
కొచ్చి: లింగమార్పిడి జంటకు చెందిన సంతానానికి జనన ధృవీకరణ పత్రంలో అమ్మా, నాన్నా కాలమ్లకు బదులు కేవలం పేరెంట్ అని రెండు సార్లు సూచించాలని కేరళ హైకోర్టు స్థానిక యంత్రాంగానికి ఆదేశాలిచ్చింది. అబ్బాయిగా మారిన జహాద్, అమ్మాయిగా మారిన జియా పావల్లు తమ సంతానానికి లింగ నిష్పాక్షిక(జెండర్ న్యూట్రల్) జనన ధృవీకరణ సర్టిఫికేట్ ఇవ్వాలని ఈ జంట చేసిన అభ్యర్థనను కేరళలోని కోజికోఢ్ మున్సిపల్ కార్పొరేషన్ నిరాకరించింది.
అప్పటికే జహాద్ను తల్లిగా, జియాను తండ్రిగా పేర్కొంటూ జారీచేసిన బర్త్ సర్టిఫికేట్లో సవరణలు చేయడం కుదరదని తేల్చి చెప్పింది. దీంతో ఈ జంట కేరళ హైకోర్టును ఆశ్రయించగా జస్టిస్ ఎ.ఎ. జియాద్ రహమాన్ సారథ్యంలోని ధర్మాసనం కేసును విచారించి పై విధంగా తీర్పునిచ్చింది. జహాద్ వాస్తవానికి జన్మతః అమ్మాయి. గర్భంతో ఉన్నప్పుడు అబ్బాయిగా మారడానికి ప్రయత్నించినా కుదర్లేదు. దాంతో బిడ్డను జన్మనిచ్చి తర్వాత అబ్బాయిగా మారింది.