
పచ్చిధాన్యం కొనుగోళ్లకు వ్యాపారులు సై
మోర్తాడ్(బాల్కొండ): పచ్చి ధాన్యంను సైతం కొనుగోలు చేయడానికి వ్యాపారులు ఆసక్తి చూపుతున్నారు. పచ్చి ధాన్యంను కొనుగోలు చేస్తామని వ్యాపారులు తమ ఏజెంట్ల ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. దొడ్డు రకాలైతే రూ.2,200, సన్న రకా లైతే రూ.2,300 ధరను క్వింటాలుకు చెల్లిస్తామని వ్యాపారులు చెబుతున్నారు. పొలాల వద్దకే వచ్చి ధాన్యం తూకాలు చేస్తున్నారు.
ప్రభుత్వం సన్నాలకు బోనస్ ప్రకటించడంతో..
యాసంగి సీజనులోని సన్న రకాలకు బోనస్ చెల్లించడానికి ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో రైతులు తమ పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించడానికి మొగ్గుచూపుతున్నారు. దీంతో దళారులు, వ్యాపారులు తమ వ్యాపారం కోసం వరి ధాన్యంను సేకరించుకోవడానికి ప్రత్యామ్నయ ఏర్పాట్లు చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసే వరి ధాన్యంకు తేమ శాతం 17కు మించి ఉండకూడదనే నిబంధన ఉంది. తేమ శాతం తక్కువగా ఉండాలంటే ధాన్యంను ఎండబెట్టాల్సి ఉంటుంది. వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటే చేతికి వచ్చిన ధాన్యం నీటిపాలై నష్టపోతామని కొందరు రైతులు భావిస్తున్నారు. దీంతో పలువురు రైతులు పొలాల వద్దనే పచ్చి ధాన్యంను వ్యాపారులకు విక్రయిస్తున్నారు. రైతుల నుంచి పచ్చి ధాన్యంను సేకరిస్తే తూకం వేసిన ధాన్యానికి సొమ్మును 15 రోజుల నుంచి 25 రోజుల గడువులోగా చెల్లించడానికి వ్యాపారులు అంగీకరిస్తున్నారు.
జిల్లాలో సన్న రకాలే ఎక్కువ..
యాసంగి సీజనులోనూ సన్న రకాలకు బోనస్ చెల్లిస్తామని ప్రభుత్వం వెల్లడించడంతో జిల్లాలో 80 శాతం సన్న రకాలే సాగు చేశారు. దొడ్డు రకాలు కేవలం 20 శాతం మాత్రమే ఉంది. విదేశాలకు బాయిల్డ్ బియ్యంను ఎగుమతి చేసే వ్యాపారులు తమ వ్యాపారం కోసం పచ్చి ధాన్యంను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించే ధాన్యం మిల్లర్ల వద్దకు చేరాలంటే ఎక్కువ సమయం పడుతుంది. పచ్చి ధాన్యంను కొనుగోలు చేస్తే వెంటవెంటనే బాయిల్డ్ మిల్లులకు తరలించుకోవచ్చని వ్యాపారులు భావిస్తున్నారు.
దొడ్డు రకాలకు రూ.2,200, సన్న
రకాలకు రూ.2,300గా ధర నిర్ణయం
పొలాల వద్దనే తూకం చేస్తున్న వైనం