
ప్రకృతి ప్రసాదం తునికి పండు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: తునికి పండు.. దీని విలువ తెలిసినవారు, దీన్ని రుచి చూసినవారు మళ్లీ మళ్లీ కోరుకుంటారు. చెప్పుకుంటూ పోతే ఈ పండు ప్రత్యేకతే వేరు. కేవలం నెలరోజులు (మార్చి మూడోవారం నుంచి ఏప్రిల్ రెండో వారం వరకు) మాత్రమే లభించే ఈ పండ్ల చెట్లను ఎవరూ పెంచరు. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవడమూ ఉండదు. అడవిలో మాత్రమే లభించే తునికిపండ్లను గిరిజనులు మాత్రమే సేకరిస్తారు. అత్యఽ దిక పోషక విలువలు, ఫైబర్ కలిగి ఉన్న తునికి పండ్లు పూర్తి ప్రకృతి ప్రసాదించిన వరమని, ఈ పండ్లు అమూల్యమైనవని వైద్యులు సైతం చెబుతుంటారు. అడవిలో మాత్రమే ఉండే తునికి చెట్లకు ఎలాంటి రసాయనిక ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేయడమనేదే ఉండదు. దీంతో ఇవి పూర్తి సహజసిద్ధమైనవి. పండు పైభాగంలో గట్టిగా ఉంటుంది. పండిన తరువాత ఈ పైభాగాన్ని తేలికగా తీసేయవచ్చు. లోపల గుజ్జు, గింజలు ఉంటాయి. ఈ గుజ్జు రుచి అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతం తునికి పండ్లు నిజామాబాద్ నగరంలో లభ్యమవుతున్నాయి. ఇందల్వాయి మండలంలోని పాటి తండాకు చెందిన కొందరు గిరిజనులు వీటిని అడవిలో సేకరించి నగరానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఎక్కువగా రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, భూపాలపల్లి, ములు గు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్కర్నూల్, మహబూబాబాద్ జిల్లాలతోపాటు నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి, సిరికొండ, గాంధారి మండలాల్లోని అటవీప్రాంతాల్లో తునికి పండ్లు లభిస్తాయి. అద్భుతమైన సహజసిద్ధ పోషక విలువ తెలిస్తే ఈ పండ్లను కొని తినడం మానరు.
అడవిలో మాత్రమే లభించే పోషకాల గని
ప్రయాసతో సేకరిస్తున్న గిరిజనులు
ఏడాదిలో నెలరోజులు మాత్రమే లభ్యం
నెలరోజులు మాత్రమే..
తునికిపండ్లు ఏడాదిలో నెల రోజులు మాత్రమే ఇందల్వాయి, సిరికొండ, గాంధారి మండలాల్లోని అట వీ ప్రాంతాల్లో లభిస్తాయి. వీటిని సేకరించేందుకు అనేక ఇబ్బందులు పడతాం. తీసుకొచ్చిన తర్వాత మాగబెట్టేందుకు రెండు రోజులు పడుతుంది. ఆ తర్వాత నిజామాబాద్ వరకు బస్సులో పండ్లను తీసుకొచ్చి అమ్ముకుంటాం. ఎండలో కూర్చుని రోజంతా అమ్మితే రూ.400 వరకు వస్తాయి.
– వాలియా, పాటితండా, ఇందల్వాయి మండలం