయకుడికి ఉంది. రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా జరుగుతోంది. ఒక్క పథకం కూడా అమలు చేయకున్నా, లక్షల కోట్ల అప్పు చేస్తున్నారు.వైఎస్సార్‌సీపీ.. మైనారిటీ సంక్షేమం:ఎన్నికలు ఎప్పుడొచ్చినా, మనం ధీటుగా ఎదుర్కోగలం. మనం సంస్థాగతంగా ఇంకా బలపడాలి. పార్టీ నెట్‌వర్క్‌ అనేది కేంద్ర కార్యాలయం నుంచి గ్రామస్థాయి వరకు వెళ్ళాలి. పార్టీలో అన్ని కమిటీల నియామకం పూర్తయితే 18 లక్షల మంది క్రియాశీలక సభ్యులవుతారు. అప్పుడు చంద్రబాబు చేస్తున్న దుర్మార్గాలు, రాష్ట్రానికి చేస్తున్న నష్టాలను ఇంకా గట్టిగా ప్రచారం చేయగలం. అలాగే మన పార్టీపై అదే పనిగా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ధీటుగా ఎదుర్కోగలగుతాం.వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు జరిగింది. ముఖ్యంగా మైనారిటీల సంక్షేమం గతంలో ఏనాడూ లేని విధంగా గత ప్రభుత్వంలో కొనసాగింది. మన పార్టీ ఎప్పుడూ మైనారిటీల పక్షాన నిలబడింది. ఇక ముందు కూడా అలాగే ఉంటుంది. అందుకే ఎన్నికలు ఎప్పుడొచ్చినా మైనారిటీలంతా మన వెంటే ఉండేలా, మీరంతా కృషి చేయాలి. చొరవ చూపాలి. ఇంకా వైఎస్సార్‌సీపీ వక్ఫ్‌ బిల్లును వ్యతిరేకించిన విషయాన్ని ముస్లింలలో విస్తృతంగా ప్రచారం చేయాలన్న సజ్జల.. పార్టీ ఎప్పుడూ ముస్లింల సంక్షేమం కోరుకుంటుందని స్పష్టం చేశారు.

Shefali Jariwala demise Can Anti-Ageing Drugs Cause Cardiac Arrest 8
యాంటీ ఏజింగ్‌ ఇంజెక్షన్లతో ముప్పు ; షెఫాలీ ప్రాణం తీసింది అవేనా?

కాంటా లగా గర్ల్ షెఫాలీ జరీవాలా (Shefali Jariwala) అకాల మరణం అనేక ఊహాగానాలు, ఆందోళనలను తెరపైకి తీసుకొచ్చింది. ముఖ్యంగా యాంటీ-ఏజింగ్ ట్రీట్మెంట్స్ అండ్ ఫాస్టింగ్ టాక్సిక్ కాక్టెయిల్ ఆమె ప్రాణాలకు ముప్పు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.షెఫాలిఖాళీ కడుపుతో కాస్మెటిక్ యాంటీ ఏజింగ్ ఇంజెక్షన్ తీసుకొని ఉండవచ్చని, ఇదే గుండెపోటుకు కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న షెఫాలి ఖాళీ కడుపుతో గ్లూటాతియోన్ , విటమిన్ సి కలిగిన కాస్మెటిక్ యాంటీ-ఏజింగ్ ఇంజెక్షన్ తీసుకున్నారనీ, ఆ వెంటనే ఆమె తీవ్ర అస్వస్తతతకు గురైందట. ఒళ్లు వణకడం, తర్వాత స్పృహ కోల్పోవడంతో తక్షణమే ఆమె భర్త పరాగ్ త్యాగి ముంబైలోని బెల్లెవ్యూ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌కు తీసుకెళ్లినప్పటికీ ఫలితం లేకపోయింది. అంతేకాదు షెఫాలీ ఇంట్లో యాంటీ ఏజింగ్ ఇంజక్షన్ వైల్స్, విటమిన్ సప్లిమెంట్లు, గ్యాస్ట్రిక్ మాత్రలు దొరకడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరింది. అంతే కాదు ఎనిమిదేళ్ల క్రితం వైద్యుడిని సంప్రదించిన షెఫాలీ, ఆ తర్వాత కూడా స్వయంగా మందులు తీసుకోవడం ప్రారంభించి, ప్రస్తుత వైద్యుల పర్యవేక్షణ లేకుండానే దీనిని కొనసాగించిందనే అనుమానాలు కూడా బలంగా ఉన్నాయి. ఖాళీ కడుపుతో ఇంట్రావీనస్‌గా తీసుకోవడం లేదా ఇతర మందులతో పాటు తీసుకోవడం వంటివి - హైపోటెన్షన్ , కార్డియాక్ అరెస్ట్‌లాంటి ముప్పు ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. షెఫాలీ విషయంలో కూడా ఖాళీ కడుపుతో ఇంజక్షన్ తీసుకోవడం వల్ల రక్తపోటు ఒక్కసారిగా పడిపోయి గుండెపోటు వచ్చి ఉంటుందని వైద్య నిపుణులు అనుమానిస్తున్నారు. అయితే ఆమె మరణానికి ఖచ్చితమైన కారణపై ఇంకా స్పష్టతలేదు. పోస్ట్‌మార్టం నివేదిక తరువాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.గ్లుటాతియోన్, విటమిన్ సి చర్మ చికిత్సలలో విస్తృతంగా వాడుకలో ఉన్నప్పటికీ ఖాళీకడుపుతో లేదా ఉపవాసం ఉన్న స్థితిలో, ఇలాంటి మందుల కలయిక హృదయనాళ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి ఏర్పడుతుందని, ఒక్కోసారి రక్తపోటు పడిపోయి గుండె ఆగిపోవడానికి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే వీటిని వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా అంతటా యాంటీ-ఏజింగ్ థెరపీల వాడకంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా, ఇంజెక్ట్ చేయగల గ్లూటాతియోన్‌కు FDA-ఆమోదం లేదనీ, వాస్తవానికి, చర్మాన్ని తెల్లగా చేస్తుందని భావిస్తున్న గ్లూటాతియోన్‌ ఇంజెక్షన్‌ ఫలితాలపై క్లినికల్ ట్రయల్స్‌గానీ, లేదా అధికారిక మార్గదర్శకాలు లేవు. పైగా దీని వలన కాలేయం, మూత్రపిండాలు , నాడీ వ్యవస్థపై విషపూరిత ప్రభావంతో పాటు, స్టీవెన్స్-జాన్సన్ సిండ్రోమ్ వంటి తీవ్రమైన ప్రమాదాలను కూడా FDA లేవనెత్తింది. అలాగే చర్మకాంతికోసం ఇంజెక్టబుల్‌ విటమిన్ సి ఉత్పత్తులకు కూడా FDA-ఆమోదం లేదు. 2019లో, FDA అన్ని కంపెనీలను ఆస్కార్బిక్ ఆమ్లం (విటమిన్ సి) ఇంజెక్షన్ అనుమతి లేని వెర్షన్ల పంపిణీని నిలిపివేయాలని కోరింది. మరోవైపు భారతదేశంలో, సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO) గ్లూటాతియోన్ , విటమిన్ సి ఇంజెక్షన్ల వినియోగానికి ఆమోదం తెలిపింది. కానీ సౌందర్య లేదా చర్మాన్ని తెల్లగా చేసే ఉద్దేశానికి ఎంతమాత్రం కాదు నిర్దిష్ట వైద్య సూచనల కోసం మాత్రమే.కోవిడ్‌ తరువాత ఇటు దేశంలో, ఆటు ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో మరణానికి హృదయనాళ వ్యాధి (CVD) ప్రధాన కారణంగా నిలుస్తోందని రొమ్ము కేన్సర్‌ తరువాత ఇదే అత్యంత ప్రమాదకారిగా ఉందంటున్నారు వైద్య నిపుణులు.

Dil Raju Criticize Nithiin For Not Succeed like Allu Arjun9
23 ఏళ్లుగా ఇండస్ట్రీలో.. అల్లు అర్జున్‌ స్థాయికి రాలేకపోయావ్‌: దిల్‌ రాజు

నితిన్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ తమ్ముడు. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. జూలై 4న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌ గట్టిగా చేస్తోంది చిత్రయూనిట్‌. ఈ క్రమంలో దిల్‌ X తమ్ముడు పేరుతో ఓ స్పెషల్‌ చిట్‌చాట్‌ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో అనేక విషయాల గురించి మాట్లాడారు.సత్సంబంధాలు లేకపోయినా..నితిన్‌ మాట్లాడుతూ.. దిల్‌రాజు (Dil Raju)ను నేను అంకుల్‌ అని పిలిచేవాడిని. నేను తొమ్మిదో తరగతి చదువుతున్నప్పుడు మా నాన్న, రాజు కలిసి తొలిప్రేమ సినిమా డిస్ట్రిబ్యూట్‌ చేశారు. ఆ సినిమా హిట్టయినప్పుడు అందరం కలిసి తిరుపతి వెళ్లాం. అలా రాజుతో పరిచయం ఏర్పడింది. 2005లో రామ్‌ సినిమా చేశాను. అప్పుడు రిలీజ్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. మన మధ్య సత్సంబంధాలు లేకపోయినా మీరు వచ్చి కొంత అమౌంట్‌ ఇచ్చి సమస్యను పరిష్కరించారు. చాలామంది హీరోలకు, నిర్మాతలకు సాయం చేశారు. అలాంటిది మీరు సినిమాలను తొక్కేస్తారన్న విమర్శలు విన్నప్పుడు బాధేసింది అని చెప్పుకొచ్చాడు.జయం సినిమాకు ముందే..దిల్‌ రాజు తన ప్రయాణం గురించి మాట్లాడుతూ.. జయం సినిమా పోస్టర్స్‌ చూసి ఈ కుర్రాడు భలే ఉన్నాడనుకున్నాను. అప్పుడు నువ్వు ఎవరో కాదు, సుధాకర్‌ రెడ్డి కుమారుడు అనగానే.. మరింకే, నితిన్‌తో సినిమా చేద్దామని వినాయక్‌తో అన్నాను. అలా జయం రిలీజ్‌కు ముందే దిల్‌ మూవీ ఫిక్స్‌ చేశాం. కాకపోతే దిల్‌ టైటిల్‌ బూరుగుపల్లి శివరామకృష్ణ గారి దగ్గర ఉంది. ఆయన దగ్గరకు వెళ్లి ఈ టైటిల్‌ మా సినిమాకు బాగుంటుందని అడగ్గానే ఇచ్చారు. ఆయన టైటిల్‌ ఇవ్వడం వల్లే 'దిల్‌' రాజు అనేది ఒక బ్రాండ్‌ అయిపోయింది.గేమ్‌ ఛేంజర్‌ నష్టాలునేను 2003లో నిర్మాతనయ్యాను. నువ్వు 2002లో హీరో అయ్యావు. నాకంటే ఒక ఏడాది సీనియర్‌వి. నేను జూనియర్‌ను. అయినా నేను ఒక్కొక్కటిగా సాధించుకుంటూ టాప్‌ పొజిషన్‌లోకి వచ్చాను. ఆర్య సినిమా చేస్తున్నప్పుడు అల్లు అర్జున్‌ను, దిల్‌ సినిమా చేస్తున్నప్పుడు నితిన్‌ (Nithiin)ను ఫ్యూచర్‌ స్టార్స్‌ అని ఊహించాను. కానీ, నువ్వు ఆ స్థాయికి రాలేకపోయావు. అదే నువ్వు కోల్పోయావు. తమ్ముడుతో సక్సెస్‌ వస్తుంది కానీ పూర్వ వైభవం రావడానికి అది సరిపోదు అన్నాడు.రెండు ప్రాపర్టీలు అమ్ముకుంటా..గేమ్‌ ఛేంజర్‌ డిజాస్టర్‌ గురించి ఓపెన్‌ అవుతూ.. జనవరి 10న గేమ్‌ ఛేంజర్‌ రిలీజవగానే నాకు నష్టం రాబోతుందని అర్థమైంది. కాకపోతే 14న రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం కచ్చితంగా హిట్‌ కొడుతుందని నమ్మకంగా ఉన్నాను. ఒకవేళ ఆ సినిమా లేకపోయినా.. రెండు ప్రాపర్టీలు అమ్ముకుని ఆ నష్టాల నుంచి బయటపడేవాడిని. అది పెద్ద విషయం కాదు అని చెప్పుకొచ్చాడు. ఇక వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న నితిన్‌కు.. తమ్ముడు సినిమా విజయాన్ని సాధించి పెట్టాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు బాధపడొద్దు: శ్రావణ భార్గవి పోస్ట్‌

BJP Trolls Mallikarjun Kharge Over Comment Of High Command Hands10
‘ఖర్గేజీ.. అంతా హైకమాండ్‌ చేతుల్లోనే ఉందా?.. మీరు హైకమాండ్‌ కాదా?

బెంగళూరు: కాంగ్రెస్‌లో హైకమాండ్‌ తీసుకునే నిర్ణయాలకే కట్టుబడి ఉండాలనేది ఎప్పట్నుంచో వస్తుంది. రాష్ట్రాల్లో ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన తరుణంలొ అది హైకమాండ్‌ ఫైనల్‌ చేస్తుంది. ఈ విషయంలో రాష్ట్ర సీఎంలు కూడా హైకమాండ్‌ మాటకు ఎదురుచెప్పకూడదు. ఈ తరహా పరిణామాలను తరుచూ చూస్తూనే ఉన్నాం. మరి హైకమాండ్‌ అంటే ఎవరు?, ఏఐసీసీ అధ్యక్షుడే కాంగ్రెస్‌ హైకమాండ్‌ కదా.. మరి పార్టీ చీఫ్‌ అయిన మల్లిఖార్జున ఖర్గే నోట నుంచే హైకమాండ్‌ చూసుకుంటుంది అనే మాట వస్తే ఏమనాలి?ఇప్పుడు అదే జరిగింది. ఏఐసీసీ ప్రెసిడెంట్‌ మల్లిఖార్జున ఖర్గే.. ‘హైకమాండ్‌ చేతుల్లో ఉంది’ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కర్ణాటక రాజకీయాల్లొ ఏమైనా మార్పులు ఉండబోతున్నాయా> సీఎంను మార్చబోతున్నారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు ఖర్గే ఒక్క ముక్కలో తెగ్గొట్టి చెప్పేశారు. అది హైకమాండ్‌ చేతుల్లో ఉంది అంటూ దాటవేత ధోరణి అవలంభించారు. ఇది బీజేపీకి మంచి టానిక్‌లా దొరికింది. అటు కాంగ్రెస్‌ను, ఇటు ఖర్గేపై విమర్శలు చేయడానికి అవకాశం దొరికినట్లయ్యింది. ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య సెటైర్లతో విరుచుపడ్డారు. ‘ ఇక్కడ హైకమాండ్‌ అంటే ఎవరు? మీరు కాదా?, కాంగ్రెస్‌ చీఫ్‌గా ఉన్న మీరు హైకమాండ్‌ కాదా?, మరి ఇంకా హైకమాండ్‌ ఎవరు? అని తేజస్వి సూర్య పంచ్‌లు వేశారు. కాంగ్రెస్‌ హైకమాండ్‌ కనపడదు.. అది మనకు కనిపించదు.. వినిపించని దెయ్యంలా ఉంటుందేమో. మనం మాత్రం కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఉందని ఫీలవుతూ ఉండాలి’ అని సెటైరికల్‌ పంచ్‌లు విసిరారు.The Congress High Command is like a ghost. It is unseen, unheard, but always felt. Even the Congress President, who people thought is the high command, whispers its name and says it’s not him. So eerie! https://t.co/GpcdHWQbSs— Tejasvi Surya (@Tejasvi_Surya) June 30, 2025

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement